శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే మాఘ మాసం ఐదవ రోజున మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. వేసవి మొదలవడానికి సుమారు నలభై రోజుల ముందుగా, హోళీ పండుగ కన్నా ముందుగా వచ్చే పండుగ ఇది.

పసుపు ఈ పండుగకు సంబంధించిన రంగు. అందుకు తగిన కారణం లేకపోలేదు. ఎన్నో రకాల పసుపు రంగు పూలు పూసే సమయం ఇది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో ఈ సమయంలో పూసే ఆవ పూలు ఆ ప్రాంతం మొత్తాన్ని కొన్ని నెలలపాటు బంగారు రంగులోకి మారుస్తాయి. దేశంలోని అనేకప్రాంతాలలో ఈ పండుగ నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. పసుపు సరస్వతి దేవికి సంబంధించిన రంగు కూడా.
రుతువులు మారే కాలాన్ని సూచించడమే కాకుండా ఈ పండుగకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నాకు ఇష్టమైనది కవి కాళిదాసుకు సంబంధించిన కథ. ఆ కథ తెలియని వారి కోసం క్లుప్తంగా ఇక్కడ చెబుతాను. ఉత్తరభారతదేశంలో ఒక రాజ్యానికి చెందిన యువరాణి ఎంతో తెలివైనది. పొడుపుకథల పోటీలో తనను ఓడించిన వాడినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టింది. ఎంతోమంది యువకులు ముందుకు రావడం, వారిని ఆమె తిరస్కరించడం జరిగాయి. వారిలో ఆ దేశ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. యువరాణి తనను తిరస్కరించడంతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి కుమారుడు, తనలా తిరస్కరించబడిన మరికొందరితో కలిసి ఆమెకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తమకన్నా తెలివైన స్త్రీ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాజ్యంలో అందరికన్నా తెలివితక్కువ యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్లకు ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు ఒక చెట్టుపై ఎక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ కనిపించాడు. దానితో పాటు తానూ పడిపోతాననే గ్రహింపు లేని అతనికన్నా తెలివితక్కువ వాడు ఉండడు అనుకుని అనేక ప్రయత్నాల ద్వారా ఇతను ఎంతో తెలివైన వాడు అని యువరాణిని నమ్మించారు. యువరాణి అతనిని వివాహమాడింది కానీ ఆ రహస్యం ఎంతోకాలం దాగలేదు. అతను మందబుద్ధి కలవాడని గ్రహించిన యువరాణి అతనిని ఇంటి నుండి తరిమివేసింది. అతను ఎంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై అక్కడ ఉన్న నదిలో స్నానమాచరించమని అతనికి చెప్పింది. అంతే, ఆ తర్వాత అద్భుతం జరిగింది. నదీ స్నానం చేసి వణుకుతూ బయటకి వచ్చిన అతని నోటినుండి అప్రయత్నంగా దేవిని స్తుతిస్తూ శ్యామలా దండకం వెలువడింది! అపార భాషా సంపద, జ్ఞానం, తెలివి, కవిత్వం అతనికి వశమయ్యాయి. ఆ కాళిదాసే తర్వాత కాలంలో అభిఙ్ఞానశాకుంతలం, కుమారసంభవం, రితుసంహార, మేఘదూత వంటి కావ్యాలను రచించాడు. మాఘమాసంలో ఐదవ రోజున సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి అటువంటి జ్ఞానసంపదలు తమకు కూడా అందించమని భక్తులంతా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఇది సరస్వతీ దేవి జన్మదినం అనికూడా అంటారు.
రెండవది శివపార్వతులకు సంబంధించిన కథ. శివుని ప్రియమైన భార్య సతీదేవి మరణించింది. దానితో ఆయనను తీవ్రమైన దుఃఖం, కోపం ఆవరించాయి. దానితో ప్రపంచాన్ని, దానికి సంబంధించిన తన బాధ్యతలను విస్మరించి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే జననమరణ చక్రం సాఫీగా తిరగాలంటే ప్రపంచానికి శివుని అవసరం ఉంది. అప్పట్లో కల్లోలం సృష్టిస్తున్న ఒక రాక్షసుడిని అంతం చేయాలంటే శివునికి పుట్టిన బిడ్డ వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అవసరం మరింత ఉంది. సతి అప్పటికే హిమాలయ రాజుకు పుత్రికగా పార్వతి రూపంలో పునర్జన్మించి ఉంది. కానీ ఆయనను ఎవరూ ధ్యానం నుండి మరల్చలేకపోయారు. అప్పుడే దేవతలంతా కలిసి కామదేవుడిని పంపారు. ఆయన విసిరిన మన్మధ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు. కానీ ఆయన అత్యంత క్రోధంతో మూడవ కన్ను కూడా తెరవడంతో కామదేవుడు అక్కడికక్కడే భస్మమయిపోయాడు. అయితే అనుకున్నది జరిగింది. శివుడు పార్వతిని చూడడం ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగింది. మన్మధుని భార్య రతి దుఃఖంతో 40 రోజులు కఠోర తపస్సు చేసింది. దానితో కరుణించిన శివుడు ఏడాదికి ఒకరోజు కాముడు తన శరీరాన్ని ధరిస్తాడని వరం ఇస్తాడు. ఆ రోజే వసంత పంచమి.
దక్షిణ భారతం కన్నా ఉత్తర, తూర్పు భారతదేశంలో వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. కనీసం నాకు తెలిసిన మా తమిళ కుటుంబాలలో ఈ పండుగను జరుపుకోవడం చూడలేదు. కానీ నా బెంగాలీ స్నేహితుల ఇళ్లల్లో ఎన్నో సార్లు వసంత పంచమి వేడుకలకు వెళ్లి ఉండటాన వారెంత శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారో తెలిసింది. మంచి పుసుపు వస్త్రాలు ధరించే అవకాశం వచ్చింది.
మనవెన్ని సంప్రదాయాలు, వేడుకలు, కథలో కదా. ఇవే మన జీవితాలకు మరిన్ని రంగులద్ది ఆసక్తికరంగా మార్చేవి.
–Based on a piece by Meena