నవంబర్ 14 మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాము అని మనందరికీ తెలుసు. ఆ రోజున దేశవ్యాప్తంగా పిల్లలకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాటిలో చాలావరకూ కథలు, ఆటల చుట్టూ తిరిగేవే.
ఈ ఏడాది గుజరాత్ ప్రభుత్వం పిల్లల జీవితంలో కథల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవం (బాలవర్త దిన్) గా ప్రకటించింది.
నవంబర్ 15 గుజరాత్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, కథా రచయిత అయిన గిజుభాయి బదేక జయంతి. బాల సాహిత్య బ్రహ్మ అని ప్రేమగా అందరూ పిలుచుకునే గిజుభాయి ఎంతో సుసంపన్నమైన బాల సాహిత్య నిధిని భవిష్యత్తు తరాలకు అందించారు. ఈయన కథలను తమ తల్లిదండ్రుల నుండి, తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుండి పెరిగిన ఈ తరం పిల్లలు ఎందరో ఉన్నారు.

1885 లో జన్మించిన గిజుభాయి ఒక జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1920 ల ప్రాంతంలో తన కొడుకు పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు. భావనగర్ లోని దక్షిణామూర్తి విద్యాసంస్థలలో చేరి మాంటిస్సోరీ మేడం నుండి పొందిన స్ఫూర్తితో విద్యార్థి కేంద్రక విద్యపై ఎంతో కృషి చేశారు. ఈ రంగంలో తన అనుభవాలు 1920 లో దక్షిణామూర్తి బాలమందిర్ ఏర్పాటుకు దోహదపడ్డాయి. పిల్లలతో ఆయన చేసిన చర్చల వలన వారు ఏవైనా విషయాలను నేర్చుకోవాలంటే కథల ద్వారా చెబితే ఎంత ప్రయోజనకరమో ఆయన అర్థం చేసుకున్నారు. దానితో అనేక నేపథ్యాలకు చెందిన పిల్లల కథలను సేకరించడం, స్వయంగా కథలు రాయడం, చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల సంపూర్ణ వికాసానికి తోడ్పడేది కథలే అని ఆయన బలమైన నమ్మకం.
ఆ సమయంలో గుజరాతీ భాషలో బాలసాహిత్యం ఎక్కువగా లేదు. పిల్లవాడిని ఒక సంపూర్ణ వ్యకిగా గుర్తించి వారికోసం ప్రత్యేకమైన వనరులను, సాహిత్యాన్ని సృజించిన గుర్తింపు గిజుభాయికే దక్కుతుంది.
వార్తను శాస్త్ర అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: పిల్లల కథ అని పేరు పెట్టిన ప్రతి కథా పిల్లల కథ కాలేదు. ఏ కథ నుండి అయితే పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారో అదే నిజమైన పిల్లల కథ. పిల్లలకు సరళంగా, క్లుప్తంగా ఉండే కథలు కావాలి. వారి చుట్టూ ఉన్న పరిసరాలు కథలలో ప్రతిబింబించాలి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పాటలు ఉంటే వారికి గుర్తు పెట్టుకోడానికి సులభంగా ఉంటాయి. అందుకే అవి పిల్లల కథలలో భాగం కావాలి.
అయితే ఆ సమయంలో ఇటువంటి కథలు ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే జానపద సాహిత్యంలో అలాంటి కథల్ని గుర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దక్షిణామూర్తి సంస్థలోని ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న విద్యార్థులను వారి వారి ఇండ్లలో, గ్రామాలలో, పరిసరాలలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల జానపద కథలను సేకరించమని కోరారు.
వార్తనుశాస్త్ర లో ఆయన ఇలా రాశారు. జానపద సాహిత్యాన్ని వెతకాలంటే నువ్వు పట్టణాన్ని వదిలి గ్రామాలకు, అక్కడి నుంచి అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్ళాలి. పళ్లూడిన ఒక బామ్మ తన పనులు ముగించుకుని కూర్చోగానే పిల్లలు చుట్టూ చేరినప్పుడు చెప్పే కథలు వినాలి. అవి బామ్మ పంచిన ప్రసాదంలాగా పిల్లల నుండి పిల్లలకి మొత్తం ఊరంతా చేరిపోతాయి.
