బట్టల హ్యాంగర్/కరవాలం చరిత్ర: Handy Hangers

బట్టల షాపింగ్ కి వెళ్ళినప్పుడు అతి సాధారణంగా కనిపించే వస్తువు హ్యాంగర్.

ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, భారత్ లో తయారు చేయబడిన హ్యాంగర్ ఉండే ఆస్కారం 12% ఉందని మీకు తెలుసా!.. 

హ్యాంగర్ లు అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది కాగా మొదటి రెండు స్థానాలలో చైనా, వియాత్నాంలు ఉన్నాయి. ప్రతీ ఏడాది భారత్ సుమారు 11.1 వేల ఎగుమతులు ప్రముఖంగా అమెరిక, జర్మనీ, మరియు స్వీడన్ దేశాలకు చేస్తుంది.

ఐతే ఇంతలా మనను చుట్టేసిన ఈ హ్యాంగర్ల సృష్టికి ఎన్నో కథలు మరెన్నో మూలాలు చెప్పుకుంటారు. అందులో కొన్ని;

అమెరికా దేశం మూడవ అధ్యక్షుడు తన బట్టలని ఒక వరుసలో అమర్చుకునేందుకు గాను నేటి హ్యాంగర్ ను పోలినటువంటి పరికరం వాడేవారని వినికిడి, ఐతే దీన్ని నిరూపించడానికి పెద్దగా ఆధారాలు లేవు. కొన్ని కథనాల ప్రకారం, హ్యాంగర్ ల ఆవిష్కరణ 1869 సంవత్సరంలోని వ్యక్తి  ఒ.ఎ నార్త్ (A O North) కి చెందుతుంది. అలాగే మరికొందరు 1903 లో ఎజె పార్క్ హౌస్ దీని ఆవిష్కరణకు మూలం అని నమ్ముతారు. దాని వెనుకాల కథ క్లుప్తంగా, ఒక రోజు ఉదయం పార్క్ తన పనికి వచ్చీ రాగానే కోట్ తగిలించుకునే కొక్కాలు ఏవి ఖాళీ లేకపోవడం చూసి, చిరాకుగా పక్కన పడున్న తీగని ప్రస్తుతం వాడకంలో ఉన్న హ్యాంగర్ ఆకారంలోకి అమర్చుకొని తన కోట్ తగిలించుకున్నాడని వినికిడి.

చెక్క, ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్, ట్యూబ్, ఇలా వివిధ రకాలుగా హ్యాంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐతే పర్యావరణ కోణం దిశగా నేడు పునరుత్పత్తి/రీసైకల్ చేయబడిన హ్యాంగర్స్ వైపు దృష్టి మరులుతుంది. ఖరీదైన బట్టల కోసం సాటిన్ హ్యాంగర్లు అలాగే లగ్జరీ మరియు కస్టం/ అవసరానికి అణుగునంగా చేయబడిన వర్గంలో రకరకాల హ్యాంగర్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.  

ప్రాథమికంగా చూసుకుంటే, హ్యాంగర్ అనే పరికరం మనుషుల భుజాలను పోలి ఉండి; మన బట్టలు, కోట్స్, స్కర్ట్స్ ముడత పడకుండా ఉండడానికి వాడే వస్తువు. హ్యాంగర్ల కింద భాగం ప్యాంట్స్/స్కర్ట్స్ తగిలించడానికి తయారుచేయబడింది. ఐతే మొదటి రకం హ్యాంగార్స్ లో ప్యాంట్స్/స్కర్ట్స్ వేలాడదీయడానికి అనువుగా క్లాంప్స్/బిగింపులు ఉండేవి.

20వ శతాబ్దం మొదలు నుంచి వైద్య-లాయర్ వృ త్తులలో ఉన్నవారికి హ్యాంగర్స్ యొక్క అవసరం బాగా పెరిగింది. వారి బట్టలు చక్కగా పెట్టుకోవడానికి హ్యాంగర్ లు ఒక సులభమైన పరికరం లా వారికి చిక్కాయి.

కొంత సమయంలోనే హ్యాంగర్స్ ప్రతి అవసరానికి తగట్టు రకరకాల విధాలుగా అందుబాటులోకి వచ్చాయి. సులువుగా మడత పెట్టి విహారాలకు తీసుకు వెళ్ళే వీలుగా- స్కార్ఫ్ హ్యాంగర్స్, బ్లాంకట్ హ్యంగెర్స్, టై హ్యాంగెర్స్ మొదలగు విధంగా పరిణామం చెందాయి.

