గుడ్ గర్ల్ సిండ్రోమ్

గత కొన్ని సంవత్సరాలుగా నేను మహిళలకు సంబంధించిన ఎన్నో సదస్సులలో, సభలలో మాట్లాడాను. ఎంతో మంది యువతులకు గైడ్  గా వ్యవహరించాను. నా  టీం లో కూడా ఎంతోమంది ఆడవాళ్ళతో పనిచేసాను.

ఎక్కడ ఏ స్త్రీతో మాట్లాడినా నేను ఇచ్చే సందేశం ఒకటే “మంచి అమ్మాయిగా ఉండాల్సిన పనిలేదు” అని. ఇలా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏమిటంటే: నీ కుటుంబం, నీ సమాజం నువ్వు  ఉండాలని అనుకుంటుందో దానికి పరిమితమవ్వాల్సిన పనిలేదు; ఈ పని నీది అని ఎవరో నీ నెత్తిమీద రుద్దినంతమాత్రాన ఆ పనిని నువ్వు చేయనవసరం లేదు; అందరిపట్లా విధేయత చూపించాల్సిన అవసరం లేదు; నీకు ఏది సరైనది అని తోస్తే, ఏది నీకు మంచిది అని బలంగా అనిపిస్తే దాని కోసం పోరాడు, అవిధేయత చూపించు, ప్రశ్నించు.

అయితే ఈ విషయాన్ని నేను సరిగా వారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోయాను. చాలా సందర్భాలలో ఇది ఎలా అర్ధమయ్యేదంటే నేనేదో అమ్మాయిలను చెడగొడుతున్నట్లు, ప్రతిదానికీ తిరగబడమని వారికి చెబుతున్నట్లు ఉండేది. బహుశా నేను ఇలా చెప్పకూడదేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను.

అయితే “గుడ్ గర్ల్ సిండ్రోమ్” అనే పదం ఎక్కడో నా కంటపడేవరకూ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాను. దీని గురించి మరింత లోతుగా చదవడం మొదలుపెట్టాకే ఇదేదో ఒక పదం మాత్రమే కాదనీ, ఒక పరిశోధన చేయడానికి తగిన అతిపెద్ద సబ్జెక్టు అనీ అర్ధమయ్యింది.

2011 లో బెవర్లీ ఎంగెల్స్ రాసిన “ది నైస్ గర్ల్ సిండ్రోమ్” అనే పుస్తకం ఈ పదాన్ని సరిగ్గా వివరించగలుగుతుంది. దీని అర్ధం ఏమిటో నా మాటల్లో చెప్పేబదులు ఎంగెల్స్ ఏమి చెప్పిందో చెబుతాను.

“ఒక మంచి అమ్మాయి తన గురించి తాను ఏమనుకుంటుంది అనే దానికన్నా ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తన స్వంత భావోద్వేగాల కన్నా ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తుంది”

“మంచి అమ్మాయిలు చెప్పిన మాట వింటారు. వారికి ఏది చేయమని  చెబితే అది చేస్తారు. ఎవరితో అయినా వాదన పెట్టుకునే బదులు వారు చెప్పిందేదో చేసేస్తే పోతుంది అనుకుంటారు. విధి ఎలా ఉంటే  అలా జరగనీ అనుకుంటారు. వారు నమ్మిన వాటికోసం గట్టిగా నిలబడేందుకు కూడా భయపడతారు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంటారు. వారి  మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా భయపడతారు. దానితో మంచి అమ్మాయిలు ఎంతో నటించాల్సి వస్తుంది”

  • బెవర్లీ ఎంగెల్స్ 2011 లో రాసిన నైస్ గర్ల్ సిండ్రోమ్  పుస్తకం నుండి 

ఈ మంచి అమ్మాయిల లక్షణాలు ఇలా ఉంటాయి: ఇతరులు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి భిన్నంగా ఉండాలంటే భయం, తమ మనసులో ఉన్నది చెబితే ఇతరులు ఎక్కడ బాధపడతారో అనే భయం; అన్నిటిలో రాణించాలనే కోరిక; ఘర్షణలకు దూరంగా ఉండడం; నియమాలన్నిటినీ ప్రశ్నించకుండా పాటించడం. వారికి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా తిరస్కరించేందుకు భయపడతారు.

IWD

ఇది నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ విధంగా మంచి అమ్మాయిలం అనిపించుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనిపిస్తుంది. అరవైలలో పుట్టిన నాలాంటి మహిళలం మా  వస్త్రాలు, కేశాలంకరణ విషయాలలో మా తల్లులతో దాదాపు యుద్ధాలు చేసాం; ప్రొఫెషనల్ చదువులు చదివి ఉద్యోగాలు చేసేందుకు గొంతులు పోయేలా పోట్లాడాం; ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయాలపై కూడా యుద్ధాలే చేసాం; వైవాహిక బంధంలోనూ గౌరవాన్ని పొందేందుకు తగాదాలు పెట్టుకున్నాం. ఇవన్నీ మమ్మల్ని బలంగా మార్చాయి. అలా బలాన్ని సంపాదించుకుంటూనే మా దారులను మేము మలుచుకున్నాం.

అయితే మేము కూడా మాకన్నా ముందు తరం మహిళలు చూపించిన స్ఫూర్తినే అందిపుచ్చుకున్నాం. వారే అసలైన మార్గదర్శకులు. మొట్టమొదటి తరపు ఇంజినీర్లు, మొదటి డాక్టర్లు, పరదాలు దాటి మొదటి సారి బయటకి వచ్చిన మహిళలు, ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు, కుటుంబంతో, సమాజంతో పోరాడి మరీ తమ స్వంత దారులు ఏర్పాటు చేసుకున్న ఆ  నలభైలు,యాభైలలో పుట్టిన మా ముందు తరపు మహిళలు ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. వారి ధైర్యసాహసాలతో పోలిస్తే మాకు సగం కూడా లేవు. అయినా వారు చూపించిన బాటలోనే ముందుకు సాగాము.

ఈ రోజున ఇవన్నీ అత్యంత సాధారణమైన విషయాలు కావచ్చు. ఈనాటి అమ్మాయిలు వీటికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మాలాగా వారికోసం వారు దృఢంగా నిలబడాల్సిన సందర్భాలు లేకపోవచ్చు. అందుకే సమాజం వారికి చూపించిన దారిలో నడవడమే తప్ప వారికంటూ కొత్త దారులు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే స్ఫూర్తి ఈ తరం అమ్మాయిలలో కొరవడింది అనిపిస్తుంది. అప్పట్లో మేము కొత్త దారులలో నడిచినందుకు చెడ్డవారిమి అనిపించుకున్నాం. అయితే ఈ రోజు ఆ దారిలో నడవమనే సమాజం సూచిస్తుంది. ఆ దారులలో నడిచిన వారినే మంచివారు అంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కొత్త తరపు అమ్మాయిలు కూడా కొత్త దారులు కనుగొనాలనీ, నూతన శిఖరాలు అందుకోవాలనీ నా ఆకాంక్ష.

బహుశా ప్రతి తరం ఇలా తమ తరవాతి తరం వారిని విమర్శించడం అనేది అత్యంత పురాతనమైన విషయం కావచ్చు. అయినప్పటికీ ఇదే నా ఆకాంక్ష

–Translated by Bharathi Kode, based on a piece by Meena Raghunathan

తొలితరం మహిళా ఇంజనీర్: లలిత: Engineer A. Lalitha

దేశంలోని అత్యున్నత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అయిన సెప్టెంబర్ 15 ను ఇంజనీరింగ్ డే గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో కృషి చేసిన విశ్వేశ్వరయ్య వరదలను అరికట్టే నిర్మాణాలకు రూపకల్పన చేయడం, డాం లు రిసర్వాయిర్ ల నిర్మాణం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆయన ప్రారంభించిన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలువబడుతుంది.

ఈ రోజు దేశంలో వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుండి ప్రతి ఏటా వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు బయటకి వస్తున్నారు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో వింత కాదు కానీ కొన్నేళ్ల క్రితం వరకూ అది ఆడపిల్లలకు సంబంధించిన రంగం కాదు. ఏ ఆడపిల్లా నడవడానికి సాహసించని ఈ దారిలో నడిచిన తొలితరం అమ్మాయిలలో ఎ. లలిత ఒకరు. ఈ ఇంజనీరింగ్ డే ఆమెను గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం.

1919 ఆగస్టు 27 న ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో ఏడుగురు పిల్లలలో ఒకరిగా లలిత జన్మించారు. ఆమె తండ్రి ఇంజనీర్. కొంత విశాల దృక్పధం కలిగిన వాడైనప్పటికీ పిల్లల పెంపకం విషయంలో సమాజ కట్టుబాట్లను మీరడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఆ కుటుంబంలో అబ్బాయిలు అంతా ఉన్నత చదువులకు వెళితే అమ్మాయిలకు మాత్రం ప్రాధమిక స్థాయి వరకు చదువుకోగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. లలితకు కూడా 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. కాకపోతే ఆమె పెళ్ళి తర్వాత కూడా పదవ తరగతి వరకు చదువుకునేందుకు ఆమె తండ్రి ఏర్పాట్లు చేశారు.

అయితే దురదృష్టవశాత్తూ ఆమె వివాహ జీవితం ఎంతో కాలం సాగలేదు. ఆమెకు 18 సంవత్సరాల వయసులో భర్త మరణించారు. అప్పటికే ఆమెకు చిన్న పాప ఉంది. నాలుగు నెలల పాపతో చిన్న వయసులోనే విధవగా మారిందామె. ఆ రోజుల్లో విధవల పట్ల సమాజం ఎంతో వివక్ష చూపించేది. అయితే లలితలోని పోరాట గుణం ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించేలా చేసింది.

పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పెద్ద చదువులు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంది. ఆమె తండ్రి అందుకు మద్దతు ఇచ్చారు. మద్రాస్ లోని క్వీన్ మేరీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది లలిత. ఆ తరువాత ఇక ఆమె వెనుకడుగు వేయలేదు.

