జవాజా ప్రాజెక్ట్

అకాడెమిక్ సంస్థల పట్ల తరచుగా వినిపించే ఒక ఫిర్యాదు ఏమిటంటే ఆ సంస్థలు సాధారణ ప్రజా జీవితానికి దూరంగా ఉండి సామాజిక వాస్తవాలను అర్ధం చేసుకోలేవు. అందువల్లనే సామాజిక సమస్యలకు ఈ సంస్థలు సూచించే పరిష్కారాలు కూడా ఎంతో డొల్లగా ఉంటాయి అని.

Jawaja bag
A prized Jawaja bag

అయితే అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కలిసి అమలు చేసిన జవాజా ప్రాజెక్ట్ మాత్రం ఇందుకు ఒక మినహాయింపు అనే చెప్పాలి.

1975 లో ఐఐఎం, అహ్మదాబాద్ తొలి ఫుల్ టైం డైరెక్టర్ అయిన రవి మత్తయి భారతదేశం ఎదుర్కుంటున్న పేదరిక సమస్యను కార్పొరేట్ మేనేజ్మెంట్ సూత్రాలను ఉపయోగించి ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన డైరెక్టర్ గా పదవి నుండి తప్పుకుని ఉండడంతో తన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కు కేటాయించారు.

రాజస్థాన్ లోని కరువు పీడిత జిల్లా అయిన జవాజాను ఈ ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.మొత్తం 200 గ్రామాలు, 80000 జనాభా. బీడు భూములు, నీటి కరువు తో పాటు ఇతర భౌతిక వనరులేమీ లేని ఈ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. అందరి దృష్టిలో ఏ వనరులూ లేని ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం. కానీ రవి మత్తాయి దృష్టి అందుకు భిన్నమైంది. ఆయన దృష్టిలో మానవ వనరులను మించిన వనరు లేదు.    

ఆ ప్రాంతాన్ని అర్ధం చేసుకునే క్రమంలో అక్కడ దాదాపు మూడువందల ఏళ్లుగా తోళ్ళతో హస్తకళా ఉత్పత్తులు చేసే సంప్రదాయం ఉన్నదని తెలిసింది. అక్కడి ప్రజలకు నేతపనిలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యాలను ఉపయోగించి వారికి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రొఫెసర్ మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను రంగంలోనికి తీసుకువచ్చారు. జవాజా ప్రజల జీవనోపాధులపై పని చేసి వారి సాధికారత వైపు కృషి చేయాలనేది ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఈ ప్రయత్నంలో మతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు చెందిన అశోక్ ఛటర్జీ తో పాటు రెండు సంస్థలకు చెందిన అనేకమంది ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు. 

హస్తకళాకారులకు సమకాలీన సంస్కృతికి తగిన డిజైన్ లను, నిర్వహణా నైపుణ్యాలను అందివ్వడం, అందుకు అవసరమైన సంస్థలతో వారిని కలపడం ఈ ప్రాజెక్ట్ చేసిన ముఖ్యమైన పని. ఈ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన విలువల ఆధారంగా నిర్వహించబడింది. పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనేవి వాటిలో ముందు వరసలో నిలిచే విలువలు. అక్కడి ప్రజలు ఈ సంస్థలకు చెందిన నిపుణుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక ఎత్తైతే ఆ నిపుణులకు కూడా తమ నైపుణ్యాలను సామాజిక సమస్యల పరిష్కారాలకు వినియోగించేందుకు ఒక అవకాశం దొరికింది. ఆ హస్తకళాకారులు తయారుచేసే వస్తువుల విలువగొలుసు లో వీలైనంత ఎక్కువభాగంపై ఆ కళాకారులు, ప్రజలకే నియంత్రణ ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి సంబంధించిన ఉత్పత్తి మరియు మార్కెట్ అంశాలలో ఆ కళాకారులకే అధికారం ఉండేలా చూడడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. కళాకారులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ కు మరింత బలం చేకూరింది.

జవాజా బ్యాగ్:

మొదట తోళ్లతో స్కూల్ బాగ్స్, ఫ్లోర్ మాట్ లు వంటి సాధారణ, సంప్రదాయ ఉత్పత్తులతో ప్రారంభించినా చిన్నగా ఆఫీస్ లకు అవసరమైన వస్తువులు, వినూత్నమైన బ్యాగ్లు, ఖరీదైన అలంకరణ వస్తువుల వైపు ప్రాజెక్ట్ మలుపు తిరిగింది.

ఈ ప్రక్రియలో ఎదుర్కున్న సమస్యలు తక్కువేమీ కాదు. పాత నైపుణ్యాలతో, సాంకేతిక పరికరాలు, పనిముట్లతో అధునాతన ఉత్పత్తులు తయారుచేయాల్సి రావడం ఒక సమస్య అయితే వాటి నాణ్యతను నియంత్రించడం మరొక ముఖ్యమైన సమస్య. 

కొత్త డిజైన్ లకు వచ్చేసరికి ముందుగా కమ్యూనిటీ లోనుండి కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలి అనుకున్నారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. నాణ్యత నియంత్రణకు వచ్చేసరికి, మొదటగా ఈ క్వాలిటీ కంట్రోల్ ను ఆయా సంస్థలకు చెందిన నిపుణులు నిర్వహించినా తర్వాత కాలంలో కళాకారుల బృందాలే ఆ బాధ్యత తీసుకుంటాయి అనేది ప్రాజెక్ట్ ఉద్దేశం. అది కూడా అనుకున్నంత వేగంగా సాగలేదు. కొత్త ఉత్పత్తులను రూపొందించేందుకు, వాటికి తగిన ముడి పదార్ధాలు కొనుగోలు చేసేందుకు తగిన నిధులు, వనరుల కొరత అయితే నిరంతరం ఉండేది.

ఇన్ని సమస్యల మధ్య అమలు జరిగినా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం సాధించడమే కాదు సుస్థిరంగా కొనసాగింది కూడా.

ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయాలలో మొదటిది ఆర్టిసన్స్ యలయన్సు ఆఫ్ జవాజా అనే స్వయంప్రతిపత్తి గల సంస్థను, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముడిపదార్ధాలు కొనుగోలు, బ్యాంకు వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు, సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ విషయాలు అన్నీ ఈ సంస్థలే స్వయంగా నిర్వహించుకునేవి. ఈ సంస్థలు ఈ నాటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను తయారుచేస్తూ, మార్కెట్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఉత్పత్తులకు సంబంధిత మార్కెట్లలో ఎంతో విలువ ఉంది.

ఇక రెండవ విజయం అభివృద్ధి రంగంపైన ఈ ప్రాజెక్ట్ చూపించిన ప్రభావం. ఈ గ్రాస్ రూట్ సంస్థ నుండి నేర్చుకున్న పాఠాల నుండే రూరల్ మానేజ్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ ఉండాలి అనే ఆలోచనకు తద్వారా ఆనంద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మానేజ్మెంట్ ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంస్థకు రవి మతాయి తో పాటు ఐఐఎం, అహ్మదాబాద్ కు చెందిన మరొక ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కమల చౌదరి, డాక్టర్ మిచెల్ హల్సే లు ఒక రూపాన్ని ఇచ్చారు. 

పరస్పర గౌరవం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనే విలువల ఆధారంగా ప్రజా సంస్థలను నిర్వహించడం, వారి జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా జవాజా ప్రయోగం అభివృద్ధి రంగంలో ఒక నూతన ఆలోచనా దృక్పధాన్ని ప్రవేశపెట్టి ఎంతో ప్రభావవంతమైన ప్రయోగంగా నిలిచిపోయింది.

ఇటువంటి ప్రయత్నాల గురించి మరింత మంది తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి, చర్చ చేయాలి.

–Based on a piece by Meena

మంత్ర ప్రపంచానికి తీసుకుపోయే కథలు: Gijubhai Badheka

నవంబర్ 14 మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాము అని మనందరికీ తెలుసు. ఆ రోజున దేశవ్యాప్తంగా పిల్లలకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాటిలో చాలావరకూ కథలు, ఆటల చుట్టూ తిరిగేవే.
ఈ ఏడాది గుజరాత్ ప్రభుత్వం పిల్లల జీవితంలో కథల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవం (బాలవర్త దిన్) గా ప్రకటించింది.
నవంబర్ 15 గుజరాత్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, కథా రచయిత అయిన గిజుభాయి బదేక జయంతి. బాల సాహిత్య బ్రహ్మ అని ప్రేమగా అందరూ పిలుచుకునే గిజుభాయి ఎంతో సుసంపన్నమైన బాల సాహిత్య నిధిని భవిష్యత్తు తరాలకు అందించారు. ఈయన కథలను తమ తల్లిదండ్రుల నుండి, తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుండి పెరిగిన ఈ తరం పిల్లలు ఎందరో ఉన్నారు. 

1885 లో జన్మించిన గిజుభాయి ఒక జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1920 ల ప్రాంతంలో తన కొడుకు పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు.  భావనగర్ లోని దక్షిణామూర్తి విద్యాసంస్థలలో చేరి మాంటిస్సోరీ మేడం నుండి పొందిన స్ఫూర్తితో విద్యార్థి కేంద్రక విద్యపై ఎంతో కృషి చేశారు. ఈ రంగంలో తన అనుభవాలు 1920 లో దక్షిణామూర్తి బాలమందిర్ ఏర్పాటుకు దోహదపడ్డాయి. పిల్లలతో ఆయన చేసిన చర్చల వలన వారు ఏవైనా విషయాలను నేర్చుకోవాలంటే కథల ద్వారా చెబితే ఎంత ప్రయోజనకరమో ఆయన అర్థం చేసుకున్నారు. దానితో అనేక నేపథ్యాలకు చెందిన పిల్లల కథలను సేకరించడం, స్వయంగా కథలు రాయడం, చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల సంపూర్ణ వికాసానికి తోడ్పడేది కథలే అని ఆయన బలమైన నమ్మకం.
ఆ సమయంలో గుజరాతీ భాషలో బాలసాహిత్యం ఎక్కువగా లేదు. పిల్లవాడిని ఒక సంపూర్ణ వ్యకిగా గుర్తించి వారికోసం ప్రత్యేకమైన వనరులను, సాహిత్యాన్ని సృజించిన గుర్తింపు గిజుభాయికే దక్కుతుంది. 