మనం గమనించినట్టైతే హ్యాంగర్స్ పరిమితి కేవలం ఇంటి వరకే కాకుండా రీటైల్ (వ్యాపరాల) రంగంలో ఇంకా విస్తృతంగా ఉంది. అక్కడికే ఆగకుండా, వస్తువుల బ్రాండ్ వృద్ధి లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఈ హ్యాంగర్.       

హ్యాంగర్స్ ఉత్పత్తి సంస్థల్లో ‘మైనెట్టీ’ (Mainetti) ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ సంస్థ కథ 1950 లలో ఇటలి దేశంలో మొదలైంది. కథ సారాంశం, రోమియొ మైనెట్టి అనే ఒక తెలివైన కుర్రవాడు రేసింగ్ కారు నడిపే యజమాని దగ్గర పని చేసేవాడు. యజమాని తండ్రి, వస్త్ర రంగంలో మహా ఉద్ధండుడు మార్జొట్టో కార్పరేషన్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ రెడీ-మేడ్ సూట్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన రోజులవి. అందులో భాగం గానే అవి నలగకుండా ఉండడానికి గాను హ్యాంగర్ల వాడకం పెంపొందించిందా సంస్థ. చెక్కతో తయారుచేయబడిన ఆ హ్యాంగర్ల ఖరీదు, బరువు రెండు అధికంగా ఉన్న పరిస్థితిని అప్పటికి గమనిస్తూ వస్తున్న రోమియొ వాళ్ళ అన్న మారియొ. గతంలో తనకు ప్లాస్టిక్ కంపని లో ఉన్న అనుభవాన్ని మేళవించి రొమియో తో కలిసి ప్లాస్టిక్ హ్యంగర్ల తయారీని నెలకొల్పారు.

అలా మొదలైన వారి ప్రయాణం యూకే, ఫ్రాన్స్, కెనడా, మరియు నెదర్ల్యాండ్స్ వంటి దేశాలకు చేరింది. వారు గుర్తించిన అంతరం, అందించిన నాణ్యత ఆ రంగాన్నే ఒక కొత్త వెలుగు తో నింపింది. ప్రస్తుతం 6 ఖండాలు, 90 స్థానాలలో విస్తరించి, భారత్ లో కూడా ప్రముఖమైన ఉత్పత్తి కేంద్రం నెలకొల్పింది.

లోహాల వెల్డింగ్ మొదలుకుని డ్రైనేజి శుబ్రపరుచుకునే వరకు, మొక్కలు పెట్టుకునే సాధనం నుంచి పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ వరకు. ఇలా బట్టల హ్యాంగర్స్ వాడకం ఏన్నో ఆవిష్కరణలకి స్థావరం అయ్యింది. మరోవైపు ఇదే హ్యాంగర్ కార్ దొంగతనాలకి, అబార్షన్ లకి ఒక ముఖ్య వస్తువు అవ్వడం భాధాకరం, ఒక సమర్ధించరాని నిజం. 

కాగా ఈ చరిత్ర పుటల్లో మన ముడత పడిన బట్టలకూ ఒక హ్యాంగర్ ఎల్ల వేళలా తోడై ఉంటుందని కోరుకుంటూ!

ఈ పూట పూర్తి పర్యావరణ స్పృహతో ఒక మంచి హ్యాంగర్ కొందామా మరి?

  • మీన (Based on a piece by Meena)

నూలు నేసిన చరిత్ర (Fabrics for Freedom, Khadi and Beyond’)

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఖద్దర్ కి ఉన్న విశిష్టత మనందరికి తెలిసిందే!

ఖాదీ ధరించడం కేవలం బ్రిటిషర్ల దిగుమతులని  ధిక్కరించడానికి జరిగిన  స్వేచ్చా  పోరాటం మాత్రమే కాదు. కొన్ని లక్షలమంది జీవనోపాధికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి, ఒక దృఢమైన చిహ్నం.  