ఆ రోజుల్లో స్త్రీలు చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఆ మెడికల్ రంగంలోకి వెళితే తాను తన కూతురికి తగిన సమయం ఇవ్వలేనేమో అని లలిత అనుకుంది. తన కుటుంబంలో అనేకమంది ఇంజినీర్లు ఉండడంతో తాను కూడా ఇంజనీర్ అయితే అనే ఆలోచన వచ్చింది. అయితే అప్పటికి మనదేశంలో ఇంజనీరింగ్ విద్య ఇంకా తొలిదశలోనే ఉంది. మహిళలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది అసలు కలలో కూడా ఊహించని విషయం. ఏ యూనివర్సిటీ మహిళలకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చేది కాదు. ఈ విషయంలో మళ్ళీ ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఆమెకు సహకరించారు. గుండీ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ చాకో ను ఒప్పించి ఆమెకు ఇంజనీరింగ్ లో ప్రవేశం కల్పించారు. డైరెక్టర్, ఇన్స్ట్రుక్షన్ కు కూడా దరఖాస్తు పంపి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ కాలేజీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చారు. లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు.

ఆ విధంగా వందలాది మంది అబ్బాయిలు మాత్రమే ఉన్న కళాశాలలో ఒకే ఒక్క మహిళా విద్యార్థిగా లలిత చేరారు. అయితే ఆమెకు అది ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. ఆమెకోసం ఒక ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆమె కూతురిని తన అన్న ఇంటిలో వదిలి వచ్చారు. ప్రతి వారాంతం వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేవారు. ఆమె కళాశాల జీవితం, విద్యాభ్యాసం మొదట బాగానే ఉన్నా కొన్నిరోజులకి తాను అక్కడ ఒంటరిదానిని అనే భావన ఆమెలో మొదలయ్యింది. అదే సమయంలో ఆమె తండ్రి మరింత మంది మహిళలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఇవ్వమని కళాశాల అధికారులను ఒప్పించారు. కళాశాల వారిచ్చిన ప్రకటన చూసి తర్వాత ఏడాది సివిల్ ఇంజనీరింగ్ లో లీలమ్మ జార్జ్, పికె త్రెసియా అనే మరో ఇద్దరు మహిళలు చేరారు.

అప్పటి నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ విద్యను అభ్యసించవలసి ఉంటుంది. లలిత జమల్పూర్ రైల్వే వర్కుషాప్ లో తన ఏడాది అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసుకుని 1943 లో ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత ఏడాది అప్రెంటిస్ షిప్ నిబంధన ఎత్తివేయడంతో ఆమె జూనియర్ మహిళా ఇంజినీర్లు  ఇద్దరూ కూడా అదే ఏడాది పట్టా పొందారు.

అప్పటికే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చిన లలిత ఇక ప్రొఫెషనల్ గా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే తన కుమార్తె శ్యామల తన మొదటి ప్రాధాన్యతగా భావించిన లలిత ఆమె సంరక్షణకు ఇబ్బందికలగని విధంగా ఉండే ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్స్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాక తన తండ్రికి పరిశోధనలలో సహాయం చేసేందుకు గానూ చెన్నై కు మారింది. ఆ పరిశోధనలు తన మేధస్సును పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ ఆర్ధిక ఒత్తిడుల కారణంగా వాటిని మధ్యలో వదిలి మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేందుకు కలకత్తా వెళ్ళింది. మళ్ళీ ఆమె కూతురి సంరక్షణ బాధ్యత వాళ్ళ అన్న తీసుకున్నారు.

అక్కడ తాను నేర్చుకున్న విద్యనంతా పనిలో ప్రదర్శించే అవకాశం లలితకు కలిగింది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో సహా అనేక భారీ ప్రాజెక్ట్ లకు ఆమె పని చేశారు. ట్రాన్స్మిషన్  లైన్లు, సబ్ స్టేషన్ లేఔట్, రక్షణ పరికరాలు డిజైన్ చేయడం లలిత పని. ఆమె మేధస్సు, శక్తీ సామర్ధ్యాలు ఈ సమయంలో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

1953 లో లండన్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆమెను అసోసియేట్ మెంబెర్ గా తన కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. చక్కని చీరకట్టులో లండన్ లోని ఫ్యాక్టరీ ని సందర్శించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 1964 లో న్యూయార్క్ లో జరిగిన తొలి ఇంజినీర్లు, శాస్త్రవేత్తల అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందింది. ఇటువంటి సదస్సుకు హాజరయిన తొలి భారతీయ మహిళా ఇంజనీర్ ఆమె. ఆ తర్వాత కాలంలో ఆమె ఎన్నో మహిళా ఇంజినీర్ల సంస్థలలో సభ్యురాలిగా కొనసాగారు. లండన్ లోని విమెన్ ఇంజనీరింగ్ సొసైటీ లో కూడా 1965 లో సభ్యత్వం పొందారు.

1977 లో పదవీ విరమణ చేసేవరకు లలిత అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ అసోసియేట్స్ (తర్వాత కాలంలో దీనిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ టేకోవర్ చేసింది) లోనే కొనసాగారు. మహిళలకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాలలోకి బాట వేసిన తొలి తరం మహిళలలో లలిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమె కూతురు శ్యామల కూడా తల్లి లాగానే సైన్స్, మాథెమాటిక్స్ చదువుకుని మాథెమాటిక్స్ టీచింగ్ లో స్థిరపడ్డారు. తన తల్లి జీవితం, పని నుండి తాను ఏమి నేర్చుకున్నదో శ్యామల ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. “ఆమె జీవితం నుండి నేను నేర్చుకున్నది అంతులేని ఓర్పు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నాణ్యమైన పని చేయడంపై దృష్టి. ఇతరులు మన జీవితంలోకి ఏదో ఒక కారణంతోనే వస్తారు, ఆ వచ్చిన ప్రయోజనం నెరవేరగానే మన జీవితం నుండి వెళ్ళిపోతారు అనే వారు ఆమె” .

రిటైర్ అయిన కొద్దికాలానికే 1979 లో తన అరవై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో లలిత మరణించారు. ఈ రోజున ఎంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కెరీర్ చేపడుతున్నప్పటికీ అందుకు దారి వేసిన ఇటువంటి మహిళల దీక్ష, పట్టుదల గురించి చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తల్లిగా తన బాధ్యతలను ఒంటి చేత్తో లాగుతూనే అటు చదువులో ప్రతిభను కనపరచడమే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన లలితను ఈ సందర్భంలో స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

Based on a piece by Mamata

జవాజా ప్రాజెక్ట్

అకాడెమిక్ సంస్థల పట్ల తరచుగా వినిపించే ఒక ఫిర్యాదు ఏమిటంటే ఆ సంస్థలు సాధారణ ప్రజా జీవితానికి దూరంగా ఉండి సామాజిక వాస్తవాలను అర్ధం చేసుకోలేవు. అందువల్లనే సామాజిక సమస్యలకు ఈ సంస్థలు సూచించే పరిష్కారాలు కూడా ఎంతో డొల్లగా ఉంటాయి అని.

Jawaja bag
A prized Jawaja bag

అయితే అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కలిసి అమలు చేసిన జవాజా ప్రాజెక్ట్ మాత్రం ఇందుకు ఒక మినహాయింపు అనే చెప్పాలి.

1975 లో ఐఐఎం, అహ్మదాబాద్ తొలి ఫుల్ టైం డైరెక్టర్ అయిన రవి మత్తయి భారతదేశం ఎదుర్కుంటున్న పేదరిక సమస్యను కార్పొరేట్ మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన డైరెక్టర్ గా పదవి నుండి తప్పుకుని ఉండడంతో తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కు కేటాయించారు.

రాజస్థాన్ లోని కరువు పీడిత జిల్లా అయిన జవాజాను ఈ ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.మొత్తం 200 గ్రామాలు, 80000 జనాభా. బీడు భూములు, నీటి కరువు తో పాటు ఇతర భౌతిక వనరులేమీ లేని ఈ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. అందరి దృష్టిలో ఏ వనరులూ లేని ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం. కానీ రవి మత్తాయి దృష్టి అందుకు భిన్నమైంది. ఆయన దృష్టిలో మానవ వనరులను మించిన వనరు లేదు.    

ఆ ప్రాంతాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అక్కడ దాదాపు మూడువందల ఏళ్లుగా తోళ్ళతో హస్తకళా ఉత్పత్తులు చేసే సంప్రదాయం ఉన్నదని తెలిసింది. అక్కడి ప్రజలకు నేతపనిలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలను ఉపయోగించి వారికి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రొఫెసర్ మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను రంగంలోనికి తీసుకువచ్చారు. జవాజా ప్రజల జీవనోపాధులపై పని చేసి వారి సాధికారత వైపు కృషి చేయాలనేది ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఈ ప్రయత్నంలో మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన అశోక్ ఛటర్జీ తో పాటు రెండు సంస్థలకు చెందిన అనేకమంది ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు. 

హస్తకళాకారులకు సమకాలీన సంస్కృతికి తగిన డిజైన్ లను, నిర్వహణా నైపుణ్యాలను అందివ్వడం, అందుకు అవసరమైన సంస్థలతో వారిని కలపడం ఈ ప్రాజెక్ట్ చేసిన ముఖ్యమైన పని. ఈ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన విలువల ఆధారంగా నిర్వహించబడింది. పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనేవి వాటిలో ముందు వరసలో నిలిచే విలువలు. అక్కడి ప్రజలు ఈ సంస్థలకు చెందిన నిపుణుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక ఎత్తైతే ఆ నిపుణులకు కూడా తమ నైపుణ్యాలను సామాజిక సమస్యల పరిష్కారాలకు వినియోగించేందుకు ఒక అవకాశం దొరికింది. ఆ హస్తకళాకారులు తయారుచేసే వస్తువుల విలువగొలుసు లో వీలైనంత ఎక్కువభాగంపై ఆ కళాకారులు, ప్రజలకే నియంత్రణ ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి సంబంధించిన ఉత్పత్తి మరియు మార్కెట్ అంశాలలో ఆ కళాకారులకే అధికారం ఉండేలా చూడడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. కళాకారులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూరింది.

జవాజా బ్యాగ్:

మొదట తోళ్లతో స్కూల్ బాగ్స్, ఫ్లోర్ మాట్ లు వంటి సాధారణ, సంప్రదాయ ఉత్పత్తులతో ప్రారంభించినా చిన్నగా ఆఫీస్ లకు అవసరమైన వస్తువులు, వినూత్నమైన బ్యాగ్లు, ఖరీదైన అలంకరణ వస్తువుల వైపు ప్రాజెక్ట్ మలుపు తిరిగింది.