వార్తను శాస్త్ర అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: పిల్లల కథ అని పేరు పెట్టిన ప్రతి కథా పిల్లల కథ కాలేదు. ఏ కథ నుండి అయితే పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారో అదే నిజమైన పిల్లల కథ. పిల్లలకు సరళంగా, క్లుప్తంగా ఉండే కథలు కావాలి. వారి చుట్టూ ఉన్న పరిసరాలు కథలలో ప్రతిబింబించాలి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పాటలు ఉంటే వారికి గుర్తు పెట్టుకోడానికి సులభంగా ఉంటాయి. అందుకే అవి పిల్లల కథలలో భాగం కావాలి.
అయితే ఆ సమయంలో ఇటువంటి కథలు ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే జానపద సాహిత్యంలో అలాంటి కథల్ని గుర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దక్షిణామూర్తి సంస్థలోని ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న విద్యార్థులను వారి వారి ఇండ్లలో, గ్రామాలలో, పరిసరాలలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల జానపద కథలను సేకరించమని కోరారు. 
వార్తనుశాస్త్ర లో ఆయన ఇలా రాశారు. జానపద సాహిత్యాన్ని వెతకాలంటే నువ్వు పట్టణాన్ని వదిలి గ్రామాలకు, అక్కడి నుంచి అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్ళాలి. పళ్లూడిన ఒక బామ్మ తన పనులు ముగించుకుని కూర్చోగానే పిల్లలు చుట్టూ చేరినప్పుడు చెప్పే కథలు వినాలి. అవి బామ్మ పంచిన ప్రసాదంలాగా పిల్లల నుండి పిల్లలకి మొత్తం ఊరంతా చేరిపోతాయి. 


గిజుభాయి, ఆయన సహోద్యోగులు అటువంటి కథల కోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టారు. ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు సేకరించారు. వాటిని ఆయన తనదైన శైలిలో చిన్న చిన్న వాక్యాలలో, పదాలతో ఆటల రూపంలో, సంభాషణల రూపంలో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.


ప్రతి ఉదయం పిల్లలకు ఒక కథ చెప్పేవారు ఆయన. ఆ కథను పిల్లలు మధ్యాహ్నానికి నాటకం రూపంలో చూపించాలి. కొద్ది రోజులలోనే పిల్లలు ఎలా తయారయ్యారు అంటే పదాలను తేలికగా గుర్తుపెట్టుకునేవారు. వారి నోటి వెంట ప్రాస అలవోకగా వచ్చేసేది. కథ మధ్యలో మర్చిపోతే వారే ఏదో ఒక కథను అల్లేసే వారు. అందుకే ఆయన ఇలా రాశారు: నువ్వు కొంతమంది పిల్లలను పోగేసి వారికి ఒక కథ చెప్పావంటే వారు నీకు పది కథలు చెబుతారు.


కథల కోసం, జానపద సాహిత్యంకోసం గిజుభాయి పరిశోధన రాష్ట్రాన్ని దాటి దేశమంతా విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఎంతో బాల సాహిత్యాన్ని సేకరించి వాటిలోని సారూప్యతలను, వైవిధ్యాలను గుర్తించారు. వాటికి గుజరాతీ స్థానికతను జోడించి తిరిగి రాశారు. అవి గుజరాతీ కథలుగా, గిజుభాయ్ కథలుగా పేరుపొందాయి. 


గిజుభాయి కథలు ఎంతో సరళంగా, ప్రాసతో కూడి ఉంటాయి. అందుకే అవి వినేవారిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఆయన కథలలో పిల్లలకు తెలిసిన జంతువులు, పక్షులు ఉంటాయి. అవి మనుషుల్లా మాట్లాడుతూనే తమవైన జంతు లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, జంతువులకు మధ్య సంబంధాలు, సంభాషణలు పిల్లలను విస్మయానికి గురిచేసి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కథలలో రాజులు, రాణులు, రాజకుమారులతో పాటు సాధారణ దర్జీలు, మంగలులు, కుమ్మరులు కనపడతారు. మానవ సహజమైన బలాలు, బలహీనతలను, దురాశను, అసూయను ఈ పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. చాలా కథలు అనగనగా అంటూ మొదలై చివరికి సుఖాంతమవుతూ వందేళ్ల తర్వాత కూడా అనేక తరాల పిల్లలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. 


గిజుభాయి జన్మదినాన్ని, ఆయన కథలను గుర్తు  చేసుకునేందుకు నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పిల్లలంతా డిజిటల్ పరికరాలకు అతుక్కుని పోతున్న ఈ రోజుల్లో పిల్లలకే కాదు పెద్దవారికి కూడా కథలు చెప్పడంలోని ఆనందాన్ని గుర్తు చేసేందుకు కనీసం ఒక రోజైనా ఉండాలేమో.


నా తోటి పెద్దలకు ఒక విన్నపం. ఎన్నో కథలు మనకు ఉన్నాయి. వాటిని మీ పిల్లలకు చెప్పండి. అందంగా, పూర్తిగా వాటిలో లీనమై చెప్పండి. పిల్లలు కూడా అంతే లీనమై ఆనందిస్తారు. వారికేదో జ్ఞానాన్ని అందివ్వాలని కథ చెప్పకండి. ఏ ఉద్దేశ్యంతోనూ కథను మొదలుపెట్టకండి. కథలోకి వెళుతూ పిల్లలను మీతో పాటు దానిలోకి తీసుకుని వెళ్ళండి. ఒక మంత్ర ప్రపంచం మీ ముందు నిలుస్తుంది. మీ పిల్లలతో కలిసి అందులో వివరించండి. ఆస్వాదించండి.


మీ పిల్లలతో మంచి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నారా? కథలతో ప్రారంభించండి

Post 44

Based on a piece by Mamata

ఒక ఉపాధ్యాయుని పగటికల: Divaswapna

మొన్ననే మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం. ఈ సందర్భంగా విద్య, పాఠశాలలు, గురువుల పాత్ర వంటి ఎన్నో అంశాల మీద విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనే అంశంపై ఎన్నో కాల్పనిక కథలు, నిజజీవిత గాధలు, విధాన పత్రాలు, మరెన్నో పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉపాధ్యాయుడే కీలకం. నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా “విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రాధమిక సంస్కరణలు చేపట్టాలన్నా ఉపాధ్యాయులే కేంద్రంగా ఉండాలి. రాబోయే తరాలను తీర్చిదిద్దే గురువులకు సమాజంలో తగినంత గౌరవం, గుర్తింపు ఉండేలా అన్ని స్థాయిలలో ఉపాధ్యాయుల పాత్రను మెరుగుపరచాల్సి ఉంది” అని అభిప్రాయపడింది. 

ఈ నూతన విద్యా విధానం ప్రకారం “ఒక మంచి విద్యా సంస్థ అంటే అందులోని ప్రతి విద్యార్థి తాను ముఖ్యమైనవారిగా, తమకు తగినంత భద్రత, సంరక్షణ ఉన్నట్లు భావించగలగాలి. నేర్చుకునేందుకు తగిన వాతావరణం ఉండాలి. అనేకరకాల అనుభవాలను పాఠశాల విద్యార్థులకు అందించగలగాలి. విద్యార్థులు మెరుగ్గా నేర్చుకునేందుకు తగిన మౌలిక వసతులు, వనరులు పాఠశాలలో ఉండాలి” .

విద్యా విధానం కొత్తదే కానీ ఈ కల ఈ నాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా విద్యావేత్తలు మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను కోరుకుంటూ ఎన్నో కలలు కంటూనే ఉన్నారు. ఈ కలే దాదాపు వందేళ్ళ క్రితం గుజరాత్ కు చెందిన ఒక యువ ఉపాధ్యాయుడిని ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దింది. అతనే గిజుభాయ్ బధేక.

విద్యా బోధనలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసిన గిజుభాయ్ పిల్లలు వాటికి ఎలా స్పందిస్తున్నారో నిశితంగా పరిశీలించేవారు. ఉపాధ్యాయులు, తల్లిదండులు పిల్లలతో వ్యవహరించే పద్ధతులు ఒకే విధంగా ఉన్నట్లయితే తాను ప్రయత్నించిన బోధనా విధానాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయని కూడా ఆయన అర్ధం చేసుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాలు, పరిశీలనలు, ఆయన కన్న కలలు అన్నీ “దివాస్వప్న” అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం తెలుగులో పగటికల పేరుతో అనువదించబడింది. 1931 లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ దివాస్వప్న పుస్తకం లక్ష్మిశంకర్ అనే ఉపాధ్యాయుడు విద్యా బోధనలో చేసిన వినూత్న ప్రయత్నాలను వివరించే కాల్పనిక కథ. నిజానికి ఇది గిజుభాయ్ స్వానుభవాల ఆధారంగా రాసిన కథే.

కథాకాలం చూస్తే దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలం. నిర్దేశించిన పాఠ్యప్రణాళికతో, సరైన మార్కులు పొందని వారికి దారుణమైన శిక్షలు అమలు జరుగుతూ బ్రిటిష్ అధికారుల పర్యవేక్షణలో మూసపద్ధతిలో బోధన జరుగుతూ ఉండేది. కానీ ఎటువంటి పరిస్థితులలో అయినా లక్ష్మిశంకర్ వంటి దార్శనికులు పుడుతూనే ఉంటారు. ఈ యువ ఉపాధ్యాయుడు విద్యా బోధనలో తాను చేసిన నూతన ప్రయత్నాలను స్వయంగా వివరించే పుస్తకమే దివాస్వప్న.

లక్ష్మిశంకర్ యువకుడు. మంచి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆదర్శవంతమైన ఆలోచనలు కలవాడు. బ్రిటిష్ అధికారిని కలిసి తన ఆలోచనలను అమలు చేసేందుకు ఏదైనా ఒక పాఠశాలలో వినూత్నంగా బోధించే అవకాశం ఇవ్వమని కోరాడు.

అతని ఆలోచనలు విన్న ఆ అధికారి మొదట నవ్వుతాడు. కానీ తర్వాత కొద్దిగా సంకోచిస్తూనే ఒక పాఠశాలలో నాలుగవ తరగతి పిల్లలకు తాను అనుకున్న పద్ధతిలో బోధన చేసేందుకు అనుమతిస్తాడు. అయితే ఏడాది చివరిలో లక్ష్మిశంకర్ విద్యార్థులు కూడా మిగిలిన అందరు పిల్లలలాగే పరీక్షకు హాజరయ్యి మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుందని షరతు విధిస్తాడు.

లక్ష్మిశంకర్ ఆ సవాలును స్వీకరిస్తాడు. అనేక ఆలోచనలు, కలలతో నాలుగవ తరగతిలో అడుగుపెడతాడు. అరుచుకుంటూ, కొట్టుకుంటూ, పరుగులు పెడుతూ రౌడీలలా ప్రవర్తిస్తున్న పిల్లలతో చేపల మార్కెట్ లా ఉన్న ఆ తరగతిని చూసి నిర్ఘాంతపోతాడు. తన పగటికలను నిజం చేసుకోవాలంటే ముందుగా ఏదైనా చేసి ఈ పిల్లల మనసులలో స్థానం సంపాదించుకోవాలి అనుకుంటాడు.

తర్వాత రోజు తన తొలి తరగతిని పిల్లలకు ఒక కథ చెప్పడంతో ప్రారంభిస్తాడు. కథ ఆసక్తిగా ఉండడంతో పిల్లలు చాలా శ్రద్ధగా, నిశ్శబ్దంగా వినడం మొదలు పెడతారు. నిజానికి వారు కథలు ఆపేసి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. తర్వాత పది రోజులూ ఆయన తరగతులు కథలతోనే గడిచిపోతాయి. పాఠ్యఅంశాలు బోధించకుండా ఇలా కథలతో కాలక్షేపం చేస్తున్నందుకు అధికారులు అతనిని ప్రశ్నిస్తే ఈ కథల ద్వారా ముందు పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చి క్రమశిక్షణను అలవాటు చేస్తున్నాను. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగేలా స్ఫూర్తినిస్తున్నాను. వారికి సాహిత్యం, భాషానైపుణ్యాలను పరిచయం చేస్తున్నాను అని చెబుతాడు.