దివ్య జోషి మాటల్లో: ‘ఖాదీని గాంధీజీ ఈ దేశ జాతీయవాదనికి, సమానత్వానికి మరియు స్వాలంబనకు ప్రతీకగా నిలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పాటించి ఈ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఖాదీ పాత్ర ముఖ్యమైనదని అని వారు బలంగా విశ్వసించారు. ఒకప్పుడు పేదరికానికి మరియు వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచిన రాట్నాన్ని స్వాలంబనకు, అహింసకు చిరస్మరణీయమైన గుర్తుగా మలిచారు గాంధీజీ.’

ఐతే! స్వాతంత్ర్య సాధనలో వస్త్రాలు నూలడం-నేయడం కేంద్ర భాగమై జరిగిన పోరాటాలు భారత్ లోనే కాకుండ మరెన్నో దేశ చరిత్రలలో కనిపిస్తుంది. అలా, బ్రిటిష్ ని ఎదురిస్తూ, వస్త్రాన్ని ఆయుధంగా మలచుకున్న ఉద్యమ చరిత్రల్లో అమెరికాది కూడా ఒకటి.        

  అమెరికాతో సహా తాము పాలించిన కాలనీలను బ్రిటన్ దేశం ప్రధానంగా తమ ముడి పదార్ధాల సరఫరాదారులుగా భావించారు. పత్తి ఇతరాత్రా ముడి సరుకుని తమ దేశానికి ఎగుమతి చేసుకుని, తయారైన బట్టలను రెట్టింపు పన్నులతో మళ్ళీ అవే కాలనీలలో విక్రయించేవారు. ఈ ప్రక్రియను ధిక్కరిస్తు బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికా కాలనీ ప్రజలు 1760-1770 మధ్య కాలంలో తమ దేశభక్తిని చాటుతూ చరఖా/రాట్నం సహయంతో, ఒక శక్తిగా కదిలి వారి వస్త్రాల్న్ని వారే తయారు చేసుకోవడం జరిగింది. విధిగా ఇదే రాట్నం 20వ శతాబ్దం భారత దేశ స్వాతంత్ర్య చరిత్రలోను కీలకమైన పాత్ర పోషించింది.

అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో కీలకంగా నిలిచిన రాట్నం/స్పిన్నింగ్ ఉద్యమాల్ని మహిళలు ముందుండి నడిపించారు. ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తూ బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి మహిళ తమ ఇళ్లలోనే నూలు నూయడం, వస్త్రాల్ని నేయడం జరిగింది. ఆ విధంగా నేసిన వస్త్రాలు ‘హోంస్పన్’ గా ప్రసిద్ధి చెందాయి. అలా హోంస్పన్ వస్త్రాలు ధరించడం దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.

కొన్ని కాలనీలలో మహిళలు, సామాజిక నిరసన వ్యక్తపరుస్తూ, కలిసి రాట్నాలు ఏర్పరుచుకొని నూలే వారు. అలా ఏర్పరుచుకున్న సామూహిక ప్రదేశాలు ‘స్పిన్నింగ్ బీస్’ గా ప్రసిద్ధి చెందాయి. మార్చి 1768 లో మొదలుకొని 32 నెలల పాటు హార్ప్స్వెల్ నుంచి, మైనె నుంచి, హంటింగ్టన్, లాంగ్ ఐలండ్ వంటి కాలనీలలో విస్తృతంగా 60 స్పిన్నింగ్ మీటింగ్స్ జరుపుకున్నారని ప్రసిద్ధి.

అమెరికా సమాజంలో ఈ స్పిన్నింగ్ బీస్ సృష్టి-ప్రేరణలో, రాజకీయ అసమ్మతివాదుల సంఘం ‘డోటర్ ఆఫ్ లిబర్టీ’ కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు బ్రిటిష్ వారు తమ దేశంలోకి దిగుమతి చేసే వస్తువులు ముఖ్యంగా టీ, బట్టలు మొదలగు వాటి సంఘ బహిష్కరణను ప్రొత్సహించడం మరోవైపు ప్రత్యామ్నయాలని గుర్తించి సొంతంగా తయారుచేసుకునే భాద్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించింది.