ఈ ప్రక్రియలో ఎదుర్కున్న సమస్యలు తక్కువేమీ కాదు. పాత నైపుణ్యాలతో, సాంకేతిక పరికరాలు, పనిముట్లతో అధునాతన ఉత్పత్తులు తయారుచేయాల్సి రావడం ఒక సమస్య అయితే వాటి నాణ్యతను నియంత్రించడం మరొక ముఖ్యమైన సమస్య. 

కొత్త డిజైన్ లకు వచ్చేసరికి ముందుగా కమ్యూనిటీ లోనుండి కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలి అనుకున్నారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. నాణ్యత నియంత్రణకు వచ్చేసరికి, మొదటగా ఈ క్వాలిటీ కంట్రోల్ ను ఆయా సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహించినా తర్వాత కాలంలో కళాకారుల బృందాలే ఆ బాధ్యత తీసుకుంటాయి అనేది ప్రాజెక్ట్ ఉద్దేశం. అది కూడా అనుకున్నంత వేగంగా సాగలేదు. కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు, వాటికి తగిన ముడి పదార్ధాలు కొనుగోలు చేసేందుకు తగిన నిధులు, వనరుల కొరత అయితే నిరంతరం ఉండేది.

ఇన్ని సమస్యల మధ్య అమలు జరిగినా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం సాధించడమే కాదు సుస్థిరంగా కొనసాగింది కూడా.

ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలలో మొదటిది ఆర్టిసన్స్ యలయన్సు ఆఫ్ జవాజా అనే స్వయంప్రతిపత్తి గల సంస్థను, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముడిపదార్ధాలు కొనుగోలు, బ్యాంకు వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు, సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ విషయాలు అన్నీ ఈ సంస్థలే స్వయంగా నిర్వహించుకునేవి. ఈ సంస్థలు ఈ నాటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను తయారుచేస్తూ, మార్కెట్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఉత్పత్తులకు సంబంధిత మార్కెట్లలో ఎంతో విలువ ఉంది.

ఇక రెండవ విజయం అభివృద్ధి రంగంపైన ఈ ప్రాజెక్ట్ చూపించిన ప్రభావం. ఈ గ్రాస్ రూట్ సంస్థ నుండి నేర్చుకున్న పాఠాల నుండే రూరల్ మానేజ్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ ఉండాలి అనే ఆలోచనకు తద్వారా ఆనంద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మానేజ్మెంట్ ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంస్థకు రవి మతాయి తో పాటు ఐఐఎం, అహ్మదాబాద్ కు చెందిన మరొక ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కమల చౌదరి, డాక్టర్ మిచెల్ హల్సే లు ఒక రూపాన్ని ఇచ్చారు. 

పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనే విలువల ఆధారంగా ప్రజా సంస్థలను నిర్వహించడం, వారి జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా జవాజా ప్రయోగం అభివృద్ధి రంగంలో ఒక నూతన ఆలోచనా దృక్పధాన్ని ప్రవేశపెట్టి ఎంతో ప్రభావవంతమైన ప్రయోగంగా నిలిచిపోయింది.

ఇటువంటి ప్రయత్నాల గురించి మరింత మంది తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి, చర్చ చేయాలి.

–Based on a piece by Meena

యుద్ధం-శాంతి: War and Peace

మరొక యుద్ధం మొదలయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ దృశ్యాలు ఇంకా కళ్ళముందు నుండి పూర్తిగా చెదరకముందే ఉక్రెయిన్ నుండి హృదయవిదారకమైన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ బలాబలాలు తేల్చుకునేందుకు తలపడతుండగా మనలాంటి సాధారణ ప్రజలు మాత్రం తమ జీవితాలు తల్లకిందులై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలుముకున్న పొగ, ధూళి వెనుక అనిశ్చితితో, భయంతో బిక్కచచ్చిపోయిన మనుషులు కనిపిస్తున్నారు. వారిది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ.

ఇటువంటి నిరాశానిస్పృహలు అలుముకున్న సందర్భాలలోనే మనకు ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, గొంతులు అవసరమవుతాయి. అయితే అటువంటి రెండు శక్తివంతమైన గొంతులను ఇటీవల కాలంలో కోల్పోవడం మన దురదృష్టం. వాటిలో ఒకటి ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ది. ఆయన డిసెంబర్ 2021 లో మరణించారు. మరొకరు పోయిన నెలలో తన 95 వ ఏట మరణించిన థిచ్ న్హాట్ హాన్.

థిచ్ వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువు. రచయిత, కవి, గురువు, శాంతిదూత. మధ్య వియత్నాంలోని హ్యూ పట్టణంలో 1926 అక్టోబర్ 11 న జన్మించిన ఆయన అసలు పేరు న్యూయెన్ దిన్ లాంగ్. పదహారేళ్ళ ప్రాయంలోనే ఒక జెన్ ఆశ్రమంలో భిక్షువుగా చేరారు. 1949 లో సన్యాసం స్వీకరించాక తన పేరు థిచ్ న్హాట్ హాన్ గా మార్చుకున్నారు. తర్వాత ఆయన థాయ్ అనే పేరుతో ప్రపంచప్రసిద్ధి చెందారు థాయ్ అంటే గురువు అని అర్ధం.

1950 లలో తన యుక్త వయసులోనే థిచ్ వియత్నాం లో బౌద్ధాన్ని పునరుద్ధరించే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైగన్ యూనివర్సిటీ లో లౌకికత మీద అధ్యయనం చేసిన మొదటి భిక్షువులలో ఆయన ఒకరు. సైకిల్ తొక్కిన మొదటి ఆరుగురు భిక్షువులలో కూడా థిచ్ ఒకరు.  

1950 ల మధ్యలో వియత్నాం యుద్ధ సమయంలో తమ ధ్యాన మందిరాలలో ధ్యానం చేసుకుంటూ తమదైన సన్యాస జీవితాన్ని ఆచరించాలా లేక యుద్ధంలో, బాంబు దాడులలో దెబ్బతిని బాధపడుతున్నవారికి ఆపన్నహస్తం అందించాలా అనేది అక్కడి భిక్షువులు, సన్యాసినులు ఎదుర్కున్న అతి పెద్ద సమస్య. థిచ్ ఈ రెండు పనులూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు బౌద్ధమత ఆచారాలను ఎంతో లోతుగా అవగాహన చేసుకుని ఆ ఆచారాలకి అనుగుణంగా జీవనం గడుపుతూనే మరొకవైపు తన దేశం, అక్కడి ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు తనవైన ప్రయత్నాలు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ యూత్ అండ్ సోషల్ సర్వీస్ పేరుతో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక సంస్థను స్థాపించారు. అందులో యువ భిక్షువులతో సహా దాదాపు 10000 మంది స్వచ్చంద కార్యకర్తలు తమ సేవలందించారు. వీరంతా యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి గాయపడిన వారికి సేవలందివ్వడమే కాకుండా శరణార్ధులకు పునరావాస వసతుల ఏర్పాట్లు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో యువత కేవలం సామాజిక కార్యకర్తలు మాత్రమే కాదు.బౌద్ధ సూత్రాలైన అహింస, కరుణ లను శ్రద్ధగా ఆచరించే అభ్యాసకులు కూడా.

1961 లో అమెరికా లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ లో తులనాత్మక మత అంశాలపై బోధించేందుకు థిచ్ అమెరికా కు వెళ్లారు. ఆ తరువాత ఏడాది  బుద్ధిజం పై పరిశోధన, బోధన చేసేందుకు  కొలంబియా యూనివర్సిటీ కు వెళ్లారు. 1963 లో అమెరికా-వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా బౌద్ధులు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామ్యాలయ్యేందుకు గానూ ఆయన వియత్నాం తిరిగి వచ్చారు. అప్పటికే ఎంతో మంది బౌద్ధ సన్యాసులు ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకుని ఉండడంతో ఈ ఉద్యమం ప్రపంచ దేశాలన్నిటి దృష్టినీ ఆకర్షించింది. ఆయన మరొక సారి అమెరికాలో, యూరప్ లో పర్యటించి వియత్నాంలో నెలకొని ఉన్న భయానక పరిస్థితుల గురించి వివరించి అక్కడ శాంతి నెలకొల్పవసిందిగా కోరారు. 1960 ల మధ్యలో వియత్నాం యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆయన మానవ హక్కుల నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ ను కలిసి ఈ ఘర్ణణ వాతావరణానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిందిగా ఆయనను ఒప్పించారు.

1964 లో థిచ్ ఒక బౌద్ధుల వారపత్రికలో యుద్ధానికి వ్యతిరేకంగా ఒక కవిత రాశారు. దానిలో కొంతభాగం ఇలా ఉంది.

ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారంతా సాక్షులుగా ఉండండి.

నేను ఈ యుద్ధాన్ని అంగీకరించలేను

ఎప్పటికీ, ఏనాటికీ

నేను మరణించేలోగా ఈ మాట కొన్ని వేల సార్లు చెప్పవలసి రావచ్చు

తన జంటపక్షి కోసం మరణానికైనా సిద్ధపడే పక్షి లాంటి వాడిని నేను

విరిగిన ముక్కు నుండి రక్తం ఓడుతున్నా ఇలా అరుస్తూనే ఉంటాను

“జాగ్రత్త, వెనుకకు తిరుగు

వాంఛ,  హింస, ద్వేషం, దురాశ అనే అసలైన శత్రువులతో పోరాడు.