అతను ఆశించనట్లుగానే పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తాము విన్న కథలను వారు ఇతరులతో పంచుకునేవారు. తర్వాత లక్ష్మిశంకర్ తన తరగతిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తాడు. తమ పాఠ్య పుస్తకాలు తప్ప వేరే పుస్తకాల మొహం చూడని పిల్లలు వాటిని ఆసక్తిగా తిరగేయడం మొదలుపెడతారు.

పిల్లలలో మరింత క్రమశిక్షణ, పద్ధతి, జట్టుగా ఉండే గుణాలను అలవాటు చేసేందుకు లక్ష్మిశంకర్ వారిని క్రీడల వైపు ప్రోత్సహిస్తాడు.

అయితే పిల్లలను ఉతికిన బట్టలతో, తల చక్కగా దువ్వి, గోళ్లు కత్తిరించి శుభ్రంగా బడికి పంపించమని తల్లిదండ్రులను ఒప్పించడం అతనికి సవాలుగా మారుతుంది. తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాఠశాలకు సంబంధించిన విషయం కాదని అతనిని విమర్శిస్తారు. అయితే శుభ్రంగా, పద్దతిగా ఉండడమే పిల్లలు నేర్చుకోవాల్సిన తొలిపాఠం అని లక్ష్మిశంకర్ విశ్వాసం.

అతని ఆశయాలు, ఆదర్శాలు, పిల్లలపట్ల అతని నిబద్ధత ఇతరుల కన్నా భిన్నమైనవి. తన ప్రయత్నాలలో అన్ని వర్గాల వారి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతోనే కాదు. పిల్లల తల్లితండ్రులతో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొంటాడు. “పిల్లలకు పుస్తకాలలో ఉన్న చదువు మాత్రమే చెప్పాలి అనేది వారి ఉద్దేశం. నేను ఇచ్చే సంజాయిషీలు వారికి రుచించేవి కాదు” అంటాడు లక్ష్మిశంకర్.

తోటి ఉపాధ్యాయులు కూడా అతనిని దారితప్పిన వ్యక్తిగా భావించేవారు. “నా సహోద్యోగులు నా మీద విశ్వాసం లేదు. నా ఆలోచనలు అన్నీ ఆచరణ సాధ్యమైనవి కాదని వారి అభిప్రాయం. అంతేకాక నాకున్న అనుభవం తక్కువ. నాకు వారు బోధిస్తున్న పద్ధతులు, విధానాలపై విశ్వాసం లేదు. నేను పిల్లలను పాడు చేస్తున్నాను అనేవారు. నేను వాళ్లకి కథలు చెప్పడం తప్ప బోధన చేయననీ, ఆటలు ఆడుకోమని వారి విలువైన పఠన సమయాన్ని వృధా చేస్తున్నానని విమర్శించేవారు”

“అయితే నేను సరైన దారిలోనే ఉన్నానని నా నమ్మకం. ఈ కథలూ, ఆటలే సగం చదువు. మిగిలిన సగాన్ని ఎలా బోధించాలో నాకు తెలుసు”

“పై అధికారులకు ఫలితాలు వెంటనే కనపడాలి. లక్ష్మిశంకర్ కు అనుమతి ఇచ్చిన అధికారి కొంచెం అసహనం వ్యక్తం చేస్తాడు. అతని సమస్యలు అతనివి. అతను తన పై అధికారులకు సంజాయిషీ ఇవ్వాలి. వారి మెప్పు పొందాలంటే ఫలితాలు తొందరగా చూపించాలి. నాకు ఎంత మద్దతు ఇవ్వాలనుకున్నా అతని పరిమితులు అతనికి ఉన్నాయి”

ఈ సమస్యలు వేటికీ వెరవకుండా లక్ష్మిశంకర్ మొదటి మూడునెలలు ఇదే పద్ధతి కొనసాగిస్తాడు. మూడవ నెలలో చిన్నగా తరగతి పాఠ్య ప్రణాళిక పైన దృష్టి పెడతాడు. పిల్లలు అన్ని సబ్జెక్టు లలో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టు కు ఒక్కో పద్ధతి అవలంభిస్తాడు. భాషా  నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రకరకాల కథల పుస్తకాల నుండి డిక్టేషన్ ఇవ్వడం; చరిత్రను కథల రూపంలో చెప్పడం; బట్టీ చదువులు కాకుండా నేర్పినవి గుర్తు పెట్టుకునేందుకు వాటిని నాటకాల రూపంలో ప్రదర్శించడం; పదాలతో చిన్న చిన్న ఆటలు ఆడించడం ద్వారా గ్రామర్ నేర్పించడం; పజిల్స్, పొదుపు కథల ద్వారా విషయాలను పరిచయం చేయడం; క్షేత్ర పర్యటనలు, సందర్శనల ద్వారా భూగోళ శాస్త్రం, జీవశాస్త్రాల పరిచయం వంటివి లక్ష్మిశంకర్ అవలంభించిన విధానాలు.

ఏడాది గడిచేకొద్దీ లక్ష్మిశంకర్ ఇంకా ఎన్నో కొత్త పద్ధతులను ప్రయత్నిస్తాడు. టెర్మినల్ పరీక్షలలో అతని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. తోటి ఉపాధ్యాయులు కూడా మార్పును గమనిస్తారు కానీ ఇంకా వారి సందేహాలు వారికున్నాయి. లక్ష్మిశంకర్ కు డబ్బు అవసరం లేదనీ, అతని ఆలోచనలన్నీ అతను చదివే ఇంగ్లీష్ పుస్తకాలలోవి  అనీ, ఇటువంటి ప్రయోగాలు చేసేందుకు అతనికి తగిన తీరిక, సమయం ఉన్నాయి కాబట్టి అతను ఇవన్నీ చేయగలుగుతున్నాడనీ వాళ్ళ అభిప్రాయం. అయితే లక్ష్మిశంకర్ అందుకు అంగీకరించడు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రానే విజయం రాదని చెబుతాడు. అది కేవలం ఒక సాకు మాత్రమే అనీ, కొత్త మార్గాన్ని అవలంభించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అనీ అంటాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తికి మార్గం తప్పకుండా దొరుకుతుందని అంటాడు.

ఏడాది చివరికి వచ్చేసరికి విద్యాశాఖాధికారి నాలుగవ తరగతి పిల్లలలో మార్పును చూడగలుగుతాడు. వారి మార్కులలోనే కాదు, వారి ప్రవర్తన, శుభ్రత వంటి అంశాలలో కూడా. మొత్తం తరగతిని తర్వాత తరగతికి ప్రమోట్ చేయమంటాడు. అయితే లక్ష్మిశంకర్ మాత్రం అందుకు ఒప్పుకోడు. కొంతమంది పిల్లలలో ఇంకా తాను ఆశించిన మార్పు రాలేదనీ, అందుకు కారణం వారికి చదువు రాకపోవడం కాదనీ, వారికి వచ్చే చదువును పాఠశాల బోధించలేకపోవడమే అనీ అంటాడు. వారికి ఆసక్తి ఉన్న విషయాలను పాఠశాల బోధించడం లేదు అని అతని అభిప్రాయం.

ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏటా ఇచ్చే 125 రూపాయిల ప్రోత్సాహక బహుమతిని ఆ ఏడాది పాఠశాల లైబ్రరీ కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తారు.

పాఠశాల వార్షికోత్సవంలో విద్యాశాఖాధికారి ఇలా అంటాడు. “ఈ టీచర్ గతసంవత్సరం తన అభ్యర్ధనతో నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను ఇతనిని ఒక మూర్ఖుడు అనుకున్నాను. చాలా మందికి కొత్త ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఆచరణలో పెట్టాల్సి వచ్చేసరికి అమలు చేయలేక పారిపోతారు. ఆ ఉద్దేశంతోనే నేను అతనికి అనుమతి ఇచ్చాను తప్ప అతను చెప్పినవాటిపై నమ్మకంతో కాదు. అయితే అతను సాధించిన విజయం చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అతను నా ఆలోచనలను మార్చాడు.”

మన విద్యావ్యవస్థ ఎలా ఉండాలి, మన పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి అని మనం కలలు కంటామో వాటికి ప్రతిరూపమే ఈ దివాస్వప్న. ఆ కలలను నిజంచేసి చూపించిన ఒక ఉపాధ్యాయుడి కథ. గత శతాబ్ద కాలంలో విద్యా బోధనా విధానాలపై వచ్చిన పుస్తకాలలో దివాస్వప్న ఎప్పడూ ముందు స్థానంలో నిలుస్తుంది. 1931 లో గుజరాతీ భాషలో మొదటి సారి ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ 11 భారతీయ భాషలలోకి అనువాదం చేసి ప్రచురించింది.

Post 34

Based on a piece by Mamata

గురుపూజోత్సవం: Celebrating the Teacher

సెప్టెంబర్ ఐదవ తేదీని మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే. ఆ రోజున మనకి చదువు నేర్పించి స్ఫూర్తినిచ్చిన గురువులను గుర్తుచేసుకుని, అవకాశం ఉంటే గౌరవించుకుంటూ ఉంటాము. పసి హృదయాలమీద, జీవితాలమీద తమదైన ముద్ర వేసిన ఎందరో గొప్ప గురువులు మనకు ఉన్నారు. వారిలో కొందరి గురించైనా పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా తెలియచెప్పే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. 

అలాంటి సినిమాలలో ఒకటి ఈ మధ్యనే చూసాను. మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అది అని ఖచ్చితంగా చెప్పగలను. ఎంతో దుర్భర నేపధ్యం నుండి వచ్చి వీరికి చదువు చెప్పడం కష్టం అని అందరూ తేల్చేసిన పిల్లలతో ఒక యువ ఉపాధ్యాయిని ఎలా కలిసిపోయింది, వారికి ఎలా చదువు చెప్పగలిగింది అనే విషయాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ఫ్రీడమ్ రైటర్స్.

ఎరిన్ గ్రూవెల్ అనే టీచర్ తన నిజజీవిత అనుభవాలతో రాసిన ‘The Freedom Writers Diary: How a Teacher and 150 Teens Used Writing to Change Themselves and the World Around Them’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1999 లో ఈ పుస్తకం ప్రచురించబడింది.

సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వివక్ష, హింసను ఎదుర్కున్న నేపధ్యం నుండి వచ్చిన ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలు, లాటిన్ అమెరికన్ పిల్లలు ఉన్న తరగతి గదిలోకి 23 ఏళ్ళ ఎరిన్ ఉపాధ్యాయురాలిగా అడుగుపెడుతుంది. వీరికి చదువు చెప్పలేం అని అందరిలాగా నిర్ధారించకుండా ఓపికగా వారితో సమయం గడిపి వారు తగినంత గౌరవం లేకపోవడం, వారిపైన ఎవరికీ వారిపైన శ్రద్ధ లేకపోవడం, విశాల ప్రపంచం పట్ల వారికి అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో పోరాడుతున్నారని గ్రహిస్తుంది. వారికి ప్రపంచం పట్ల ఉన్న అవగాహనను విస్తృతం చేయాలంటే అనేక నేపధ్యాలకు చెందిన రచయితలు రాసిన పుస్తకాలను చదివించాలి అనుకుంటుంది. The Diary of Anne Frank, Zlata’s Diary: A Child’s Life in Sarajevo వంటి పుస్తకాలను వారితో చదివిస్తుంది. లాస్ ఏంజెల్స్ లోని హోలోకాస్ట్ మ్యూజియం ఆఫ్ టాలరెన్స్ కు కూడా వారిని తీసుకువెళ్తుంది. మొదట్లో పిల్లలు ఆమె మాట వినకపోయినా చిన్నగా ఆ పుస్తకాలలోని మనుషుల జీవితాలకు, తమ జీవితాలకు ఉన్న సారూప్యతను అర్ధం చేసుకుంటూ, చరిత్రను మరింత అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇటువంటి సమస్యలు తమకు మాత్రమే సంబంధించినవి కావు అని అర్ధం చేసుకుంటారు. ప్రతి విద్యార్థి తన గతం, వర్తమానం, భవిష్యత్తు కు సంబంధించిన ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తీకరించుకుంటూ ఒక పుస్తకంలో పొందుపరుచుకోమని ఎరిన్ ఆ పిల్లలందరినీ ప్రోత్సహిస్తుంది.

అన్నే ఫ్రాంక్ జీవిత చరిత్ర చదివి ఆ పిల్లలు ఎంత స్ఫూర్తి పొందుతారంటే 1994-95 లో వారంతా కలిసి చందాలు పోగుచేసుకుని అన్నే గ్రంక్ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చిన డచ్ మహిళా మైప్ గైస్ ను కాలిఫోర్నియా లో తమను కలవమని ఆహ్వానం పంపుతారు. ఎరిన్ గ్రూవెల్ విద్యార్థులు నిజమైన హీరోలు అంటూ మైప్ ప్రశంసిస్తుంది. ఎరిన్ రాజీలేని ప్రయత్నాల ఫలితంగా తన మొత్తం 150 మంది విద్యార్థులూ (ఫ్రీడమ్ రైటర్స్) కూడా హై స్కూల్ చదువు విజయవంతంగా పూర్తిచేసుకుని పై చదువులకు కళాశాలలకు వెళ్తారు. వీళ్ళకి చదువు చెప్పలేం అని తేల్చివేయబడ్డ విద్యార్థులకు అది ఎంత పెద్ద విజయం!

ఆ విద్యార్థులందరూ రాసిన అనుభవాల సంకలనమే ది ఫ్రీడమ్ రైటర్స్ అనే పుస్తకం. 1960 లో అమెరికాలో మానవ హక్కులపై పని చేసిన ఫ్రీడమ్ రైడర్స్ అనే హక్కుల సంఘానికి గౌరవార్థంగా ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. ఎరిన్ సంకలనం చేసిన ఈ పుస్తకం ఎంతో విజయం సాధించింది. తర్వాత కాలంలో ఆమె తాను విజయవంతంగా అమలు చేసిన బోధనా పద్ధతులను మరింత విస్తృతంగా విద్యా ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు గానూ ఫ్రీడమ్ రైటర్స్ ఫౌండేషన్ ను స్థాపించింది.

ఈ సినిమాను చూస్తున్నప్పుడు మరొక అద్భుతమైన సినిమా గుర్తు వచ్చింది. 1967 లో వచ్చిన To Sir, With Love అనే సినిమా లండన్ లో ఉపాధ్యాయునిగా పని చేసిన ఈ. ఆర్. బ్రెత్వెయిట్ జీవితానుభవాల ఆధారంగా తీసిన సినిమా. లండన్ లోని ఒక వర్కింగ్ క్లాస్ నివాస ప్రాంతానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు, శ్వేత జాతీయుల పిల్లలకు కలిపి ఒక నల్లజాతికి చెందిన ఉపాధ్యాయుడు బోధన చేయడంలో ఉన్న సమస్యలను ఈ సినిమా ఎంతో అద్భుతంగా చూపించింది. చదువు అంటే ఆసక్తి లేని, అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు బోధన చేసేందుకు ఈయన కూడా ఎరిన్ లాగానే పిల్లలను మ్యూజియం లకు తీసుకువెళ్లడం, వారి నిత్య జీవిత సమస్యల గురించి తరగతి గదిలో పిల్లలతో చర్చ చేయడం వంటి సంప్రదాయేతర బోధనా విధానాలను అవలంభిస్తారు. ఎరిన్, బ్రెత్వెయిట్ ఇద్దరూ కూడా వీరికి బోధన చేయలేము అని ఇతరులు చేతులెత్తేసిన సందర్భాలలో తరగతి గదులలలోకి ప్రవేశించి ఆ విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాకుండా వారి జీవితాలలో చెరగని ముద్ర వేస్తారు.

రెండూ కూడా ఎంతో స్ఫూర్తివంతమైన సినిమాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎటువంటి సందర్భంలో అయినా ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎంతో మార్పు సాధించగలడని ఈ సినిమాలు మరొక్కసారి గుర్తుచేస్తాయి. తమ విద్యార్థుల హృదయాలపై, జీవితాలపై చెరగని ముద్ర వేస్తూ తమ జీవితాలను సార్ధకం చేసుకుంటున్న గురువులకు ప్రణామాలతో

Post 33

–Based on a piece by Mamata

శాస్త్ర సాంకేతిక విద్య పట్ల విక్రమ్ సారాభాయ్ దృక్పథం: Vikram Sarabhai and Science Education

మొన్న ఆగస్టు పన్నెండున డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి. దేశంలో అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాలకు బీజం వేసిన దార్శనికుడిగా ఆయనను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. స్వతంత్ర భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే అందుకు దోహదపడగలవని బలంగా నమ్మి ఇస్రో, పిఆర్ఎల్, ఐఐఎం-ఎ, ATIRA వంటి సంస్థలను స్థాపించి దేశంలో సాంకేతిక విప్లవానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. శాస్త్ర సాంకేతిక విద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఆయన ఎంతగా తపించేవారో ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

ప్రజలలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించకపోతే దేశం పురోగతి చెందలేదనే స్పష్టత సారాభాయ్ కి ఉంది. దీనిని సాధించాలంటే సైన్స్ బోధన మరింత వినూత్నంగా జరగాలనీ, శాస్త్రవేత్తలు యువతతో కలిసి పని చేసి వారిలో శాస్త్రీయ దృక్పధం అలవర్చాలనీ ఆయన భావించేవారు. చిన్నతనంలో ఇంటి వద్దనే ఎంతో మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం బహుశా ఆయనలో సైన్స్ బోధన పట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి పునాదిగా పనిచేసింది అనుకోవచ్చు.

ఈ ఆసక్తి వల్లనే 1963 లో ఆయన ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి సైన్స్ విద్యను సాధారణ పౌరులకు అందేలా చేసేందుకు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ తొలి ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు సాధించడంతో 1966 లో ‘కమ్యూనిటీ సైన్స్ సెంటర్’ అనే సంస్థను స్థాపించారు. దీనిని సారాభాయ్ గురువు, నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంలోనే ఆయన ‘ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది” అనే తన ప్రముఖ ఉపన్యాసాన్ని వెలువరించారు.

ఈ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ దేశంలో ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ప్రయత్నాల వల్లనే దేశంలో సైన్స్ మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. డాక్టర్ సారాభాయ్ మరణం తర్వాత ఈ సెంటర్ పేరును విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ (VASCSC ) అని మార్చడం జరిగింది.

Vikram Sarabhai as a boy, with his model train

ఈ VASCSC వెబ్సైటు ప్రకారం “పాఠశాల, కళాశాలల విద్యార్థులను తమ పాఠ్య పుస్తకాల పరిధి నుండి బయటకు తీసుకువచ్చి స్వంతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించేలా చేయడం ఈ సంస్థ ధ్యేయం. విద్యార్థులు సైన్స్, గణితాలను మరింత మెరుగ్గా, దీర్ఘకాలం గుర్తు ఉండేలా నేర్చుకునేందుకు గానూ ఎన్నో వినూత్న విధానాలను ఈ సంస్థ రూపొందించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పరిపాలకులు, సామాన్య ప్రజానీకం అందరూ కలిసి సైన్స్ ను అర్ధం చేసుకుంటూ శాస్త్రీయ దృక్పధాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం.”

స్థాపించిన నాటి నుండి ఈ సంస్థ సైన్స్ ప్రదర్శనలు నిర్వహించడం, ఓపెన్ లేబొరేటరీ లను, మాథ్స్ లాబొరేటరీలను, సాంకేతిక ఆటస్థలాలను నిర్మించడం వంటి ఎన్నో వినూత్న విధానాల ద్వారా శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజలలో పెంపొందించే ప్రయత్నాలు చేసింది. దేశంలో శాస్త్రీయ విద్యా కార్యక్రమానికి ఈ రోజు ఈ సంస్థే వెన్నుముకగా ఉంది. ఎంతో నాణ్యమైన విద్యా కిట్లు, వనరులను ఈ సంస్థ రూపొందించింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం రూపొందించిన సైన్స్ ఎక్సప్రెస్ ఈ సంస్థ చేసిన అనేక వినూత్న కార్యక్రమాలలో ప్రముఖమైనది. ఎన్నో సంవత్సరాల పాటు నడిచిన ఈ సైన్స్ ఎక్సప్రెస్ ను ఇండియన్ రైల్వేస్ సహకారంతో 16 బోగీలు ఉన్న ఒక రైలులో ఏర్పాటు చేశారు. ఎన్నో శాస్త్రీయ నమూనాలను ఇందులో ప్రదర్శించారు. అక్టోబర్ 2007 లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చే ప్రారంభించబడిన ఈ రైలు దేశమంతా దాదాపు ఒక లక్ష ఇరవై రెండువేల కిలోమీటర్లు ప్రయాణించింది. 1404 రోజుల పాటు 391 ప్రాంతాలలో ఈ రైలు ప్రదర్శన జరగగా దాదాపు కోటి ముఫై మూడు లక్షల మంది దీనిని సందర్శించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువమంది సందర్శించిన సైన్స్ ప్రదర్శనగా ఇది ఎంతో గుర్తింపు పొందింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆరు సార్లు తన స్థానాన్ని నమోదు చేసుకుంది.