గిజుభాయి, ఆయన సహోద్యోగులు అటువంటి కథల కోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టారు. ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు సేకరించారు. వాటిని ఆయన తనదైన శైలిలో చిన్న చిన్న వాక్యాలలో, పదాలతో ఆటల రూపంలో, సంభాషణల రూపంలో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి ఉదయం పిల్లలకు ఒక కథ చెప్పేవారు ఆయన. ఆ కథను పిల్లలు మధ్యాహ్నానికి నాటకం రూపంలో చూపించాలి. కొద్ది రోజులలోనే పిల్లలు ఎలా తయారయ్యారు అంటే పదాలను తేలికగా గుర్తుపెట్టుకునేవారు. వారి నోటి వెంట ప్రాస అలవోకగా వచ్చేసేది. కథ మధ్యలో మర్చిపోతే వారే ఏదో ఒక కథను అల్లేసే వారు. అందుకే ఆయన ఇలా రాశారు: నువ్వు కొంతమంది పిల్లలను పోగేసి వారికి ఒక కథ చెప్పావంటే వారు నీకు పది కథలు చెబుతారు.
కథల కోసం, జానపద సాహిత్యంకోసం గిజుభాయి పరిశోధన రాష్ట్రాన్ని దాటి దేశమంతా విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఎంతో బాల సాహిత్యాన్ని సేకరించి వాటిలోని సారూప్యతలను, వైవిధ్యాలను గుర్తించారు. వాటికి గుజరాతీ స్థానికతను జోడించి తిరిగి రాశారు. అవి గుజరాతీ కథలుగా, గిజుభాయ్ కథలుగా పేరుపొందాయి.
గిజుభాయి కథలు ఎంతో సరళంగా, ప్రాసతో కూడి ఉంటాయి. అందుకే అవి వినేవారిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఆయన కథలలో పిల్లలకు తెలిసిన జంతువులు, పక్షులు ఉంటాయి. అవి మనుషుల్లా మాట్లాడుతూనే తమవైన జంతు లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, జంతువులకు మధ్య సంబంధాలు, సంభాషణలు పిల్లలను విస్మయానికి గురిచేసి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కథలలో రాజులు, రాణులు, రాజకుమారులతో పాటు సాధారణ దర్జీలు, మంగలులు, కుమ్మరులు కనపడతారు. మానవ సహజమైన బలాలు, బలహీనతలను, దురాశను, అసూయను ఈ పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. చాలా కథలు అనగనగా అంటూ మొదలై చివరికి సుఖాంతమవుతూ వందేళ్ల తర్వాత కూడా అనేక తరాల పిల్లలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి.
గిజుభాయి జన్మదినాన్ని, ఆయన కథలను గుర్తు చేసుకునేందుకు నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పిల్లలంతా డిజిటల్ పరికరాలకు అతుక్కుని పోతున్న ఈ రోజుల్లో పిల్లలకే కాదు పెద్దవారికి కూడా కథలు చెప్పడంలోని ఆనందాన్ని గుర్తు చేసేందుకు కనీసం ఒక రోజైనా ఉండాలేమో.
నా తోటి పెద్దలకు ఒక విన్నపం. ఎన్నో కథలు మనకు ఉన్నాయి. వాటిని మీ పిల్లలకు చెప్పండి. అందంగా, పూర్తిగా వాటిలో లీనమై చెప్పండి. పిల్లలు కూడా అంతే లీనమై ఆనందిస్తారు. వారికేదో జ్ఞానాన్ని అందివ్వాలని కథ చెప్పకండి. ఏ ఉద్దేశ్యంతోనూ కథను మొదలుపెట్టకండి. కథలోకి వెళుతూ పిల్లలను మీతో పాటు దానిలోకి తీసుకుని వెళ్ళండి. ఒక మంత్ర ప్రపంచం మీ ముందు నిలుస్తుంది. మీ పిల్లలతో కలిసి అందులో వివరించండి. ఆస్వాదించండి.
మీ పిల్లలతో మంచి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నారా? కథలతో ప్రారంభించండి
Post 44
Based on a piece by Mamata