ఈ కవిత ఆయనకు యుద్ధ వ్యతిరేక కవి అనే పేరుతో పాటు కమ్యూనిస్ట్ భావజాలంగల వ్యక్తి అనే ముద్ర కూడా తీసుకువచ్చింది. ఆయన ఇలా అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపిస్తూ మరొక వైపు అటు ఉత్తర, దక్షిణ వియత్నాంల మధ్య జరుగుతున్నా ఘర్షణలో ఏ వర్గం వైపు నిలబడకపోవడంతో అటు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, ఇటు కమ్యూనిస్ట్ లు కానీ ప్రభుత్వాలు కూడా ఆయనకు 39 సంవత్సరాల పాటు  దేశ బహిష్కరణను విధించాయి. దానికి స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు “నేను పాశ్చాత్త్య దేశాలలో ఎక్కువకాలం ఉండాలనుకోలేదు. వారు నన్ను వివిధ అంశాలపై ప్రసంగించేందుకు ఆహ్వానించారు. నేను దానిని యుద్ధానికి వ్యతిరేకంగా నా గొంతు వినిపించేందుకు అవకాశంగా మలుచుకున్నాను. లేకుంటే వియత్నాం కు బయట ఉన్న ప్రజలకు వియత్నాం ప్రజల ఆకాంక్షలు అర్ధం కావు. వియత్నంలో బౌద్ధులం అత్యధిక సంఖ్యలో ఉన్నాం. మేము యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గం వైపూ నిలబడే వారిమి కాదు. మాకు కావాల్సింది యుద్ధంలో గెలవడం కాదు. యుద్ధం జరగకుండా ఉండడం. అందుకే వియత్నంలో యుద్ధం జరుపుతున్న ఏ ఒక్క వర్గానికీ నా మాటలు రుచించలేదు. అందుకే నన్ను నా ఇంటికి రాకుండా నిషేధించారు”

తన దేశ బహిష్కరణ కాలంలోనే థిచ్ అనేక దేశాలు పర్యటించి యుద్ధం, హింసలకు వ్యతిరేకంగా తన గళం విప్పి ప్రపంచ శాంతిదూతగా మారారు. ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన విస్తృతంగా రాశారు కూడా. అంతేకాక మైండ్ఫుల్ నెస్ ఆర్ట్, శాంతియుత జీవన విధానాలపై కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడమే కాక ఎన్నో వ్యాసాలు రాశారు. 1970 లో యూనివర్సిటీ అఫ్ సోర్బోన్, పారిస్ లో బుద్ధిజం పై ఉపన్యాసకులు, పరిశోధకులుగా పనిచేశారు. 1975 లో పారిస్ లో స్వీట్ పొటాటో కమ్యూనిటీ ని స్థాపించారు. తర్వాత 1982 లో ఫ్రాన్స్ లోని నైరుతి భాగంలో ఒక విశాలమైన భూభాగంలో ఒక బౌద్ధ ఆరామాన్ని స్థాపించారు. ప్లమ్ విలేజ్ అని పిలవబడే ఈ ఆరామంలో దాదాపు 200 మంది బౌద్దులు నివసించేవారు. అంతేకాక ప్రతిఏటా ప్రపంచంలోని నలుమూలలనుండి ఎనిమిది వేల మందికిపైగా ఈ ఆరామానికి మైండ్ ఫుల్ లివింగ్ కు సంబంధించిన అంశాలు నేర్చుకునేందుకు వచ్చేవారు.

2005 లో వియత్నాం లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనను దేశంలో ప్రవేశించేందుకు, ప్రయాణించేందుకు, బోధన చేసేందుకు అనుమతి ఇచ్చింది. తన యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. 2014 లో తన 88 వ ఏట వచ్చిన గుండె నొప్పి కారణంగా శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైనప్పటికీ ఆయన తన నిర్మలమైన వ్యక్తిత్వంతో అందరికీ స్ఫూర్తినిస్తూనే వచ్చారు. 2022 జనవరి 22 న తన 95 ఏళ్ళ వయసులో వియత్నాం లోని హ్యూ ప్రాంతంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు.

యుద్ధమేఘాలు అలుముకుని ఉన్న ఈ సమయంలో ఆయనే కనుక ఉండి ఉంటే మరొక యుద్ధాన్ని చూసి ఎంతో దుఃఖించి ఉండేవారు. అన్ని సమస్యలకు యుద్ధం మాత్రమే పరిష్కారం కాదనీ, నమ్మకం, సహానుభూతి, సోదరభావం అనే మార్గాల ద్వారా కూడా పరిష్కారాలు సాధించవచ్చనీ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసేవారు. ఆయన మాటలను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుందాం “చెడు ఆలోచనలను, అభిప్రాయాలను క్షిపణులు, తుపాకులు, బాంబులు నాశనం చేయలేవని మనకు తెలుసు. ప్రేమపూర్వకమైన సంభాషణ, సహానుభూతితో అవతలి వారి ఆలోచనలను వినడం ద్వారా మాత్రమే చెడు ఆలోచనలను సరిచేసుకోగలము. కానీ ఈ పద్ధతిపై మన నాయకులెవరికీ శిక్షణ లేదు. అందుకే వారు తీవ్రవాదాన్ని అణచడానికి ఆయుధాలపై ఆధారపడతారు”

ఈ సందర్భంలో ఆయన మరొక మాటను కూడా గుర్తు చేసుకోవాలి. “ఆశ అన్నిటికన్నా ముఖ్యం. అది ఉండడం వలన ప్రస్తుతం ఎంత కఠినంగా ఉన్నా భరించగలం. భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ ఉన్నప్పుడే ఈ రోజు ఎదురైన కష్టాన్ని ఓర్చుకునేందుకు సిద్ధపడతాం”

భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో. …

–Based on a piece by Mamata

.

వసంత పంచమి: Basant Panchami

శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే మాఘ మాసం ఐదవ రోజున మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. వేసవి మొదలవడానికి సుమారు నలభై రోజుల ముందుగా, హోళీ పండుగ కన్నా ముందుగా వచ్చే పండుగ ఇది.  

Basant Panchami

పసుపు ఈ పండుగకు సంబంధించిన రంగు. అందుకు తగిన కారణం లేకపోలేదు. ఎన్నో రకాల పసుపు రంగు పూలు పూసే సమయం ఇది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో ఈ సమయంలో పూసే ఆవ పూలు ఆ ప్రాంతం మొత్తాన్ని కొన్ని నెలలపాటు బంగారు రంగులోకి మారుస్తాయి. దేశంలోని అనేకప్రాంతాలలో ఈ పండుగ నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. పసుపు సరస్వతి దేవికి సంబంధించిన రంగు కూడా.

రుతువులు మారే కాలాన్ని సూచించడమే కాకుండా ఈ పండుగకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నాకు ఇష్టమైనది కవి కాళిదాసుకు సంబంధించిన కథ. ఆ కథ తెలియని వారి కోసం క్లుప్తంగా ఇక్కడ చెబుతాను. ఉత్తరభారతదేశంలో ఒక రాజ్యానికి చెందిన యువరాణి ఎంతో తెలివైనది. పొడుపుకథల పోటీలో తనను ఓడించిన వాడినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టింది. ఎంతోమంది యువకులు ముందుకు రావడం, వారిని ఆమె తిరస్కరించడం జరిగాయి. వారిలో ఆ దేశ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. యువరాణి తనను తిరస్కరించడంతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి కుమారుడు, తనలా తిరస్కరించబడిన మరికొందరితో కలిసి ఆమెకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తమకన్నా తెలివైన స్త్రీ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాజ్యంలో అందరికన్నా తెలివితక్కువ యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్లకు ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు ఒక చెట్టుపై ఎక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ కనిపించాడు. దానితో పాటు తానూ పడిపోతాననే గ్రహింపు లేని అతనికన్నా తెలివితక్కువ వాడు ఉండడు అనుకుని అనేక ప్రయత్నాల ద్వారా ఇతను ఎంతో తెలివైన వాడు అని యువరాణిని నమ్మించారు. యువరాణి అతనిని వివాహమాడింది కానీ ఆ రహస్యం ఎంతోకాలం దాగలేదు. అతను మందబుద్ధి కలవాడని గ్రహించిన యువరాణి అతనిని ఇంటి నుండి తరిమివేసింది. అతను ఎంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై అక్కడ ఉన్న నదిలో స్నానమాచరించమని అతనికి చెప్పింది. అంతే, ఆ తర్వాత అద్భుతం జరిగింది. నదీ స్నానం చేసి వణుకుతూ బయటకి వచ్చిన అతని నోటినుండి అప్రయత్నంగా దేవిని స్తుతిస్తూ శ్యామలా దండకం వెలువడింది! అపార భాషా సంపద, జ్ఞానం, తెలివి, కవిత్వం అతనికి వశమయ్యాయి. ఆ కాళిదాసే తర్వాత కాలంలో అభిఙ్ఞానశాకుంతలం, కుమారసంభవం, రితుసంహార, మేఘదూత వంటి కావ్యాలను రచించాడు. మాఘమాసంలో ఐదవ రోజున సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి అటువంటి జ్ఞానసంపదలు తమకు కూడా అందించమని భక్తులంతా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఇది సరస్వతీ దేవి జన్మదినం అనికూడా అంటారు.

రెండవది శివపార్వతులకు సంబంధించిన కథ. శివుని ప్రియమైన భార్య సతీదేవి మరణించింది. దానితో ఆయనను తీవ్రమైన దుఃఖం, కోపం ఆవరించాయి. దానితో ప్రపంచాన్ని, దానికి సంబంధించిన తన బాధ్యతలను విస్మరించి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే జననమరణ చక్రం సాఫీగా తిరగాలంటే ప్రపంచానికి శివుని అవసరం ఉంది. అప్పట్లో కల్లోలం సృష్టిస్తున్న ఒక రాక్షసుడిని అంతం చేయాలంటే శివునికి పుట్టిన బిడ్డ వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అవసరం మరింత ఉంది. సతి అప్పటికే హిమాలయ రాజుకు పుత్రికగా పార్వతి రూపంలో పునర్జన్మించి ఉంది. కానీ ఆయనను ఎవరూ ధ్యానం నుండి మరల్చలేకపోయారు. అప్పుడే దేవతలంతా కలిసి కామదేవుడిని పంపారు. ఆయన విసిరిన మన్మధ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు. కానీ ఆయన అత్యంత క్రోధంతో మూడవ కన్ను కూడా తెరవడంతో కామదేవుడు అక్కడికక్కడే భస్మమయిపోయాడు. అయితే అనుకున్నది జరిగింది. శివుడు పార్వతిని చూడడం ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగింది. మన్మధుని భార్య రతి దుఃఖంతో 40 రోజులు కఠోర తపస్సు చేసింది. దానితో కరుణించిన శివుడు ఏడాదికి ఒకరోజు కాముడు తన శరీరాన్ని ధరిస్తాడని వరం ఇస్తాడు. ఆ రోజే వసంత పంచమి.

దక్షిణ భారతం కన్నా ఉత్తర, తూర్పు భారతదేశంలో వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. కనీసం నాకు తెలిసిన మా తమిళ కుటుంబాలలో ఈ పండుగను జరుపుకోవడం చూడలేదు. కానీ నా బెంగాలీ స్నేహితుల ఇళ్లల్లో ఎన్నో సార్లు వసంత పంచమి వేడుకలకు వెళ్లి ఉండటాన వారెంత శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారో తెలిసింది. మంచి పుసుపు వస్త్రాలు ధరించే అవకాశం వచ్చింది.