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ను గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో మృణాళిని సారాభాయ్ ఇలా అన్నారు. “విక్రమ్ సారాభాయ్ తాను ఉద్యోగ విరమణ చేసాక పిల్లలతో, యువతతో ఎక్కువ సమయం గడిపి వారిలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తానని అంటుండేవారు”. అయితే ఆ కోరిక తీరకుండానే సారాభాయ్ తక్కువ వయసులోనే అకాలమరణం చెందారు. అయితే ఆయన ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ఆ దిశగా తన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది.

P.S: ఈ వ్యాసకర్త మీనా రఘునాధన్ విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు 

–Based on a piece by Meena

(Post 31)

ఏమి కావాలనుకుంటున్నారు?: What Shall I Be?

గ్రామీణ ప్రాంతాల నుండి, చిన్న చిన్న పట్టణాల నుండి వచ్చిన యువతతో మేము పని చేసేటప్పుడు మేము తరచుగా వాళ్ళని మీరు ఏమి కావాలనుకుంటున్నారు అని అడిగేవాళ్ళం. సాధారణంగా వాళ్ళు ఇంజనీర్ అనో, టీచర్ అనో, పోలీస్ అనో చెప్పేవాళ్ళు. వారి రోజు వారీ జీవితాలలో వారికి పరిచయం ఉన్న వృత్తుల గురించే వారు కలలు కనగలుగుతారు. అంతకన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం కానీ, పరిజ్ఞానం కానీ వారికి లేదు. వారికి రకరకాల వృత్తులను, కెరీర్ అవకాశాలను పరిచయం చేసినట్లయితే వారి ఆలోచనా పరిధి, ఆకాంక్షల విస్తృతి పెరిగే అవకాశం ఉంది అని మాకు అనిపించింది. అది వాస్తవం కూడా. ఫోరెన్సిక్ సైన్స్ నుండి డేటా సైన్స్ వరకు, యోగా శిక్షణ నుండి వండ్రంగం పని వరకు, ఆప్టిషియన్ నుండి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ వరకు – పిల్లలకు తెలియాలే కానీ వారి కలలు, కోరికలు అన్నీ భిన్నంగానే ఉంటాయి.

అయితే ఈ కింద చెప్పిన కొన్ని కెరీర్ లను కూడా యువతకి పరిచయం చేయవచ్చు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. బహుశా వీటికి మరింత భవిష్యత్తు ఉందేమో. ఇవి వారికి మరింత ఆసక్తికరంగా ఉంటాయేమో.

ఈ కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏరోబయాలజీ చదవడం వలన యువతకి మంచి అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఏరోబయాలజిస్ట్ లు అంటే బాక్టీరియల్ వైరస్ లు, ఫంగల్ స్పోర్లు, పోలెన్ గ్రైన్లు వంటి  గాలి ద్వారా వ్యాపించే ఆర్గానిక్  కణజాలాలను అధ్యయనం చేసే ఏరోబయాలజీ లో పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలు. ప్లేగ్ వంటి వ్యాధులను అధ్యయనం చేసే లిమోమోలోజి, శుభ్రతను ఒక శాస్త్రంగా అధ్యయనం చేసే హైజియోలజీ కూడా మంచి భవిష్యత్తు ఉన్న రంగాలు.

ప్రకృతి, జీవ జంతుజాలాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు కాలియోలజీ ని చదవచ్చు. ఇది పక్షుల గూళ్ళను అధ్యయనం చేసే శాస్త్రం. కాలియో అంటే గ్రీకు భాషలో చెక్క గూడు, గుడిసె, గూడు అని అర్ధం. నిడోలోజి అన్నా కూడా ఇదే అర్ధం. చీమలను అధ్యయనం చేసే మైర్మకాలజీ మరొక శాస్త్రం. పాములను అధ్యయనం చేసే ఓఫియోలజీ కూడా యువతకు ఉన్న మరొక అవకాశం.

గార్బియాలజిస్ట్ లకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇది చెత్తను అధ్యయనం చేసే శాస్త్రం. ఇళ్ల నుండి, పరిశ్రమలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏ విధంగా డిస్పోజ్ చేయవచ్చో దీని ద్వారా నేర్చుకోవచ్చు. మన వాతావరణ అంచనాలు ఎంత అవాస్తవికంగా ఉంటాయో మనకు తెలుసు. బహుశా యువతలో కొంతమంది గాలిని అధ్యయనం చేసే అనెమోలోజి ని కెరీర్ గా మలుచుకోవచ్చేమో. ఉరుములను అధ్యయనం చేసే బ్రోన్టాలజి మరొకటి. ఆహార శాస్త్రమైన బ్రోమాటోలోజి కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. యువత కొంతమంది బ్రోమోటోలాజిస్టు లుగా వినూత్న ఆహార పదార్ధాలను తయారు చేయడమే కాక ఫుడ్ సేఫ్టీ మీద కూడా పని చేయొచ్చు.

మానవ కార్యకలాపాలను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసే డెమోలోజి ని కూడా కొంత మంది యువత కెరీర్ గా మలుచుకోవచ్చు. ఫంగస్ ని అధ్యయనం చేసే మైకాలజీ, కండరాలను అధ్యయనం చేసే మయాలజీ, మేఘాలను అధ్యయనం చేసే నెఫోలోజి, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే నెఫ్రోలోజి, వివిధ రకాల మట్టి లను అధ్యయనం చేసే పెడోలోజి, వివిధ ఉపరితలాల మధ్య ఘర్షణను అధ్యయనం చేసే ట్రైబాలాజీ, జుట్టు మరియు దానికి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసే ట్రైకాలజీ ఇలా ఎన్నో రకాల అవకాశాలు యువత ముందు ఉన్నాయి.

ఇవే కాదు వ్యాధులను అధ్యయనం చేసే నాసాలోజి, పోషకాహారాన్ని సంబంధించిన అధ్యయనమైన ట్రోఫోలోజి, నదులను అధ్యయనం చేసే పొటమాలజీ, వివిధ రకాల పండ్లను అధ్యయనం చేసే కార్పొలోజి కూడా చదవదగిన మరికొన్ని శాస్త్రాలు.

యువత కొంచెం దృష్టి పెట్టి చూడాలే కానీ ఎన్నో కెరీర్ అవకాశాలు వారి ముందు పరుచుకుని ఉన్నాయి. 

అయితే నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఒక సర్జన్ వి కావాలనుకోవచ్చు. లేదా ఒక వెల్డర్ వి కావాలనుకోవచ్చు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే నీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండడం అవసరం. చేస్తున్న పనిని అందరికన్నా మెరుగ్గా, క్రమశిక్షణతో, సమయపాలనతో చేయగలిగినప్పుడు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తావు.

–Based on a post by Meena

డిఆర్డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్) వారి వెబ్సైట్ లో డాక్టర్ డీఎస్ కొఠారి గురించి ఇలా రాసి ఉంటుంది: Dr. DS Kothari

“సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఢిల్లీ యూనివర్సిటీ లోని సైన్స్ విభాగానికి డీన్ గా ఉన్న 48 ఏళ్ళ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి 1948 లో తొలి శాస్త్రీయ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో భాగంగా ఆయన డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజషన్ ను స్థాపించారు. దానిలో పని చేసేందుకు ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన శాస్త్రం, గణితం, పోషకాహారం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం వంటి వివిధ విభాగాలలో అనేక యూనివర్సిటీ లలో పని చేస్తున్న శాస్త్రవేత్తల నుండి కొందరిని ఈ సంస్థ కోసం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు. వీరు బాలిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, పేలుడు పదార్ధాలు, పెయింట్లు, ఆహారం, పోషణ, మానసిక దృఢత్వానికి సంబంధించిన అంశాలు, యుద్ధరంగంలో ఉండే వత్తిడి, శారీరక అలసట వంటి అనేక అంశాలలో పరిశోధనలు నిర్వహించేవారు. రక్షణ సమస్యల పరిష్కారంలో శాస్త్రవేత్తల పాత్ర ఎంత కీలకమైందో ఆయన నిరూపించారు. ఏ పరిధులు లేకుండా నేర్చుకునేందుకు అవకాశం ఉండి, పెద్ద, చిన్న తేడాలు లేని, సిబ్బంది అందరి మధ్యలో మంచి అనుబంధం ఉండే సంస్థగా దానిని మలచాలనేది డాక్టర్ కొఠారి లక్ష్యం. ఆయన తొలిగా స్థాపించిన సైన్స్ లేబొరేటరీ నే ఈ రోజు డిఆర్డిఓ అనే అత్యున్నత సంస్థ ఏర్పాటుకు పునాది.

ఎవరి వృత్తి జీవితంలో అయినా తొలి బాస్ ప్రభావం ఎంతో ఉంటుంది. వారి నాయకత్వ నైపుణ్యాలు, వృత్తి నియమాలు వారి కింద పని చేసే సిబ్బంది కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకి అయితే మంచి బాస్ దొరికితే వారే దేవుడి లాగా కనపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 

మా నాన్నకు డాక్టర్ కొఠారి మొదటి బాస్. ఆయన సాక్షాత్తు దేవుడే మా నాన్నకి.

డిఆర్డిఓ వెబ్సైటు లో డాక్టర్ కొఠారి గురించి రాసి ఉన్నదానికి మా నాన్న ఆయన గురించి నాతో చెప్పిన దానికి కొంచెం కూడా తేడా లేదు. 

డిఆర్డిఓ అధికారంగా ఏర్పడింది 1958 లో. అయితే దానికి ముందే ఎన్నో రక్షణకి సంబంధించిన ల్యాబ్ లు ఉండేవి. 1953 లో డిఫెన్స్ సైన్స్ ల్యాబ్ లో ఒక జూనియర్ స్థాయి ఉద్యోగానికి మా నాన్న దరఖాస్తు పంపి, ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూ పానెల్ లో డాక్టర్ కొఠారి నే స్వయంగా కూర్చున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకి శాస్త్ర సలహాదారుగా ఉన్న ఆయన తన ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టి ఆ యువ శాస్త్రవేత్తలను తానే స్వయంగా ఎంపిక చేసుకోవాలని రోజుల తరబడి ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అప్పుడే స్వతంత్రం పొందిన దేశంలో ఒక బలమైన రక్షణ సంస్థను ఏర్పాటు చేయాలంటే దేశం నలుమూలల నుండి ప్రతిభ గల యువ శాస్త్రవేత్తలను ఎంపిక చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించారు ఆయన.

మా నాన్న, ఆయనతో పాటు చేరిన యువ శాస్త్రవేత్తలకు మొదటగా అప్పగించిన పని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో పని చేస్తున్న సైనికులకు ఇచ్చే చపాతీలు ఎంత మందంగా ఉండాలో పరిశోధించడం. చపాతీ చేయడానికి ఎంత పిండి వాడాలి, ఎంత సమయం తీసుకోవాలి, కాల్చడానికి ఎంత సమయం కావాలి, ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది వంటివన్నీ వీరు అంచనా వేయాల్సి ఉంది. అన్నిటికీ మించి ఆ చపాతీలు రుచిగా ఉండాలి కూడా. రోజువారీ సమస్యల పరిష్కారంలో సైన్స్ అవసరం ఎంత ఉందో ఆ తరం శాస్త్రవేత్తలందరికీ  స్పష్టత ఉంది.  