అమెరికాలో ధ్వనించిన తీరుగనే భారత దేశంలో కూడా స్వాతంత్ర్య సమరయోధుల ప్రచారాల్లో, ర్యాలీలలో, పిలుపులో స్పిన్నింగ్ అనేది పోరాట స్ఫూర్తి రగిలించడంలో  కేంద్ర అంశంగా నిలిచింది. హోంస్పన్ వస్త్రాలలో జరుగుతున్న ప్రతి చిన్న అభివృద్దిని, పురోగతులను పత్రికలు నివేదించేవి. అలానే స్పిన్నింగ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి, వాటి ద్వారా బాగా/ఎక్కువ మొత్తాలలో నేసేవారిని గుర్తించి పురస్కారాలు అందించడం చేసేవారు. అలా ప్రేరణతో చిన్నా-పెద్దా  తేడా  లేకుండా ప్రతి ఒక్కరూ వస్త్రాలు నెయ్యడానికి ముందుకు రావడం జరిగింది, అదే విషయాన్ని గుర్తిస్తూ న్యూపొర్ట్ కి చెందిన 70 ఏళ్ళ ముసలావిడ తన జీవింతంలోనే మొదటిసారి రాట్నం తిప్పడం నేర్చుకొని వస్త్రాన్ని నేసిందని అప్పటి పత్రికలు నివేదికలు ఇచ్చాయి.

పోరాట స్ఫూర్తి ని మరింత రగిలిస్తూ 1769 సమయంలోనే ఏన్నో స్పిన్నింగ్ పోటీలు విధిగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న సభ్యులు పోటా-పోటీగా గెలిచారని అప్పటి నివేదికలు తెలియజేసాయి.

వీటన్నిటి పర్యావసానం, అమెరికాకు బ్రిటిష్ చేసే దిగుమతులు తీవ్రంగా పడిపొయాయి, ఒక సంస్థ ప్రచూరించిన లెక్క ప్రకారం 1769 ముందు సంవత్సరంతో పోలిస్తే ఆ ఏడు దిగుమతులు 4,20,000 నుంచి 2,08,000 పౌండ్ కి పడిపోయాయి.

 ఆ విధంగా ఈ ప్రపంచంలోని ఏన్నో  దేశాల్లో ‘స్వదేశీ’ అనేది సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలన పట్ల తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది.

ఇదే స్ఫూర్తి 150 ఏళ్ళ తరువాత, భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కనిపిస్తుంది. అదే మన ఆత్మ విశ్వాసం, మనోబలం, గుర్తింపుగా నిలిచింది, నిలుస్తుంది.

-మీన

పర్యాటకానికి లోటెక్ అడ్డంకులు: Tourist Spots

ఇంతకుముందు వ్యాసంలో టూరిజం కు అడ్డంకిగా ఉన్న కొన్ని హైటెక్ అంశాల గురించి ప్రస్తావించాము. పోయిన నెలలో నా మైసూర్ ప్రయాణం దేశంలో టూరిజం విస్తరించడానికి అడ్డంకిగా ఎన్నో లోటెక్ అంశాలను గుర్తు చేసింది. 

మైసూర్ ప్యాలస్ (మరమ్మత్తు పనుల కారణంగా సగం ప్యాలస్ లోకి సందర్శకులకు అనుమతి లేనే లేదు) లో కానీ, జగన్మోహన్ ప్యాలస్ లో కానీ ఆర్ట్ గ్యాలరీ ని సందర్శించాలంటే సందర్శకులు చెప్పులు విడిచి లోపలి వెళ్ళాలి. కొన్ని పవిత్రమైన శాలిగ్రామాలు లోపల ఉన్నందున ఈ నిబంధన ఉంది. అయితే ఆ శాలిగ్రామాలు మందపాటి వెండి తలుపుల వెనక ఉన్నాయి. నిజానికి చెప్పులు విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు. జగన్మోహన్ ప్యాలస్ లో గ్యాలరీ లోపల ఇతర ప్రదర్శనలతో పాటు ఒక వినాయక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి దానిని సందర్శించుకోవాలనుకునేవారి వరకు చెప్పులు తీసి వెళ్లమనే అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా ఎంతో పెద్ద ప్యాలస్లు. ఎన్నో అంతస్తులలో విస్తరించి ఉన్నాయి. ప్రతిరోజూ సందర్శకులు వస్తూనే ఉంటారు. చెప్పులు తీసి తిరగడం సౌకర్యమూ కాదు, వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా మంచిదీ కాదు. ఒకవేళ తప్పని సరిగా చెప్పులు తీసి వెళ్ళాలి అంటే సాక్స్ వంటివి ఏర్పాటు చేసి గ్యాలరీ సందర్శన ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకుని, శుభ్రపరచి తిరిగి వాడుతూ ఉండొచ్చు. లేదా మరేదైనా పరిష్కారం ఆలోచించవచ్చు. నా భర్త రఘు డయాబెటిక్ పేషెంట్. ఏదైనా చిన్న గాయమైనా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అని ఈ రెండుచోట్లా చెప్పులు తీయడం ఇష్టం లేక లోపలికి రాలేదు. మిగిలినవారమంతా లోపలోకి వెళ్లాం. లోపల ప్రదర్శనకు ఉన్న అద్భుతమైన కళా ఖండాలను చూసే అదృష్టం ఆయనకు లేకపోవడం ఎంత విచారకరం.