మనవెన్ని సంప్రదాయాలు, వేడుకలు, కథలో కదా. ఇవే మన జీవితాలకు మరిన్ని రంగులద్ది ఆసక్తికరంగా మార్చేవి.

–Based on a piece by Meena

పర్యాటకానికి లోటెక్ అడ్డంకులు: Tourist Spots

ఇంతకుముందు వ్యాసంలో టూరిజం కు అడ్డంకిగా ఉన్న కొన్ని హైటెక్ అంశాల గురించి ప్రస్తావించాము. పోయిన నెలలో నా మైసూర్ ప్రయాణం దేశంలో టూరిజం విస్తరించడానికి అడ్డంకిగా ఎన్నో లోటెక్ అంశాలను గుర్తు చేసింది. 

మైసూర్ ప్యాలస్ (మరమ్మత్తు పనుల కారణంగా సగం ప్యాలస్ లోకి సందర్శకులకు అనుమతి లేనే లేదు) లో కానీ, జగన్మోహన్ ప్యాలస్ లో కానీ ఆర్ట్ గ్యాలరీ ని సందర్శించాలంటే సందర్శకులు చెప్పులు విడిచి లోపలి వెళ్ళాలి. కొన్ని పవిత్రమైన శాలిగ్రామాలు లోపల ఉన్నందున ఈ నిబంధన ఉంది. అయితే ఆ శాలిగ్రామాలు మందపాటి వెండి తలుపుల వెనక ఉన్నాయి. నిజానికి చెప్పులు విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు. జగన్మోహన్ ప్యాలస్ లో గ్యాలరీ లోపల ఇతర ప్రదర్శనలతో పాటు ఒక వినాయక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి దానిని సందర్శించుకోవాలనుకునేవారి వరకు చెప్పులు తీసి వెళ్లమనే అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా ఎంతో పెద్ద ప్యాలస్లు. ఎన్నో అంతస్తులలో విస్తరించి ఉన్నాయి. ప్రతిరోజూ సందర్శకులు వస్తూనే ఉంటారు. చెప్పులు తీసి తిరగడం సౌకర్యమూ కాదు, వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా మంచిదీ కాదు. ఒకవేళ తప్పని సరిగా చెప్పులు తీసి వెళ్ళాలి అంటే సాక్స్ వంటివి ఏర్పాటు చేసి గ్యాలరీ సందర్శన ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకుని, శుభ్రపరచి తిరిగి వాడుతూ ఉండొచ్చు. లేదా మరేదైనా పరిష్కారం ఆలోచించవచ్చు. నా భర్త రఘు డయాబెటిక్ పేషెంట్. ఏదైనా చిన్న గాయమైనా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అని ఈ రెండుచోట్లా చెప్పులు తీయడం ఇష్టం లేక లోపలికి రాలేదు. మిగిలినవారమంతా లోపలోకి వెళ్లాం. లోపల ప్రదర్శనకు ఉన్న అద్భుతమైన కళా ఖండాలను చూసే అదృష్టం ఆయనకు లేకపోవడం ఎంత విచారకరం.

ఇక బృందావన్ గార్డెన్స్ సందర్శన మరొక బాధాకరమైన అనుభవం. మేము అక్కడకి వెళ్లడం కొంచెం ఆలస్యం అయ్యింది. పూర్తిగా చీకటి పడే లోపే గార్డెన్స్ చూడాలని మేమెంతో ఉత్సాహపడ్డాము. మేము అక్కడకి చేరే సమయానికి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గి పూర్తిగా మనుషులను ఎక్కించుకుని రౌండ్ కి తీసుకుని వెళ్ళింది. తర్వాత మళ్ళీ బగ్గి ఎప్పుడు ఉంటుందో అడుగుదామని సమాచారకేంద్రం కోసం వెతికాం. అటువంటిదేమీ ఉన్నట్లు కనిపించలేదు. బగ్గి సమయాలు సూచిస్తూ ఒక బోర్డు కూడా లేదు. ప్రవేశద్వారం దగ్గర అడ్డదిడ్డంగా ఏర్పాటుచేసిన షాప్ లలో కొంతమందిని అడిగాము. ఏ ఇద్దరు చెప్పిన సమాచారమూ ఒకేలా లేదు. సరే ఈ లోపు ఒక కాఫీ తాగి తర్వాత బగ్గి కోసం ఎదురుచూద్దాం అనుకున్నాం. కాఫీ లు ఆర్డర్ చేసాము. మధ్యలో కరెంటు పోవడంతో మాకు కాఫీ ఇవ్వలేదు. బాత్రూం ల కోసం చూసాము. అవి ఎక్కడున్నాయో సూచించే బోర్డు లేమీ కనపడలేదు. అటుఇటు తిరిగి వాటిని వెతికి పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. నలభై ఐదు నిముషాలు దాటినా మళ్ళీ బగ్గి రాలేదు. చీకటి పడింది. ఇక మేము తిరిగివెళ్లిపోదాం అనుకున్నాం.

తర్వాత రోజు మంగళవారం. రైల్ మ్యూజియం చూద్దాం అనుకున్నాం. మేము అక్కడకి చేరేటప్పటికి అది మూసేసి ఉంది. దానితో జూ కి వెళదాం అనుకున్నాం. అయితే జూ కి కూడా ఆ రోజు సెలవు దినమే అట. 

ఆ విధంగా మా మైసూర్ పర్యటన మొత్తం గందరగోళంగా ముగిసింది. మైసూర్ చాలా అందమైన నగరం. పచ్చని, ప్రశాంతమైన ఆ నగరంలో డ్రైవింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మాలో కొంతమంది ప్యాలస్, మ్యూజియం చూడగలిగాం. ఎంతో రుచికరమైన దోసెలు, సాంబారులో ముంచిన ఇడ్లీలు, పుల్లని, రుచికరమైన పచ్చళ్ళు అతి తక్కువ ధరలలో సంతృప్తిగా, శుచికరంగా తినగలిగాము.

ఇక ఆ ట్రిప్ మొత్తంలో అద్భుతంగా అనిపించిన అంశం ఒకటి ఉంది. దాదాపు 99 వేల బల్బులతొ రాత్రిపూట ధగధగా మెరిసిపోతున్న ప్యాలస్ ను చూస్తుంటే ఏదో జానపద కథలోకో, అందమైన కలలోకో జారినట్లు అనిపించింది. ఆదివారాలు, సెలవు దినాలలో ప్యాలస్ ఇలా విద్యుత్ కాంతితో మెరిసిపోతుంది తెలిసింది. మా పాలస్ టూర్ గైడ్ చెప్పి ఉండకపోతే ఆ రోజు అలా వెలిగిపోయే ఒక ప్రత్యేకమైన రోజు అని తెలిపే బోర్డు లు ఏవీ లేనందువల్ల ఈ అందమైన అనుభవాన్ని కూడా కోల్పోయేవాళ్ళం.

భారతదేశం ఎంతో ప్రాకృతిక, సాంస్కృతిక సంపద కలిగిన దేశం. ఇప్పడు చాలామంది భారతీయులు పర్యాటకంపై ఆసక్తి చూపిస్తూ అందుకు సమయం, డబ్బు వెచ్చిస్తున్నారు. అయితే అలా ఆసక్తితో వస్తున్న టూరిస్ట్ లకు కనీస సమాచారం, సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేయడం అంత కష్టమా? వారి పట్ల కొంత గౌరవం చూపించలేమా? ప్రయాణ అనుభవాన్ని అందంగా, ఆహ్లాదంగా, జ్ఞాపకంగా, నేర్చుకునేందుకు ఒక అవకాశంగా మార్చలేమా? చిన్న చిన్న ప్రయత్నాలైనా మొదలుపెట్టలేమా?

  • టూరిస్ట్ ప్రాంతాలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం, టూరిస్ట్ లు  అధికంగా వచ్చే నగరాలలో కూడా అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన టూరిస్ట్ లకు ఎంత వెసులుబాటు ఉంటుంది? 
  • డైరెక్షన్ లు చూపిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం ఉపయోగకరం కాదా? 
  • మైళ్ళకు మైళ్ళు ఉన్న కారిడార్ లలో చెప్పులు లేకుండా తిరిగే అవసరం లేకుండా చూడలేమా? ఒకవేళ తీయవలసిన అవసరం ఉన్న సందర్భాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమా? 
  • అన్ని ప్రదేశాలలోనూ ఒకే సెలవుదినాలు ఉండేలా చూడలేమా? నా ఈ అనుభవం తర్వాత నేను కొంచెం గూగుల్ లో పరిశోధన జరిపిన తర్వాత తెలుసుకున్నదేమంటే ఢిల్లీ జూ కు శుక్రవారం సెలవుదినం. హైదరాబాద్ జూ కు సోమవారం. మైసూర్ జూ, చెన్నై జూ లకు మంగళవారం, ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం కు సోమవారం, ముంబై లోని డాక్టర్ భావు దాజి లాడ్ మ్యూజియం కు బుధవారం, ఢిల్లీ లోని మోడరన్ ఆర్ట్ గ్యాలరీ కు సోమవారం, సైన్స్ సెంటర్ కు శని, ఆదివారాలు. ఇన్ని రకాల సెలవు దినాలు ఎందుకు. అన్ని చోట్లా ఒకటే పాటించవచ్చు కదా. కనీసం ఒక నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నిటికీ ఒకటే షెడ్యూల్ ఉండవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్యాటకులు ఏదైనా ఒకరోజు ఒక నగరంలో గడిపితే కొన్ని ప్రదేశాలు చూడగలుగుతారు, కొన్ని చూడలేరు. 

మనది నిజంగా అత్యద్భుతమైన దేశం. కొద్దిపాటి శ్రద్ద, చిత్తశుద్ధి ఉంటే దీనిని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.

–Based on a piece by Meena

టూరిజం కు హైటెక్ అడ్డంకులు: Tourist Troubles

కోవిద్ వలన చాలాకాలం ఇంటికే పరిమితమయ్యాక కొంచెం ఉధృతి తగ్గాక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము. బెంగుళూరు కు దగ్గరగా ఉండి ఒక్క రోజులో వెళ్ళిరాగలిగే ప్రదేశాల కోసం చూసాం. 

బెంగుళూరు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో హోయసల శైలిలో నిర్మించబడిన గుడి ఉన్న సోమనాథపురం గురించి తెలిసింది. క్రీస్తుశకం 1268 లో అప్పటి హొయసల సేనాధిపతి సోమనాథుడిచే నిర్మించినబడిన చెన్నకేశవుని ఆలయం ఇది. వెంటనే కొద్దిమంది మిత్రులతో కలిసి అక్కడికి బయలుదేరాం.

ఇసుకరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం అది. హొయసల వాస్తుశిల్ప నైపుణ్యాలకు అడ్డం పడుతుంది. 

చెన్నకేశవ అంటే “అందమైన కేశవుడు” అని అర్ధం. ఈ గుడి విష్ణువు యొక్క మూడు అవతారాలైన కేశవ, జనార్ధన, వేణుగోపాలులకి అంకితం చేయబడింది. ప్రధానఆలయం నక్షత్రాకారంలో ఉన్న మండపంపై నిర్మించబడగా ఈ ఒక్కో అవతారానికి ఒక్కో గర్భగుడి నిర్మించబడింది. దీనితో పాటు 64 చిన్న చిన్న మందిరాలు ప్రాంగణమంతా నిండి ఉన్నాయి. ప్రధానాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం నిండా రామాయణ, మహాభారత, భాగవత పురాణాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ పైకప్పులు కూడా ఎంతో అందమైన శిల్పాలతో తామరపువ్వు ఆకారంలో రూపొందించబడింది.  

ఈ ఆలయం నిర్మించడానికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని చెబుతారు. అయితే విదేశీయుల దురాక్రమణ ఫలితంగా నిర్మాణం పూర్తయిన ఈ ఆలయంలోకేవలం 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే పూజలు జరిగాయి. ఆలయం, లోపలి విగ్రహాలు దెబ్బతినడంతో సంప్రదాయం ప్రకారం పూజలు నిలిపివేశారు. 

పూజా పునస్కారాలు నోచుకోని ఆలయమైనా దాదాపు ఏడువందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతో దృఢంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ ఆలయ భారతా పురావస్తు పరిశోధక సంస్థ అధీనంలో ఉండడంతో శుభ్రంగా, పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంది. టాయిలెట్లు కూడా పరిశుభ్రంగానే ఉన్నాయి.

మేము అక్కడకి చేరుకోగానే ప్రవేశ రుసుము వసూలు చేసే కౌంటర్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. దానికి బదులుగా టికెట్ ఇరవై రూపాయలనీ, అక్కడ ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేసి, రుసుము ఆన్లైన్ చెల్లించాలనీ సూచిస్తూ ఫ్లెక్సీ బోర్డులు ఉన్నాయి. అక్కడ దాదాపు ఆరు యాత్రికుల బృందాలు ఉన్నాయి. ఏ ఒక్కరికీ ఆ కోడ్ స్కాన్ కాలేదు. మేము ఆ స్కాన్ తో అలా కుస్తీ పడుతుండగానే ఒక పది నిముషాల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అది పని చేయడం లేదని పురావస్తు శాఖ వారి వెబ్సైటు లో లాగిన్ అయ్యి ప్రవేశరుసుము చెల్లించాలని చెప్పాడు. మేము ఎంతో శ్రద్ధగా ఆ పని మొదలుపెట్టాం. అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేదు. ఆ సైట్ కూడా ఎంతో నెమ్మదిగా లోడ్ అవుతుంది. ఎలాగూ నా స్నేహితులు ఒకరు లాగిన్ అయ్యారు. బృందంలోని ప్రతి ఒక్కరి పేరూ ఒక్కడా రాయాలి.ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వారి ఆధార్ లేదా పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అవన్నీ చేసి నా స్నేహితురాలు రుసుము చెల్లించడానికి ఎంటర్ నొక్కగానే ఇక అది ఒక లూప్ లో తిరుగుతూనే ఉంది తప్ప ఇంతకీ పేమెంట్ పూర్తి కాలేదు. మేము చుట్టూ చూస్తే మిగిలిన యాత్రికుల బృందాలది కూడా అదే పరిస్థితి. డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వగలరా అని అక్కడ గార్డ్ ను అడిగితే అందుకు వీలులేదు అని స్పష్టంగా చెప్పారు. అప్పటికి ఏదో ఒక బృందంలో ఒకరు ఆన్లైన్లో టిక్కెట్లు కొనుక్కోగలిగారు. మేము డబ్బులు చెల్లిస్తాము మాకు కూడా టిక్కెట్లు బుక్ చేయండని అతనిని బ్రతిమిలాడాము. ఆయన పాపం ఎంతో మందికి అలా చేసి ఇచ్చారు.

ఇదంతా దాదాపు ఇరవై నిముషాలు పట్టింది. ఎంతో విసుగు తెప్పించింది. 

ఇక లోపలి వెళ్లి ఆ అద్భుతమైన కట్టడాన్ని చూడగానే ఆ విసుగు అంతా దూరమయ్యింది అనుకోండి. 

అయితే నేను చెప్పదలుచుకున్న విషయమేమంటే ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించాలనుకునే వారందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిందేనా? డిజిటల్ లిటరసీ పక్కన పెట్టండి ఇంకా సంపూర్ణ అక్షరాస్యతే సాధించలేని దేశంలో ఇది అటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అవరోధం కాదా? చాలా మంది వృద్ధులకు ఈ స్కాన్ చేసి డబ్బు చెల్లించే పద్ధతి తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ఇది ఒకరకంగా వారి పట్ల వివిక్ష చూపించడం కదా? సైట్ దగ్గర వైఫై పనిచేయకపోతే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు వెనక్కి వెళ్లాల్సి రావడం ఎంత అన్యాయం? అంతేకాకుండా టికెట్ కొనుక్కునేందుకు ప్రతి ఒక్కరి పేరు రాయవలసిన అవసరం ఏమిటి? కొనేవారి ఆధార్ నెంబర్/ పాన్ కార్డు నెంబర్ ల అవసరం ఏమిటి? ఆ సమాచారం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పౌరుల జీవితాలను సులభతరం చేయడం. ఇక్కడి పద్ధతి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకవేళ సాంకేతికతను మరింతగా ముందుకు తీసుకువెళ్లడమే దీని ఉద్దేశమైతే డిజిటల్ పేమెంట్ చేసేవారికి ఒకరకమైన రుసుము (ఇరవై రూపాయలు) , నేరుగా కొనుక్కునేవారికి ఒకరకంగా రుసుము (ఇరవై ఐదు రూపాయలు) నిర్ణయించవచ్చు. ఆ విధంగా డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయొచ్చు. అంతేకానీ అసలు నేరుగా కొనుక్కునే అవకాశం లేకుండా చేయడం వలన డిజిటల్ పేమెంట్ చేయలేని వారికి ప్రవేశం కఠినతరం చేయడం కాదా. ఒకరకంగా ఇది వారి హక్కులకు భంగం కలిగించడం కాదా? అంతేకాకుండా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరించడం కూడా ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు. 

ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేయాల్సి రావడం ఎంతవరకు సమంజసం?

Blog post 45

–Based on a post by Meena

అదా లవ్ లేస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో మార్గదర్శి: Ada Lovelace

నేను చదివే వార్తా పత్రికలో ప్రతి బుధవారం టెక్నాలజీ కి సంబంధించిన వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. అందులో టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన యువత గురించి, ముఖ్యంగా యువతుల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా నాకు అదా లవ్ లేస్ గుర్తువస్తూ ఉంటుంది. ఈ రోజు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో 19 వ శతాబ్దపు తొలినాళ్లలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ లో తనదైన ముద్ర వేసింది లవ్ లేస్.

ఈ రోజు మనందరం విరివిగా ఉపయోగిస్తున్న కంప్యూటింగ్ సైన్స్ కు పునాది వేసింది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అనీ, అందునా ఒక స్త్రీ అనీ ఎంతమందికి తెలుసు? అదా లవ్ లేస్ కంప్యూటర్ ల గురించి, భవిష్యత్తు ప్రపంచంలో వాటి ప్రాముఖ్యతను గురించీ ఎన్నో ఏళ్ళ క్రితమే అంచనా వేసిన దార్శనికురాలు. అదా లవ్ లేస్ అని పిలవబడే అగస్టా అదా బైరన్ 1815 డిసెంబర్ 10 న లండన్ లో జన్మించింది. అద్భుతమైన కవిగా మనందరికీ తెలిసిన జార్జ్ గోర్డాన్ అలియాస్ లార్డ్ బైరన్, ప్రముఖ గణితవేత్త అన్నబెల్లా మిల్బంకే ల కూతురే అదా.

గొప్ప కవే అయినా పిచ్చివాడిగా పేరు తెచ్చుకున్న బైరన్ కూ గణిత మేధావి అయిన అతని భార్యకూ మధ్య వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. అదా పుట్టిన నెలరోజులకు అన్నబెల్లా లండన్ లోని బైరన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తన కూతురి మీద అతని ప్రభావం పడకూడదని, అతని కవిత్వ వారసత్వం, అతని పిచ్చి లక్షణాలు ఆ అమ్మాయికి కూడా అంటకూడదనీ, ఈ ఊహాత్మక కళాజీవనానికి భిన్నంగా ఆ అమ్మాయి గణితం, సంగీతం, సైన్స్ లలో రాణించాలని ఆ తల్లి కోరిక.

అదా తండ్రి బైరన్ కూడా ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉండగానే లండన్ వదిలి వెళ్ళిపోయాడు. అదాకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా గ్రీస్ లో ఆయన చనిపోయాడు. అదా కు ఆయనతో పరిచయమే లేదు. తన అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. ప్రైవేట్ టీచర్లు తనకు వ్యక్తిగతంగా చదువు చెప్పేవారు. చిన్నతనం నుండీ ఆ అమ్మాయి అనారోగ్యాలతో బాధపడేది. దానితో ఇంటిలోనే చదువు కొనసాగింది.

అదా కు చిన్నప్పటి నుండే యంత్రాలంటే ఆసక్తి. సైన్స్ పత్రికలు విపరీతంగా చదివేది. అయితే తన తండ్రికి ఉన్నట్లు ఊహాశక్తి కూడా ఎక్కువే. తన 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఎగరాలి అనే కోరిక కలిగింది. అది కలగా మిగిలిపోలేదు. చాలా పద్ధతిగా పక్షులు, వాటి రెక్కల మీద పరిశోధనలు చేసి రకరకాల పదార్ధాలతో రెక్కలను తయారు చేసేది. తాను చేసిన పరిశోధనకు ‘ఫ్లయాలజీ’ అని పేరు పెట్టింది. ఈ పరిశోధనంతటికి గానూ తన తల్లి నుండి ఎన్నో చివాట్లు కూడా తింది.

