మొన్న ఆగస్టు పన్నెండున డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి. దేశంలో అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాలకు బీజం వేసిన దార్శనికుడిగా ఆయనను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. స్వతంత్ర భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే అందుకు దోహదపడగలవని బలంగా నమ్మి ఇస్రో, పిఆర్ఎల్, ఐఐఎం-ఎ, ATIRA వంటి సంస్థలను స్థాపించి దేశంలో సాంకేతిక విప్లవానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. శాస్త్ర సాంకేతిక విద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఆయన ఎంతగా తపించేవారో ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
ప్రజలలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించకపోతే దేశం పురోగతి చెందలేదనే స్పష్టత సారాభాయ్ కి ఉంది. దీనిని సాధించాలంటే సైన్స్ బోధన మరింత వినూత్నంగా జరగాలనీ, శాస్త్రవేత్తలు యువతతో కలిసి పని చేసి వారిలో శాస్త్రీయ దృక్పధం అలవర్చాలనీ ఆయన భావించేవారు. చిన్నతనంలో ఇంటి వద్దనే ఎంతో మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం బహుశా ఆయనలో సైన్స్ బోధన పట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి పునాదిగా పనిచేసింది అనుకోవచ్చు.
ఈ ఆసక్తి వల్లనే 1963 లో ఆయన ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి సైన్స్ విద్యను సాధారణ పౌరులకు అందేలా చేసేందుకు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ తొలి ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు సాధించడంతో 1966 లో ‘కమ్యూనిటీ సైన్స్ సెంటర్’ అనే సంస్థను స్థాపించారు. దీనిని సారాభాయ్ గురువు, నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంలోనే ఆయన ‘ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది” అనే తన ప్రముఖ ఉపన్యాసాన్ని వెలువరించారు.
ఈ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ దేశంలో ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ప్రయత్నాల వల్లనే దేశంలో సైన్స్ మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. డాక్టర్ సారాభాయ్ మరణం తర్వాత ఈ సెంటర్ పేరును విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ (VASCSC ) అని మార్చడం జరిగింది.

ఈ VASCSC వెబ్సైటు ప్రకారం “పాఠశాల, కళాశాలల విద్యార్థులను తమ పాఠ్య పుస్తకాల పరిధి నుండి బయటకు తీసుకువచ్చి స్వంతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించేలా చేయడం ఈ సంస్థ ధ్యేయం. విద్యార్థులు సైన్స్, గణితాలను మరింత మెరుగ్గా, దీర్ఘకాలం గుర్తు ఉండేలా నేర్చుకునేందుకు గానూ ఎన్నో వినూత్న విధానాలను ఈ సంస్థ రూపొందించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పరిపాలకులు, సామాన్య ప్రజానీకం అందరూ కలిసి సైన్స్ ను అర్ధం చేసుకుంటూ శాస్త్రీయ దృక్పధాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం.”
స్థాపించిన నాటి నుండి ఈ సంస్థ సైన్స్ ప్రదర్శనలు నిర్వహించడం, ఓపెన్ లేబొరేటరీ లను, మాథ్స్ లాబొరేటరీలను, సాంకేతిక ఆటస్థలాలను నిర్మించడం వంటి ఎన్నో వినూత్న విధానాల ద్వారా శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజలలో పెంపొందించే ప్రయత్నాలు చేసింది. దేశంలో శాస్త్రీయ విద్యా కార్యక్రమానికి ఈ రోజు ఈ సంస్థే వెన్నుముకగా ఉంది. ఎంతో నాణ్యమైన విద్యా కిట్లు, వనరులను ఈ సంస్థ రూపొందించింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం రూపొందించిన సైన్స్ ఎక్సప్రెస్ ఈ సంస్థ చేసిన అనేక వినూత్న కార్యక్రమాలలో ప్రముఖమైనది. ఎన్నో సంవత్సరాల పాటు నడిచిన ఈ సైన్స్ ఎక్సప్రెస్ ను ఇండియన్ రైల్వేస్ సహకారంతో 16 బోగీలు ఉన్న ఒక రైలులో ఏర్పాటు చేశారు. ఎన్నో శాస్త్రీయ నమూనాలను ఇందులో ప్రదర్శించారు. అక్టోబర్ 2007 లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చే ప్రారంభించబడిన ఈ రైలు దేశమంతా దాదాపు ఒక లక్ష ఇరవై రెండువేల కిలోమీటర్లు ప్రయాణించింది. 1404 రోజుల పాటు 391 ప్రాంతాలలో ఈ రైలు ప్రదర్శన జరగగా దాదాపు కోటి ముఫై మూడు లక్షల మంది దీనిని సందర్శించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువమంది సందర్శించిన సైన్స్ ప్రదర్శనగా ఇది ఎంతో గుర్తింపు పొందింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆరు సార్లు తన స్థానాన్ని నమోదు చేసుకుంది.
డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ను గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో మృణాళిని సారాభాయ్ ఇలా అన్నారు. “విక్రమ్ సారాభాయ్ తాను ఉద్యోగ విరమణ చేసాక పిల్లలతో, యువతతో ఎక్కువ సమయం గడిపి వారిలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తానని అంటుండేవారు”. అయితే ఆ కోరిక తీరకుండానే సారాభాయ్ తక్కువ వయసులోనే అకాలమరణం చెందారు. అయితే ఆయన ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ఆ దిశగా తన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది.
P.S: ఈ వ్యాసకర్త మీనా రఘునాధన్ విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు
–Based on a piece by Meena
(Post 31)