ఇక బృందావన్ గార్డెన్స్ సందర్శన మరొక బాధాకరమైన అనుభవం. మేము అక్కడకి వెళ్లడం కొంచెం ఆలస్యం అయ్యింది. పూర్తిగా చీకటి పడే లోపే గార్డెన్స్ చూడాలని మేమెంతో ఉత్సాహపడ్డాము. మేము అక్కడకి చేరే సమయానికి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గి పూర్తిగా మనుషులను ఎక్కించుకుని రౌండ్ కి తీసుకుని వెళ్ళింది. తర్వాత మళ్ళీ బగ్గి ఎప్పుడు ఉంటుందో అడుగుదామని సమాచారకేంద్రం కోసం వెతికాం. అటువంటిదేమీ ఉన్నట్లు కనిపించలేదు. బగ్గి సమయాలు సూచిస్తూ ఒక బోర్డు కూడా లేదు. ప్రవేశద్వారం దగ్గర అడ్డదిడ్డంగా ఏర్పాటుచేసిన షాప్ లలో కొంతమందిని అడిగాము. ఏ ఇద్దరు చెప్పిన సమాచారమూ ఒకేలా లేదు. సరే ఈ లోపు ఒక కాఫీ తాగి తర్వాత బగ్గి కోసం ఎదురుచూద్దాం అనుకున్నాం. కాఫీ లు ఆర్డర్ చేసాము. మధ్యలో కరెంటు పోవడంతో మాకు కాఫీ ఇవ్వలేదు. బాత్రూం ల కోసం చూసాము. అవి ఎక్కడున్నాయో సూచించే బోర్డు లేమీ కనపడలేదు. అటుఇటు తిరిగి వాటిని వెతికి పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. నలభై ఐదు నిముషాలు దాటినా మళ్ళీ బగ్గి రాలేదు. చీకటి పడింది. ఇక మేము తిరిగివెళ్లిపోదాం అనుకున్నాం.

తర్వాత రోజు మంగళవారం. రైల్ మ్యూజియం చూద్దాం అనుకున్నాం. మేము అక్కడకి చేరేటప్పటికి అది మూసేసి ఉంది. దానితో జూ కి వెళదాం అనుకున్నాం. అయితే జూ కి కూడా ఆ రోజు సెలవు దినమే అట. 

ఆ విధంగా మా మైసూర్ పర్యటన మొత్తం గందరగోళంగా ముగిసింది. మైసూర్ చాలా అందమైన నగరం. పచ్చని, ప్రశాంతమైన ఆ నగరంలో డ్రైవింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మాలో కొంతమంది ప్యాలస్, మ్యూజియం చూడగలిగాం. ఎంతో రుచికరమైన దోసెలు, సాంబారులో ముంచిన ఇడ్లీలు, పుల్లని, రుచికరమైన పచ్చళ్ళు అతి తక్కువ ధరలలో సంతృప్తిగా, శుచికరంగా తినగలిగాము.