1955 లో అప్పటి ప్రధాని నెహ్రు న్యూక్లియర్, థెర్మో న్యూక్లియర్, ఇంకా అనేక ఇతర విధ్వంసకర ఆయుధాల వినియోగంలో ఉండే పరిణామాలను అంచనా వేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరారు. డాక్టర్ హోమీబాబా, డాక్టర్ ఖానాల్కర్ తో పాటు ఆ పరిశోధనా పత్రాన్ని వెలువరించడంలో కొఠారి ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రముఖ శాస్త్రవేత్తలకు సహకరించిన యువ రక్షణ శాస్త్రవేత్తలతో మా నాన్న కూడా ఉన్నారు.

పది నుండి పన్నెండు నెలల పాటు కొనసాగిన ఆ పరిశోధనా కాలం మా నాన్న వృత్తి జీవితంలో ఎంతో ఒత్తిడితో కూడినదైనా మరువలేని కాలం. ఆ సమయంలో ఈ అంశం మీద చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. క్లాసిఫైడ్ సమాచారం చాలా వరకు భారతదేశానికి అప్పటిలో అందుబాటులో లేదు. అయినా ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే ‘ న్యూక్లియర్ ఎక్సప్లోజన్స్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ పేరుతో 212 పేజీల ఎంతో విలువైన సమాచారంతో కూడిన నివేదికను ఈ బృందం రూపొందించింది. ఇందులో కొఠారి గారి పాత్రే ఎంతో కీలకం. దీనికి పండిట్ నెహ్రు ముందు మాట రాశారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన నివేదిక ఇది. అందులో కేవలం ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు మాత్రమే కాక మా నాన్న నాగరత్నం గారి వంటి యువ శాస్త్రవేత్తల పేర్లను కూడా ప్రస్తావించడం కొఠారి గారి వినమ్ర స్వభావానికి నిదర్శనం.

మా కుటుంబంలో కూడా కొఠారి గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఆదివారం సాయంత్రం  నాలుగు గంటల ప్రాంతంలో మా అమ్మ నాన్న నివసిస్తున్న ఇంటి తలుపు ఎవరో తట్టినట్లు వినిపించింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా డాక్టర్ కొఠారి నిలబడి ఉన్నారు. ఆ పుస్తకంలోని ఏదో అంశం మీద ఆయన అత్యవసరంగా మా నాన్నతో చర్చించాల్సి ఉంది. అప్పటికి మా ఇళ్లల్లో టెలిఫోన్ సదుపాయం లేదు. ఆయన ఆఫీస్ లో మా నాన్న ఉంటున్న ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకుని నేరుగా వచ్చేసారు. ఆయన స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఎవరినైనా పంపి నాన్నని ఆఫీస్ కి పిలిపించేవారు. ఆయన అలా కాదు. తానే స్వయంగా రావడం ఆయన వారికి ఇచ్చిన గౌరవం, సమయం ఆదా కూడా.

ఆ అమ్మ తన చివరి రోజులలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేది. అప్పటికి ఆమెది చాలా చిన్న వయసు. తమిళనాడు నుండి వచ్చి చంకలో పసి బిడ్డతో ఉంది. హిందీ రాదు. ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగా వచ్చు. నాన్న దైవంగా భావించే మనిషి అలా అనుకోకుండా ఇంటికి రావడం ఆమెని ఎంతో కంగారు పెట్టింది. అప్పటికి మా ఇంట్లో కొన్ని గోద్రెజ్ కుర్చీలు, ఒక స్టడీ టేబుల్, ఒక మంచం మాత్రమే ఉండేవి. ఆ చిన్న ఆవాసానికి ఆయన రావడం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి ఆయన కాఫీ ఇవ్వమని అడిగి ఉంటారు. అప్పటికి ఇంకా దక్షిణాది కుటుంబాలలో తేయాకులు వాడే అలవాటు అంతగా లేదు. ఆమెకి ఎలా చేయాలో కూడా తెలీదు. ఆయనకి కాఫీ ఇవ్వడానికి స్టీల్ గ్లాస్ లు తప్ప కప్పు లు కూడా లేవు ఆ ఇంట్లో.

అయితే డాక్టర్ కొఠారి కి ఇవేమీ పట్టలేదు. ఆయన వచ్చి చక్కగా ఒక గోద్రెజ్ కుర్చీ లాక్కుని అందులో కూర్చుని ఒక గంట పాటు మా నాన్నతో మాట్లాడి అన్నయకి ఆశీర్వాదాలు తెలిపి నవ్వుతూ వెళ్లిపోయారని అమ్మ చెప్పేది.

ఆయన గడిపింది కొద్ధి గంటలే కానీ మా కుటుంబంలో అన్ని తరాలకీ మా అమ్మ ఆ సంఘటన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూనే ఉండేది.

(డాక్టర్ కొఠారి లార్డ్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ మార్గదర్శకత్వంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని కావెండిష్ లాబరేటరీ లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి. బ్లాకెట్ తో కలిసి పనిచేశారు. రూథర్ఫోర్డ్ ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గా పిలుస్తారు. వీరంతా కలిసి స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ వంటి అంశాల మీద ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. డాక్టర్ కొఠారి డిఆర్డిఓ కి మాత్రమే కాదు దేశంలో ఎన్నో ప్రముఖమైన ల్యాబ్ ల స్థాపకులు కూడా. యు.జి.సి, యెన్.సి.ఈ.ఆర్.టి వంటి సంస్థల స్థాపనలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. దేశంలో తొలి విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా వ్యవరించారు)

–Based on a piece by Meena

బడి చదువు మేలా? ఇంటి చదువు మేలా? TO School or Not to School

గతవారం బ్లాగ్ లో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుంది అని కొంత చర్చ చేసాం. కోట్లాది మంది పిల్లలు, ఉపాధ్యాయులు అప్పటివరకు పెద్దగా పరిచయం లేని డిజిటల్ బోధన, లెర్నింగ్ వైపుకు మళ్ళవలసిన అవసరం ఏర్పడింది. పిల్లలు ఇంటి దగ్గర నుండే నేర్చుకోవాల్సి రావడంతో తల్లితండ్రులు కూడా అదనపు బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. పిల్లలు ఇంటి వద్ద నుండే నేర్చుకునేందుకు ఉన్న మార్గాలేమిటి, ఏ పద్ధతిలో వారు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు అనే విషయాలపై విస్తృతమైన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ పద్ధతే బాగుందని కూడా అభిప్రాయ పడుతున్నారు.

పాఠశాల వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోని రోజుల్లోనే కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ తో ప్రయోగాలు చేశారు. రకరకాల వినూత్న బోధనా విధానాలను ఉపయోగించారు. వాటిలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఇక్కడ ఇస్తున్నాను. 

ఇది 1847 నాటి కథ. ఏడేళ్ల ఆల్ అనే పిల్లవాడు కేవలం మూడు నెలలు మాత్రమే బడికి వెళ్ళాక ఒక రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. చేతిలో టీచర్ ఇచ్చిన చిన్న కాగితం ఉంది. అందులో ఈ పిల్లవాడికి ఆలోచించే శక్తి లేదని, చదువులో ఎంతమాత్రం శ్రద్ధ లేదనీ, బడి నుండి పంపివేస్తున్నామని సమాచారం ఉంది. ఆల్ తల్లి నాన్సీ కి తన కొడుకు పట్ల బడి ఇచ్చిన తీర్పు పట్ల ఎంతో బాధ కలిగింది. అది ఆమె సవాలుగా తీసుకుని తన కొడుకుకి తానే ఇంటి దగ్గరే చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. తన కొడుకుకి ఎంతో బెరుకు అని, మొహమాటస్థుడని ఆమెకి తెలుసు. అతనికి ఏమైనా వినికిడి లోపం ఉందేమో, దాని వలననే బడిలో చెప్పే విషయాలను గ్రహించలేకపోతున్నాడేమో అనుకుంది. ఒకప్పుడు ఆమె టీచర్ కావడంతో తన పిల్లవాడిని అర్ధం చేసుకుని అంచనా వేసే ప్రయత్నం చేసింది. అతనికి సాంప్రదాయ బోధనా పద్ధతిలో చదువు చెప్పడం విసుగు తెప్పిస్తుందని ఆమె అర్ధం చేసుకుంది. తన కొడుకులో ఉన్న కుతూహలాన్నీ, పుస్తక పఠనం పట్ల ఉన్న ప్రేమని ప్రోత్సహిస్తూ అతను స్వతంత్రంగా ఆలోచించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, కొత్త కొత్త పనులను ప్రయత్నించేందుకు అవకాశం కల్పించింది.

ఆ పిల్లవాడికి యంత్ర సంబంధమైన విషయాలన్నా, వాటికి సంబంధించిన ప్రయోగాలన్నా చెప్పలేనంత ఆసక్తి. అతనికి తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ రసాయన మూలకాలతో వివిధ రకాల ప్రయోగాల వివరాలు ఉన్న ఒక పుస్తకం ఇచ్చింది. ఆల్ ఆ పుస్తకాన్ని వదలకుండా చదివాడు. తన పాకెట్ మనీ ఖర్చు పెట్టి వీడి చివర ఉన్న ఫార్మసీ స్టోర్ నుండి తనకి కావలసిన రసాయన పదార్ధాలను కొనుక్కుని ప్రయోగాలు చేసేవాడు. తనకి పదేళ్ల వయసులో తమ ఇంటి బేస్మెంట్ లో ఒక చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని గంటల తరబడి అందులోనే గడిపేవాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాహిత్యం, చరిత్ర కూడా విస్తృతంగా చదివాడు. అలా కేవలం మూడు నెలలు మాత్రమే బడి ముఖం చూసిన పిల్లవాడు తన జీవితాంతం నేర్చుకుంటేనే ఉండేందుకు పునాదులు ఏర్పడ్డాయి.

అలా ఆల్ అని పిలవబడే థామస్ ఆల్వా ఎడిసన్ తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా ఎదిగాడు. లైట్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా లను ఆవిష్కరించడంతో పాటు టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఆవిష్కరణలను కూడా ఎంతో మెరుగుపరిచాడు. తన 84 ఏళ్ళ జీవితంలో 1093 పేటెంట్ లను పొందాడు. కేవలం ఆవిష్కర్తగా మిగిలిపోకుండా తాను కనిపెట్టిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసి విజయవంతమైన వ్యాపారవేత్త గానూ మారాడు.

ఎడిసన్ కు 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అతని తల్లి నాన్సీ మరణించింది. కానీ ఆమె తన జీవితాంతం తనకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఎడిసన్ చెప్పుకునేవారు. “నన్ను ఇలా రూపుదిద్దింది ఆమే. నాపైన అమ్మకు అపారమైన విస్వాసం ఉండేది. ఆమెకోసమే నేను జీవించాలని, ఆమెని ఎప్పుడూ నిరాశపరచకూడదు అనీ అనిపిస్తుంది” అని ఒక సందర్భంలో ఎడిసన్ అన్నారు.