1833 లో లండన్ లో జరిగిన ఒక పార్టీ లో ఆమెను ప్రముఖ గణిత మేధావి చార్లెస్ బాబేజ్ కు ఎవరో పరిచయం చేశారు. బాబేజ్ తాను కొత్తగా సృష్టించిన పరికరాన్ని గురించి ఆమెకు వివరించారు. దానిలో అంకెలు వేసి ఉన్న చక్రాన్ని ఒక హేండిల్ సహాయంతో ఖచ్చితమైన లెక్కలు చేయవచ్చు. దీనిని ఆయన ‘డిఫరెన్స్ మెషిన్” అని పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ పరికరాన్ని స్వయంగా చూసేందుకు గానూ అదా తల్లి ఆ అమ్మాయిని బాబేజ్ ఇంటికి తీసుకుని వెళ్ళింది. అయితే అది అసంపూర్తిగా ఉన్నట్లు అదా గ్రహించింది. దానిని ఇంకా ఎలా మెరుగ్గా చేయవచ్చో సూచిస్తూ బాబేజ్ తో అనేక చర్చలు జరిపింది. అలా మొదలైన వారిద్దరి స్నేహం జీవితాంతం కొనసాగింది. బాబేజ్ కు అప్పటికే నలభై సంవత్సరాలు. భార్యను కోల్పోయారు. అదా ఉత్సాహవంతమైన యువతి. ఆ అమ్మాయిలోని ప్రతిభను గుర్తించిన బాబేజ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు.

తన 19 ఏళ్ళ వయసులో అదా ధనిక కుటుంబానికి చెందిన విలియం కింగ్ ను వివాహమాడింది. వారికి ముగ్గురు పిల్లలు. 1838 లో అదా అతని లవ్ లేస్ కుటుంబ వారసురాలిగా లేడీ అదా కింగ్ గా హోదా పొందింది. అప్పటి నుండి ఆమెను అదా లవ్ లేస్ అని పిలిచేవారు.

ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు అదా తన గణిత పరిశోధనలపైన కూడా ద్రుష్టి పెట్టింది. మరొక మహిళా గణిత మేధావి మేరీ తో ఆమెకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అనేక గణిత విషయాలతో పాటు చార్లెస్ బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ మెషిన్ గురించి కూడా చర్చించుకునేవారు. 1841 లో లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ అయినా ఆగస్టస్ డెమోర్గన్ ఆమెకు ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే మేరీ తో కలిసి అడ్వాన్సుడ్ మాథెమాటిక్స్ నేర్చుకుంటూనే ఉండేది. డిఫరెన్స్ మెషిన్ ఎప్పుడూ ఆమె ఆలోచనలలోనే ఉండేది.

ఆ సమయంలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అదా దానిలో కీలక పాత్ర పోషించింది. ఆ ఇంజిన్ కు సంబంధించి అదా ఒక పేపర్ కూడా రాసింది. అందులో దాని పనితీరును సోదాహరణంగా క్లుప్తంగా వివరించింది. మెషిన్ కోడ్ ద్వారా బాబేజ్ తయారు చేసిన యంత్రం ఎలా ఒక వరుసలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుందో ఆమె అందులో వివరించింది. ఈ పేపర్ లోనే ప్రపంచంలోనే తొలిసారిగా అల్గోరిథం లేదా కంప్యూటర్ ప్రోగ్రాం ను ఆమె పరిచయం చేసింది. ఆ విధంగా చూస్తే ఆమె తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకోవచ్చు.

కంప్యూటింగ్ లో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేసి అదా లవ్ లేస్ నూతన శకానికి తెరతీసింది. అనలిటికల్ ఇంజిన్ కేవలం అంకెలు, లెక్కలకు సంబంధించినది కాదు అని తాను గుర్తించింది. అది కేవలం కాలిక్యులేటర్ కాదు అని గణితానికి మించి ఎన్నో విషయాలలో మనిషికి తోడ్పడగలదని గుర్తించింది. ఉదాహరణకు మ్యూజిక్ కంపోసింగ్ లో కూడా అది సహాయపడగలదు.

1852 లో తన 36 ఏళ్ళ వయసులో అదా మరణించింది. ఆ తర్వాత వందేళ్లకు గానీ ఆమె అనలిటికల్ ఇంజిన్ పై రాసిన నోట్స్ బయటపడలేదు. 1940 లో ఆధునిక కంప్యూటర్లపై అలాన్ టూరింగ్ చేసిన కృషికి స్ఫూర్తి లవ్ లేస్ రాసిన నోట్స్ అంటే ఆమె ఎంత దార్శనికురాలో అర్ధం అవుతుంది. 1979 లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు కొత్తగా రూపొందించిన కంప్యూటర్ లాంగ్వేజ్ కు అదా గౌరవార్ధం ఆమె పేరునే పెట్టారు.

సైన్స్, టెక్నాలజీ రంగాలలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికీ అమ్మాయిలు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో అదా వంటి తొలితరం శాస్త్రవేత్తలను గుర్తు చేసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

Post 44

–Based on a piece by Mamata

మంత్ర ప్రపంచానికి తీసుకుపోయే కథలు: Gijubhai Badheka

నవంబర్ 14 మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాము అని మనందరికీ తెలుసు. ఆ రోజున దేశవ్యాప్తంగా పిల్లలకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాటిలో చాలావరకూ కథలు, ఆటల చుట్టూ తిరిగేవే.
ఈ ఏడాది గుజరాత్ ప్రభుత్వం పిల్లల జీవితంలో కథల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవం (బాలవర్త దిన్) గా ప్రకటించింది.
నవంబర్ 15 గుజరాత్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, కథా రచయిత అయిన గిజుభాయి బదేక జయంతి. బాల సాహిత్య బ్రహ్మ అని ప్రేమగా అందరూ పిలుచుకునే గిజుభాయి ఎంతో సుసంపన్నమైన బాల సాహిత్య నిధిని భవిష్యత్తు తరాలకు అందించారు. ఈయన కథలను తమ తల్లిదండ్రుల నుండి, తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుండి పెరిగిన ఈ తరం పిల్లలు ఎందరో ఉన్నారు. 

1885 లో జన్మించిన గిజుభాయి ఒక జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1920 ల ప్రాంతంలో తన కొడుకు పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు.  భావనగర్ లోని దక్షిణామూర్తి విద్యాసంస్థలలో చేరి మాంటిస్సోరీ మేడం నుండి పొందిన స్ఫూర్తితో విద్యార్థి కేంద్రక విద్యపై ఎంతో కృషి చేశారు. ఈ రంగంలో తన అనుభవాలు 1920 లో దక్షిణామూర్తి బాలమందిర్ ఏర్పాటుకు దోహదపడ్డాయి. పిల్లలతో ఆయన చేసిన చర్చల వలన వారు ఏవైనా విషయాలను నేర్చుకోవాలంటే కథల ద్వారా చెబితే ఎంత ప్రయోజనకరమో ఆయన అర్థం చేసుకున్నారు. దానితో అనేక నేపథ్యాలకు చెందిన పిల్లల కథలను సేకరించడం, స్వయంగా కథలు రాయడం, చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల సంపూర్ణ వికాసానికి తోడ్పడేది కథలే అని ఆయన బలమైన నమ్మకం.
ఆ సమయంలో గుజరాతీ భాషలో బాలసాహిత్యం ఎక్కువగా లేదు. పిల్లవాడిని ఒక సంపూర్ణ వ్యకిగా గుర్తించి వారికోసం ప్రత్యేకమైన వనరులను, సాహిత్యాన్ని సృజించిన గుర్తింపు గిజుభాయికే దక్కుతుంది. 


వార్తను శాస్త్ర అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: పిల్లల కథ అని పేరు పెట్టిన ప్రతి కథా పిల్లల కథ కాలేదు. ఏ కథ నుండి అయితే పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారో అదే నిజమైన పిల్లల కథ. పిల్లలకు సరళంగా, క్లుప్తంగా ఉండే కథలు కావాలి. వారి చుట్టూ ఉన్న పరిసరాలు కథలలో ప్రతిబింబించాలి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పాటలు ఉంటే వారికి గుర్తు పెట్టుకోడానికి సులభంగా ఉంటాయి. అందుకే అవి పిల్లల కథలలో భాగం కావాలి.
అయితే ఆ సమయంలో ఇటువంటి కథలు ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే జానపద సాహిత్యంలో అలాంటి కథల్ని గుర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దక్షిణామూర్తి సంస్థలోని ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న విద్యార్థులను వారి వారి ఇండ్లలో, గ్రామాలలో, పరిసరాలలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల జానపద కథలను సేకరించమని కోరారు. 
వార్తనుశాస్త్ర లో ఆయన ఇలా రాశారు. జానపద సాహిత్యాన్ని వెతకాలంటే నువ్వు పట్టణాన్ని వదిలి గ్రామాలకు, అక్కడి నుంచి అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్ళాలి. పళ్లూడిన ఒక బామ్మ తన పనులు ముగించుకుని కూర్చోగానే పిల్లలు చుట్టూ చేరినప్పుడు చెప్పే కథలు వినాలి. అవి బామ్మ పంచిన ప్రసాదంలాగా పిల్లల నుండి పిల్లలకి మొత్తం ఊరంతా చేరిపోతాయి. 


గిజుభాయి, ఆయన సహోద్యోగులు అటువంటి కథల కోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టారు. ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు సేకరించారు. వాటిని ఆయన తనదైన శైలిలో చిన్న చిన్న వాక్యాలలో, పదాలతో ఆటల రూపంలో, సంభాషణల రూపంలో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.


ప్రతి ఉదయం పిల్లలకు ఒక కథ చెప్పేవారు ఆయన. ఆ కథను పిల్లలు మధ్యాహ్నానికి నాటకం రూపంలో చూపించాలి. కొద్ది రోజులలోనే పిల్లలు ఎలా తయారయ్యారు అంటే పదాలను తేలికగా గుర్తుపెట్టుకునేవారు. వారి నోటి వెంట ప్రాస అలవోకగా వచ్చేసేది. కథ మధ్యలో మర్చిపోతే వారే ఏదో ఒక కథను అల్లేసే వారు. అందుకే ఆయన ఇలా రాశారు: నువ్వు కొంతమంది పిల్లలను పోగేసి వారికి ఒక కథ చెప్పావంటే వారు నీకు పది కథలు చెబుతారు.