ఇంటి వద్దే చదువు చెప్పే తల్లితండ్రులందరూ నాన్సీ ఎడిసన్ లు కాలేరు. అలాగే ఇంటి వద్ద చదువుకున్న పిల్లలందరూ థామస్ ఆల్వా ఎడిసన్ లు కాలేరు. ఈ కథలో నాకు అన్నిటికన్నా ఆసక్తి కలిగించిన అంశం విద్యా విధానం పట్ల ఎడిసన్ కు ఉన్న దృక్పథం. అది అతని కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది ఈనాటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయే ఆలోచనా దృక్పధం.

తన కాలంలో ఉన్న విద్యా వ్యవస్థను ఎడిసన్ ఇలా విమర్శించారు. “ఇప్పటి విద్యా వ్యవస్థ మనోవికాసానికి అవకాశం ఇవ్వదు. అది బుద్ధిని ఒక మూసలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. బడిలో చెప్పిన దానిని పిల్లవాడు ఒప్పుకుని తీరాలి అని నేర్పిస్తుంది. వారి సృజనాత్మక ఆలోచనలకు, ప్రశ్నించే తత్వానికి అవకాశం ఇవ్వదు. పరిశీలన ద్వారా నేర్చుకోవడం కన్నా బట్టీ పట్టి నేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. తమ జీవితాలతో సంబంధం లేని విషయాలను బట్టీ కొట్టడమే తప్ప స్వంత ఆలోచనలకు తావు లేదు. దాని వలన భయం, భయం నుండి అజ్ఞానం పుట్టుకొస్తాయి”

ఎడిసన్ ది తీరని జ్ఞాన తృష్ణ. కేవలం పుస్తకాలలో ఉన్నదానిని అనుసరించడం కాకుండా తాను స్వయంగా పరిశోధించి విషయాలను తెలుసుకోవాలి అనుకునేవాడు. తన జీవితమంతా తాను చేసిన ప్రయోగాలను, పరిశీలనలను, తన ఆలోచనలను వివరంగా తన ప్రయోగశాలలోని నోటు పుస్తకాలలో రాసుకునేవారు. తాను ఒక వ్యాపారవేత్తగా ఎదిగాక కూడా తన కార్పొరేట్ ఆఫీస్ ను తన లైబ్రరీ లో ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆయనకి అధ్యయనం అంటే ఎంత మక్కువో అర్ధం అవుతుంది. తన చిన్నతనంలో మొదలైన వినికిడి సమస్య తనతో పాటే పెరిగినా దానిని ఎప్పుడూ ఆయన సమస్యగా అనుకోలేదు. ఇన్ని కొత్త ఉత్పత్తులను కనిపెట్టిన మీరు ఒక వినికిడి యంత్రాన్ని ఎందుకు కనిపెట్టలేదు అని ఒకసారి ఆయనని ఎవరో అడిగారు. బయటి శబ్దాలు వినపడకపోవడం మంచిదే కదా నా ప్రయోగాల మీద ఎక్కువ ధ్యాస కుదురుతుంది అన్నారు ఎడిసన్. 

తాను ఎన్నో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి, ఎంతో మంది సిబ్బందిని నియమించుకున్నాక కూడా తానే స్వయంగా పరిశోధనలు చేసుకునేందుకు ఆసక్తి చూపేవారు. 1890 లలో ఆయన ఒక వినూత్న పరిశోధన మొదలుపెట్టారు. భవనాల నిర్మాణానికి వాడే ఇటుకలు ఓపెన్ గా ఉండే గూడ్స్ రైళ్లలో తరలిస్తున్నప్పుడు వర్షం పడినట్లైతే తేమ ని పీల్చుకుని తడిగా ఉండేవి. ఆ పరిస్థితి లేకుండా వాన నీటిని గ్రహించి తేమ గా ఉండే ఇటుకలు తయారు చేయాలి అనుకున్నారు. రకరకాల పదార్ధాలతో బైండింగ్ సొల్యూషన్ ను తయారు చేసి చూసారు. ఎడిసన్, అతని సహోద్యోగులు దానిని “మక్” అని పిలిచేవారు. దానితో ఆ ప్రయోగంలో భాగస్వామ్యులైన వారందరినీ ఎడిసన్ “మక్కర్స్” అని పిలుస్తుండేవారు. ఇక ఎడిసన్ ప్రయోగశాలల్లో పని చేసే సిబ్బంది అందరికీ ఉమ్మడి పేరుగా “మక్కర్స్” స్థిరపడి పోయింది. వారంతా తర్వాత కాలంలో “ఎడిసన్స్ మక్కర్స్” పేరుతో మరొక సంస్థని కూడా స్థాపించుకున్నారు.

ఒక పేరెంట్ గా కూడా తన పిల్లలను పరిశీలన, పరిశోధన వైపు ప్రోత్సహించాడు. తాను ఏ పుస్తకం చదవాలనుకుంటున్నాడో పిల్లలకి చెప్పి తన విశాలమైన లైబ్రరీలో ఆ పుస్తకం కోసం వెతకమని పిల్లలకి చెప్పేవాడు. ఒక్కోసారి కొన్ని పేజీలు వెతికి పెట్టమని అడిగేవాడు. ఆ విధంగా పిల్లలకు పుస్తకాలతో సమయం గడిపే అవకాశం ఇస్తూ వారిని పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాడు. 

ప్రస్తుత విద్యా విధానం పట్ల తన అసంతృప్తిని ప్రకటిస్తూనే తనకు మాంటిస్సోరి విద్యా విధానం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసాడు. “నాకు మాంటిస్సోరి పద్ధతిలో బోధన అంటే ఇష్టం. అది పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ పద్దతిలో నేర్చుకోవడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప పిల్లలకు ఇబ్బందిగా ఉండదు. మనిషి సహజాతాలను అర్ధం చేసుకుంటే బోధించే వ్యవస్థ ఇది” అని ఒకచోట రాశారు. 1913 లో మరియా మాంటిస్సోరి తొలిసారి అమెరికా సందర్శించినప్పుడు ఎడిసన్ ఇంట్లోనే బస చేశారు.

ఎడిసన్ ఆవిష్కరణలు ప్రపంచంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. సాంకేతిక విప్లవానికి ఆద్యులలో ఆయనను ఒకడిగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రయోగాలు, ఫలితాల పట్ల మాత్రమే కాక ఎడిసన్ విద్యా విధానం పట్ల, నేర్చుకునే ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తల్లి నేర్పిన నాలుగు సూత్రాలను తన జీవితాంతం పాటించారు. 

ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. దాని నుండి నేర్చుకో. మళ్లీ ప్రయత్నించు. 

బుద్ధితో, చేతులతో రెండింటితో నేర్చుకో 

విలువైనవన్నీ పుస్తకాలలోనే దొరకవు – ప్రపంచాన్ని పరిశీలించు 

నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. అన్ని రకాల సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యి.

ప్రతి పేరెంట్ కూడా ఈ విధమైన సూత్రాలను తమ పిల్లలకు నేర్పినట్లైతే వారు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంటారు. 

దాదాపు శతాబ్దం తర్వాత కూడా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఈ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమాచార సాంకేతిక యుగంలో విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలి అనుకుంటే పిల్లలను “మక్కర్స్” గా ఉండేలా ప్రోత్సహించేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వారు నేర్చుకోవడంలోని ఆనందాన్ని గ్రహించగలుగుతారు.

–Based on a piece by Mamata

విద్యా వ్యవస్థ భవిష్యత్తు ముఖచిత్రం: Future of Education

ఏడాది క్రితం కరోనా, లాక్ డౌన్ ప్రజల జీవితాలలో ఎటువంటి ప్రభావం చూపించాయి అర్ధం చేసుకునే క్రమంలో నా సహోద్యోగులతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకున్నాం. బడి ఈడు పిల్లల మీద కోవిద్ చూపించిన ప్రభావాన్ని గురించి మేము అర్ధం చేసుకున్న విషయాలను ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేసాం. వాటిలో కొన్ని ఇవి. 

  • చదువుకు సుదీర్ఘ విరామం రావడం వలన నేర్చుకున్న విషయాలను మర్చిపోవడం 
  • విద్యావకాశాలను అందుకోవడంలో అసమానతలు – ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాలు లేకపోవడం 
  • ఇంటి దగ్గర చదువుకు తల్లితండ్రుల సహకారంలో ఉన్న సమస్యలు 
  • ఇతర పిల్లలు, పెద్దవారితో కలిసే అవకాశం లేకపోవడం 
  • వినూత్న విద్యా బోధనా పద్ధతులకు, సాంకేతిక అంశాలకు అలవాటు పడటంలో ఉన్న సమస్యలు 
  • తగినంత బోధన, వనరులు లేకపోవడం
  • బయటకి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునేందుకు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనేందుకు అవకాశం లేకపోవడం 
  • పిల్లలలో ఉండే అసాధారణమైన శక్తికి తగిన పనులు లేకపోవడం 
  • సరైన నిర్మాణం, క్రమశిక్షణ లేని బోధనా వ్యవస్థ 
  • మధ్యాహ్న భోజనం అందకపోవడం వలన పెరిగిన పోషకాహార లోపాలు 
  • ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించినా సామాజిక దూరం, సరైన పరిశుభ్రత పాటించేందుకు తగినన్ని మౌలిక వసతుల లేమి
  • పెద్ద ఎత్తున వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లిన కారణంగా, తగ్గిన ఆదాయాల వలన ప్రైవేట్ పాఠశాలల నుండి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చిన కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భారం 
  • పాఠ్యపుస్తకాల అందుబాటు లో ఉన్న సమస్యలకు తోడు విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం వలన ఉత్పన్నమైన సమస్యలు 
  • విద్యా సంవత్సరం లో, పరీక్షా విధానాలలో వచ్చిన మార్పులు 
  • అనేక కారణాల వలన కొంతమంది పిల్లలు చదువు మధ్యలో మానుకోవడం, పెరిగిన బాల కార్మికుల, బాల్య వివాహాల సంఖ్య
  • భయం, ఆందోళన 
  • ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన తల్లితండ్రులు ఎదుర్కునే మానసిక ఒత్తిడి 
  • ఆరోగ్యసేవలు అందుబాటులో లేకపోవడం

ఇలా అనేక రకాల సమస్యలను అందరూ గుర్తించడం జరిగినా ఈ ఏడాది కాలంలో వీటిని ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలు రూపొందలేదనేది వాస్తవం. 

బడులు ప్రారంభించాలా? వద్దా?

తరగతుల నిర్వహణ మొదలుపెట్టాలా? వద్దా? 

పరీక్షలు నిర్వహించాలా? లేదా? 

ఇటువంటి స్వల్పకాలిక సమస్యలే తప్ప ఏడాది పాటు బడులు మూసి ఉంచడం వలన ఉత్పన్నమవుతున్న దీర్ఘకాలిక సమస్యల పట్ల పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.

నిజానికి విధాన రూపకర్తల అసలు బాధ్యత ఈ సమస్యల అన్నిటినీ అర్ధం చేసుకుని భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో, వినూత్న ప్రపంచానికి పిల్లలను ఎలా సంసిద్ధులను చేయాలో ఆలోచించడం. ఈ నేపథ్యంలోనే యునెస్కో ‘కోవిద్ అనంతర ప్రపంచంలో విద్యా వ్యవస్థ: 9 ఆలోచనలు” పేరుతో ఒక నివేదిక ప్రచురించింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని నిర్దేశించే ఆలోచనలు అని వీటిని అనలేము కానీ పైన చెప్పుకున్న సమస్యల సాధన దిశగా ఈ సూచనలు కొంతవరకూ పనిచేసే అవకాశం ఉంది. ఆ తొమ్మిది ఆలోచనలు ఇలా ఉన్నాయి.

1. ప్రజా సంక్షేమ సాధనకి విద్య ఒక ఉత్తమ మార్గంగా గ్రహించి విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. అసమానతలను నిర్మూలించేందుకు విద్య ఒక్కటే మార్గం 

2. విద్యా హక్కు యొక్క నిర్వచనాన్ని మరింత విస్తరించాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం, సమాచారం, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్వచనంలో భాగం కావాలి.

3. ఉపాధ్యాయ వృత్తికి మరింత గౌరవం పెరగాలి. ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం జరగాలి. క్షేత్ర స్థాయి విద్యావేత్తలకి తగినంత స్వతంత్ర ప్రతిపత్తి, ఒకరితో ఒకరు కలిసి పనిచేసేందుకు తగిన వెసులుబాటు ఇవ్వాలి 

4. విద్యార్థులు, యువత, పిల్లల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి, వారి హక్కులను కాపాడాలి. విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలని విద్యార్థులు, యువత కోరుకుంటున్నారో అర్ధం చేసుకుని దానికి తగిన వ్యవస్థ నిర్మాణం చేపట్టాలి.

5. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల వలన బడి వాతావరణం పిల్లలకు అందించే సామాజిక వేదికలను కోల్పోకుండా చూడాలి. ఎంత టెక్నాలజీ ఆధారిత తరగతులు నిర్వహిస్తున్నా బడి ఉండాల్సిందే. సంప్రదాయ తరగతి గదికి భిన్నంగా ఎన్నో కొత్త వేదికలు రూపొందుతూ ఉండవచ్చు. కానీ బడి అనే వ్యవస్థలో పిల్లలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండాలి.

6. ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తేవాలి. విద్య నేర్చుకునేందుకు తగిన స్థలం, వాతావరణం లేకుండా, విద్యార్థులు, గురువుల మధ్య మానవ సంబంధం లేకుండా రెడీ మేడ్ గా లభించే సమాచారం వలన విద్యావికాసం జరగదు. ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో ఉన్న డిజిటల్ కంటెంట్, ప్లాట్ఫారం ల మీద విద్యా వ్యవస్థ ఆధారపడటం సమంజసం కాదు.

7. శాస్త్రీయ అక్షరాస్యత (సైంటిఫిక్ లిటరసీ) విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి

8. ప్రభుత్వ విద్యా వ్యవస్థకి స్థానికంగా, అంతర్జాతీయంగా సమకూరుతున్న ఆర్ధిక వనరులను నిలబెట్టుకోవాలి. దశాబ్దాలుగా సాధించిన ప్రగతి ఈ పాండెమిక్ వలన ఎన్నో మెట్లు కిందకి దిగజారింది 

9. ప్రస్తుత అసమానతలను తొలగించాలంటే అంతర్జాతీయ స్థాయి సమన్వయం, సహకారం అవసరం.

(సేకరణ:: https://en.unesco.org/sites/default/files/education_in_a_post-covid-world )

గత ఏడాది కాలంలో ప్రపంచం ఎంతో మారింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో ఆలోచించాల్సిన తరుణం ఇదే, ఇప్పుడే.

–Based on a piece by Meena

మరియా మాంటిస్సోరి : Montessori–For All Our Children

ఆగస్ట్ 31 మరియా మాంటిస్సోరి జయంతి. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు మన పిల్లలందరూ చదువుకునే మాంటిస్సోరి విద్యా వ్యవస్థ రూపకర్త ఆమె. అయితే ఈ విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థను రూపొందించకపోయినా ఆమె పేరు చరిత్ర పుటలలో  మరో రూపంలో నిలిచే ఉండేది. 1883-84 లో తన పదమూడు సంవత్సరాల వయసులో ఆమె అందరూ మగపిల్లలే ఉండే సాంకేతిక విద్యా పాఠశాలలో చేరింది. ఆమె ఈ సాంకేతిక విద్యను ఎంతో ఇష్టంతో ఎన్నుకుంది. ఇంజనీర్ కావాలనేది ఆమె కోరిక. అది ఆ రోజుల్లో ఆడపిల్లలు కలలో కూడా ఊహించనిది. 1890 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే నాటికి ఆమె మనసు మార్చుకుని డాక్టర్ కావాలనుకుంది. అది కూడా ఏమంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. యూనివర్సిటీ ఆఫ్ రోమ్ లో మెడిసిన్ కోసం అప్లై చేసుకుంటే ఆమెకు ఏ మాతం ప్రోత్సాహం లభించలేదు. దానితో ఆమె నాచురల్ సైన్సెస్ ను ఎంపిక చేసుకుని 1892 లో డిప్లొమా ఇన్ డి లైసెంజా పట్టా పొందింది. దీనితో పాటు లాటిన్, ఇటాలియన్ భాషలలో కూడా పట్టు సాధించడంతో 1893 లో ఆమెకు యూనివర్సిటీ లో మెడిసిన్ సీట్ లభించింది. అయితే అది మొదటి అడుగు మాత్రమే. ఇతర విద్యార్థుల నుండి, ప్రొఫెసర్ ల నుండి ఆమె ఎంతో వివక్ష, ఒత్తిడులను ఎదుర్కొంది. మగపిల్లలతో కలిసి నగ్న మృత దేహాలను పరిశీలించడానికి ఆమెకు అనుమతి లేదు. కాలేజీ వేళలు ముగిశాక ఆమె ఒంటరిగా మృతదేహాలకు డిసెక్షన్ నిర్వహించవలసి వచ్చేది. ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. 1896 లో యూనివర్సిటీ ఆఫ్ రోమ్ నుండి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. అప్పటి సమాజ కట్టుబాట్ల వలన ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో వేదనను ఎదుర్కొంది. తన సహోద్యోగి అయిన గిసుఎప్పీ మోంటేసానో ను ఆమె ప్రేమించి అతనితో ఒక బిడ్డను కూడా కన్నది. అయితే అతనిని పెళ్ళి చేసుకోలేకపోయింది. పెళ్ళి చేసుకున్నట్లైతే ఆమె తన ఉద్యోగ జీవితం నుండి విరమించుకోవలసి వచ్చేది. ఆమె చిన్న పిల్లల వైద్యంలో ప్రత్యేక శిక్షణ పొందింది. మానసిక వైకల్యం గల పిల్లలకు విద్యను అందించేందుకు కృషి చేసింది. 1906 లో రోమ్ లోని శాన్ లోరెంజో అనే చిన్న పట్టణంలోని అత్యంత నిరుపేద వర్గాల పిల్లల కోసం ఒక చైల్డ్ కేర్ సెంటర్ ను ప్రారంభించింది.వారికి గతంలో పాఠశాల ముఖం చూసిన అనుభవమే లేదు. ఆ కేంద్రాన్ని కేస డెయి బాంబిని అని పిలిచేవారు. ఇటాలియన్ లో దీని అర్ధం పిల్లల ఇల్లు అని. వారికి చదువు అబ్బదు అని ముద్ర వేయబడ్డ పిల్లలందరికీ అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందే ఏర్పాటు చేసిందామె. దాదాపు 50-60 పిల్లలు అక్కడ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ కేంద్రం యొక్క భవన సంరక్షకుడి కుమార్తె డాక్టర్. మాంటిస్సోరి మార్గదర్శకత్వంలో అక్కడ మొదటి టీచర్ గా పని చేసింది.

Bunny

ఈ పాఠశాల అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కొన్ని రోజులకే పిల్లలు పజిల్స్ ను పరిష్కరించడం, వంట చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి నేర్చుకోవడంతో పాటు క్రమశిక్షణతో పద్దతిగా ఉండి విషయం పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.

మాంటిస్సోరి ఈ పాఠశాలలో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చి కొద్దినాళ్ళకే కేవలం ఇటలీ లోనే కాక ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ నమూనాను అమలు చేయడం ప్రారంభించారు. మాంటిస్సోరి అనేది ప్రతి ఇంటిలోనూ చిరపరిచితమైన పేరుగా మారింది. భారతదేశంలో కూడా మాంటిస్సోరి విద్యా విధానం 1920 నుండే అమలు చేసిన చరిత్ర ఉంది.

ఈ విద్యా విధానం ఇప్పటి పిల్లలకు ఎంతో అవసరం అనడంలో ఏ సందేహమూ లేదు. ప్రతి అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాల మాంటిస్సోరి పాఠశాల కావాలి. ఈ మాంటిస్సోరి విద్య ప్రధానంగా తమ కుటుంబాలలో చదువుకుంటున్న మొదటి తరం పిల్లలను, అత్యంత నిరుపేద కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. మొదటి ఉపాధ్యాయురాలు కూడా పెద్దగా చదువు లేని ఒక భవన సంరక్షకుడి కూతురు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే మాంటిస్సోరి విద్య అత్యంత అవసరమైన, తప్పనిసరిగా అమలు చేయాల్సిన, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే విద్యా నమూనాగా అర్ధం చేసుకోవచ్చు.

అయితే మన విద్యా విధానం అంతా ధనికులు, పలుకుబడి కలిగిన వర్గాల పిల్లలకోసం ఏర్పాటు చేసిన పాఠశాలల నమూనాలో నడుస్తుండటం మన దురదృష్టం. ఈ పాఠశాలల ఫీజులు కనీసం మధ్య తరగతి వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండటం లేదు.

మాంటిస్సోరి పద్ధతుల మూల సూత్రాలను పక్కనపెట్టి తక్కువ ఖర్చుతో చేయవల్సిన విద్యా బోధనను ఎవరికీ అందుబాటులో లేని, విస్తృతంగా అమలు చేయడానికి వీలుకాని నమూనాగా మనమే మార్చివేశామా?

ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసుగల పిల్లలకు కూడా విద్యను అందించవలసిన అవసరాన్ని గుర్తించింది. మాంటిస్సోరి విద్యా విధానం గురించి పునర్విమర్శ చేసి ప్రతి విద్యా సంస్థలోనూ దీనిని ఒక అభ్యాస ప్రాతిపదికగా, విద్యా బోధనా విధానంలో భాగంగా మార్చేందుకు ఇదే సరైన సమయం. 

Translated by Bharathi Kode from Meena’s piece