కథల కోసం, జానపద సాహిత్యంకోసం గిజుభాయి పరిశోధన రాష్ట్రాన్ని దాటి దేశమంతా విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఎంతో బాల సాహిత్యాన్ని సేకరించి వాటిలోని సారూప్యతలను, వైవిధ్యాలను గుర్తించారు. వాటికి గుజరాతీ స్థానికతను జోడించి తిరిగి రాశారు. అవి గుజరాతీ కథలుగా, గిజుభాయ్ కథలుగా పేరుపొందాయి. 


గిజుభాయి కథలు ఎంతో సరళంగా, ప్రాసతో కూడి ఉంటాయి. అందుకే అవి వినేవారిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఆయన కథలలో పిల్లలకు తెలిసిన జంతువులు, పక్షులు ఉంటాయి. అవి మనుషుల్లా మాట్లాడుతూనే తమవైన జంతు లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, జంతువులకు మధ్య సంబంధాలు, సంభాషణలు పిల్లలను విస్మయానికి గురిచేసి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కథలలో రాజులు, రాణులు, రాజకుమారులతో పాటు సాధారణ దర్జీలు, మంగలులు, కుమ్మరులు కనపడతారు. మానవ సహజమైన బలాలు, బలహీనతలను, దురాశను, అసూయను ఈ పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. చాలా కథలు అనగనగా అంటూ మొదలై చివరికి సుఖాంతమవుతూ వందేళ్ల తర్వాత కూడా అనేక తరాల పిల్లలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. 


గిజుభాయి జన్మదినాన్ని, ఆయన కథలను గుర్తు  చేసుకునేందుకు నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పిల్లలంతా డిజిటల్ పరికరాలకు అతుక్కుని పోతున్న ఈ రోజుల్లో పిల్లలకే కాదు పెద్దవారికి కూడా కథలు చెప్పడంలోని ఆనందాన్ని గుర్తు చేసేందుకు కనీసం ఒక రోజైనా ఉండాలేమో.


నా తోటి పెద్దలకు ఒక విన్నపం. ఎన్నో కథలు మనకు ఉన్నాయి. వాటిని మీ పిల్లలకు చెప్పండి. అందంగా, పూర్తిగా వాటిలో లీనమై చెప్పండి. పిల్లలు కూడా అంతే లీనమై ఆనందిస్తారు. వారికేదో జ్ఞానాన్ని అందివ్వాలని కథ చెప్పకండి. ఏ ఉద్దేశ్యంతోనూ కథను మొదలుపెట్టకండి. కథలోకి వెళుతూ పిల్లలను మీతో పాటు దానిలోకి తీసుకుని వెళ్ళండి. ఒక మంత్ర ప్రపంచం మీ ముందు నిలుస్తుంది. మీ పిల్లలతో కలిసి అందులో వివరించండి. ఆస్వాదించండి.


మీ పిల్లలతో మంచి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నారా? కథలతో ప్రారంభించండి

Post 44

Based on a piece by Mamata

పట్టణాలలో ఒయాసిస్సుల లాంటి కంటోన్మెంట్లు: Cantonments

ఈ మధ్య 2017 లో ప్రచురించబడిన ‘కంటోన్మెంట్లు: ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ హెరిటేజ్ టు మోడర్నిటీ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని చూసాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల భూమికి సంబంధించిన వివరాలు, వాటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. 

Coffee table book on Indian Cantonments
A Coffee table book on Indian Cantonments

ఫ్రెంచ్ పదం అయిన కాంటన్ నుండి ఈ కంటోన్మెంట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏవైనా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలోనో, శీతాకాలం లోనో సైనిక దళాలు నివసించేందుకు తాత్కాలికంగా విడిది ఏర్పాట్లు చేసిన ప్రాంతాలనే తొలుతగా కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అయితే దేశాల మధ్య దాడులు జరిగి ఒక దేశం మరొక దేశాన్ని పాలించే సందర్భంలో తమ సైన్యం కోసం శాశ్వతంగా కొన్ని ఆవాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకునేవారు. భారతదేశంతో సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో వీటిని కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అమెరికాలో కూడా కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరాలు అనే అర్థంలోనే వాడతారు. దాదాపు 250 ఏళ్ళ క్రితం దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలంలో బారాకపూర్ ప్రాంతంలో దేశంలో తొలి కంటోన్మెంట్ (బీహార్ లోని దానాపూర్ దగ్గర ఉన్నదీ తొలి కంటోన్మెంట్ అని కొందరు అంటారు) ఏర్పాటు అయింది. 18 వ శతాబ్దం నాటికి వాటి సంఖ్య బాగా పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వారి పరిమాణం, వాటిలో నివసించే జనాభా ఆధారంగా వీటిని మొత్తం నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఈ అన్ని కంటోన్మెంట్లు కలిపి రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. మిలిటరీ స్టేషన్ లలో కేవలం సాయుధ మిలిటరీ దళాలు మాత్రమే నివసిస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలలో మిలిటరీ దళాలు, సాధారణ పౌరులు కలిసి నివసిస్తుంటారు. కంటోన్మెంట్లు అన్నీ 2006 కంటోన్మెంట్ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో పాటు నామినేట్ చేయబడిన ప్రతినిధులు కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారిక బాడీ లో సభ్యులుగా ఉంటారు.

నేను చూసిన పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఎన్ని వైవిధ్యమైన ప్రాంతాలలో మన కంటోన్మెంట్లు ఏర్పడ్డాయో ఈ పుస్తకం చూసి అర్ధం చేసుకోవచ్చు.

కంటోన్మెంట్ల గురించి ఇంతకు ముందు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఉదాహరణకు, కుంభ మేళా జరిగే సంగమ ప్రాంతం అలహాబాద్ లోని ఫోర్ట్ కంటోన్మెంట్ కు చెందిన ప్రాంతం. కుంభమేళాల సమయంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత నిర్వహణా బాధ్యతను తన పరిధిలోకి తీసుకుంటుంది. తాజ్ మహల్ ను చూసేందుకు మనమందరం వెళ్లే ఆగ్రా ఫోర్ట్ కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది. అలహాబాద్ కంటోన్మెంట్ లో శాసనాలతో కూడిన అశోకుని స్థూపం ఉంది. ఈ స్థూపానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిపైనా అశోకుని శాసనాలతో పాటు నాలుగవ శతాబ్దానికి చెందిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుని శాసనాలు కూడా ఉన్నాయి. అహ్మద్ నగర్లో, బెల్గాంలో, కన్ననోరే లో ఉన్న కోటలు అన్నీ కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలోనే ఉన్నాయి.  

మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహౌ కంటోన్మెంట్ ప్రాంతంలోనే జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మలోజి సక్పాల్ బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ ను డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్నారు. ఈ కంటోన్మెంట్ లో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం కూడా ఉంది. పాలరాతితో చేసిన ఈ భవనంలో ఈ అసమాన నాయకుని జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శన జరుగుతుంది.

గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కూడా అల్మోరా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంతో సమయం గడిపారనీ, తన గీతాంజలి తో సహా ఎన్నో రచనలను ఇక్కడ నివసిస్తున్నప్పుడే రచించారని అంటారు. ఆయన నివసించిన భవనాన్ని ఇప్పుడు టాగోర్ హౌస్ అని పిలుస్తున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాలలో కొన్ని అద్భుతమైన భవనాలు కూడా ఉన్నాయి. హుగ్లీ ఒడ్డున 1828 లో నిర్మించిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ భవనం ఇప్పుడు బెంగాల్ గవర్నర్ కు బారక్పూర్ విడిదిగా ఉంది. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది.

మద్రాస్ వార్ సిమెట్రీ, కిర్కీ వార్ సెమెట్రీ, ఢిల్లీ వార్ సిమెట్రీ వంటి అనేక యుద్ధ స్మారకాలు కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక కంటోన్మెంట్లలో ఉన్న చర్చీలు, గుడులు, మసీదుల సంఖ్య లెక్కకట్టలేము.

షిల్లాంగ్, రాణిఖేత్ ప్రాంతాలలోని కంటోన్మెంట్ లు జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా అలరారుతున్నాయి. దానాపూర్ కంటోన్మెంట్ లో ప్రత్యేక రుతువులలో ఎన్నో వలస పక్షులు విడిది చేస్తుంటాయి.

మనం అందరం దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కంటోన్మెంట్ ప్రాంతం గుండా ప్రయాణించడమో, అక్కడ నివసించడమో, సందర్శించడమో చేసే ఉంటాము. ఎంతో శుభ్రంగా, పద్ధతిగా నిర్వహించబడే ఈ ప్రాంతాలు కాలుష్యంతో నిండిన పట్టణ ప్రాంతంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తాయి. అయితే వీటి నిర్వహణలో సమస్యలు లేకపోలేదు, ఎన్నో విమర్శలూ లేకపోలేదు. అవి వలసవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఒక ముఖ్యమైన విమర్శ కాగా కంటోన్మెంట్ ప్రాంతాల రోడ్లను సాధారణ ప్రజానీకం వినియోగించుకోలేకపోవడం మరొక సమస్య. ఈ కంటోన్మెంట్ లలో నివసించే సాధారణ ప్రజానీకానికి ఇంటి రుణాలు తీసుకునేందుకు, ప్రభుత్వ హౌసింగ్ పధకాలను వినియోగించుకునేందుకు వెసులుబాటు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉంది.

డిఫెన్స్ శాఖ నియంత్రణలో ఉన్న భూముల నిర్వహణా వ్యయాల మీద తరచుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆర్మీ కూడా ఒక సందర్భంలో ఈ ప్రాంతాల నిర్వహణకు ఇంత ఖర్చు చేయడం గురించి పునరాలోచించిన దాఖలాలు ఉన్నాయి. 2021 లో ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఈ కంటోన్మెంట్ ప్రాంతాల రద్దు మీద ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన కూడా వెలువడింది. 

వీటిని బట్టి చూస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలు భవిష్యత్తులో అంతర్ధానమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని రద్దు చేయడం కాకుండా వీటి నిర్వహణా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి, వాటిలో నివసించే అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా నిర్వహణ చేసినట్లయితే పట్టణ ఆవాసాల నిర్వహణ కు సంబంధించి కంటోన్మెంట్ లు ఆదర్శంగా నిలుస్తాయి అని నాకు అనిపిస్తుంది.

Post 41

Based on a piece by Meena