ఇక ఆ ట్రిప్ మొత్తంలో అద్భుతంగా అనిపించిన అంశం ఒకటి ఉంది. దాదాపు 99 వేల బల్బులతొ రాత్రిపూట ధగధగా మెరిసిపోతున్న ప్యాలస్ ను చూస్తుంటే ఏదో జానపద కథలోకో, అందమైన కలలోకో జారినట్లు అనిపించింది. ఆదివారాలు, సెలవు దినాలలో ప్యాలస్ ఇలా విద్యుత్ కాంతితో మెరిసిపోతుంది తెలిసింది. మా పాలస్ టూర్ గైడ్ చెప్పి ఉండకపోతే ఆ రోజు అలా వెలిగిపోయే ఒక ప్రత్యేకమైన రోజు అని తెలిపే బోర్డు లు ఏవీ లేనందువల్ల ఈ అందమైన అనుభవాన్ని కూడా కోల్పోయేవాళ్ళం.

భారతదేశం ఎంతో ప్రాకృతిక, సాంస్కృతిక సంపద కలిగిన దేశం. ఇప్పడు చాలామంది భారతీయులు పర్యాటకంపై ఆసక్తి చూపిస్తూ అందుకు సమయం, డబ్బు వెచ్చిస్తున్నారు. అయితే అలా ఆసక్తితో వస్తున్న టూరిస్ట్ లకు కనీస సమాచారం, సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేయడం అంత కష్టమా? వారి పట్ల కొంత గౌరవం చూపించలేమా? ప్రయాణ అనుభవాన్ని అందంగా, ఆహ్లాదంగా, జ్ఞాపకంగా, నేర్చుకునేందుకు ఒక అవకాశంగా మార్చలేమా? చిన్న చిన్న ప్రయత్నాలైనా మొదలుపెట్టలేమా?

  • టూరిస్ట్ ప్రాంతాలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం, టూరిస్ట్ లు  అధికంగా వచ్చే నగరాలలో కూడా అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన టూరిస్ట్ లకు ఎంత వెసులుబాటు ఉంటుంది? 
  • డైరెక్షన్ లు చూపిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం ఉపయోగకరం కాదా? 
  • మైళ్ళకు మైళ్ళు ఉన్న కారిడార్ లలో చెప్పులు లేకుండా తిరిగే అవసరం లేకుండా చూడలేమా? ఒకవేళ తీయవలసిన అవసరం ఉన్న సందర్భాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమా? 
  • అన్ని ప్రదేశాలలోనూ ఒకే సెలవుదినాలు ఉండేలా చూడలేమా? నా ఈ అనుభవం తర్వాత నేను కొంచెం గూగుల్ లో పరిశోధన జరిపిన తర్వాత తెలుసుకున్నదేమంటే ఢిల్లీ జూ కు శుక్రవారం సెలవుదినం. హైదరాబాద్ జూ కు సోమవారం. మైసూర్ జూ, చెన్నై జూ లకు మంగళవారం, ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం కు సోమవారం, ముంబై లోని డాక్టర్ భావు దాజి లాడ్ మ్యూజియం కు బుధవారం, ఢిల్లీ లోని మోడరన్ ఆర్ట్ గ్యాలరీ కు సోమవారం, సైన్స్ సెంటర్ కు శని, ఆదివారాలు. ఇన్ని రకాల సెలవు దినాలు ఎందుకు. అన్ని చోట్లా ఒకటే పాటించవచ్చు కదా. కనీసం ఒక నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నిటికీ ఒకటే షెడ్యూల్ ఉండవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్యాటకులు ఏదైనా ఒకరోజు ఒక నగరంలో గడిపితే కొన్ని ప్రదేశాలు చూడగలుగుతారు, కొన్ని చూడలేరు. 

మనది నిజంగా అత్యద్భుతమైన దేశం. కొద్దిపాటి శ్రద్ద, చిత్తశుద్ధి ఉంటే దీనిని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.

–Based on a piece by Meena

టూరిజం కు హైటెక్ అడ్డంకులు: Tourist Troubles

కోవిద్ వలన చాలాకాలం ఇంటికే పరిమితమయ్యాక కొంచెం ఉధృతి తగ్గాక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము. బెంగుళూరు కు దగ్గరగా ఉండి ఒక్క రోజులో వెళ్ళిరాగలిగే ప్రదేశాల కోసం చూసాం. 

బెంగుళూరు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో హోయసల శైలిలో నిర్మించబడిన గుడి ఉన్న సోమనాథపురం గురించి తెలిసింది. క్రీస్తుశకం 1268 లో అప్పటి హొయసల సేనాధిపతి సోమనాథుడిచే నిర్మించినబడిన చెన్నకేశవుని ఆలయం ఇది. వెంటనే కొద్దిమంది మిత్రులతో కలిసి అక్కడికి బయలుదేరాం.

ఇసుకరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం అది. హొయసల వాస్తుశిల్ప నైపుణ్యాలకు అడ్డం పడుతుంది. 

చెన్నకేశవ అంటే “అందమైన కేశవుడు” అని అర్ధం. ఈ గుడి విష్ణువు యొక్క మూడు అవతారాలైన కేశవ, జనార్ధన, వేణుగోపాలులకి అంకితం చేయబడింది. ప్రధానఆలయం నక్షత్రాకారంలో ఉన్న మండపంపై నిర్మించబడగా ఈ ఒక్కో అవతారానికి ఒక్కో గర్భగుడి నిర్మించబడింది. దీనితో పాటు 64 చిన్న చిన్న మందిరాలు ప్రాంగణమంతా నిండి ఉన్నాయి. ప్రధానాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం నిండా రామాయణ, మహాభారత, భాగవత పురాణాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ పైకప్పులు కూడా ఎంతో అందమైన శిల్పాలతో తామరపువ్వు ఆకారంలో రూపొందించబడింది.  

ఈ ఆలయం నిర్మించడానికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని చెబుతారు. అయితే విదేశీయుల దురాక్రమణ ఫలితంగా నిర్మాణం పూర్తయిన ఈ ఆలయంలోకేవలం 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే పూజలు జరిగాయి. ఆలయం, లోపలి విగ్రహాలు దెబ్బతినడంతో సంప్రదాయం ప్రకారం పూజలు నిలిపివేశారు. 

పూజా పునస్కారాలు నోచుకోని ఆలయమైనా దాదాపు ఏడువందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతో దృఢంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ ఆలయ భారతా పురావస్తు పరిశోధక సంస్థ అధీనంలో ఉండడంతో శుభ్రంగా, పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంది. టాయిలెట్లు కూడా పరిశుభ్రంగానే ఉన్నాయి.

మేము అక్కడకి చేరుకోగానే ప్రవేశ రుసుము వసూలు చేసే కౌంటర్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. దానికి బదులుగా టికెట్ ఇరవై రూపాయలనీ, అక్కడ ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేసి, రుసుము ఆన్లైన్ చెల్లించాలనీ సూచిస్తూ ఫ్లెక్సీ బోర్డులు ఉన్నాయి. అక్కడ దాదాపు ఆరు యాత్రికుల బృందాలు ఉన్నాయి. ఏ ఒక్కరికీ ఆ కోడ్ స్కాన్ కాలేదు. మేము ఆ స్కాన్ తో అలా కుస్తీ పడుతుండగానే ఒక పది నిముషాల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అది పని చేయడం లేదని పురావస్తు శాఖ వారి వెబ్సైటు లో లాగిన్ అయ్యి ప్రవేశరుసుము చెల్లించాలని చెప్పాడు. మేము ఎంతో శ్రద్ధగా ఆ పని మొదలుపెట్టాం. అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేదు. ఆ సైట్ కూడా ఎంతో నెమ్మదిగా లోడ్ అవుతుంది. ఎలాగూ నా స్నేహితులు ఒకరు లాగిన్ అయ్యారు. బృందంలోని ప్రతి ఒక్కరి పేరూ ఒక్కడా రాయాలి.ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వారి ఆధార్ లేదా పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అవన్నీ చేసి నా స్నేహితురాలు రుసుము చెల్లించడానికి ఎంటర్ నొక్కగానే ఇక అది ఒక లూప్ లో తిరుగుతూనే ఉంది తప్ప ఇంతకీ పేమెంట్ పూర్తి కాలేదు. మేము చుట్టూ చూస్తే మిగిలిన యాత్రికుల బృందాలది కూడా అదే పరిస్థితి. డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వగలరా అని అక్కడ గార్డ్ ను అడిగితే అందుకు వీలులేదు అని స్పష్టంగా చెప్పారు. అప్పటికి ఏదో ఒక బృందంలో ఒకరు ఆన్లైన్లో టిక్కెట్లు కొనుక్కోగలిగారు. మేము డబ్బులు చెల్లిస్తాము మాకు కూడా టిక్కెట్లు బుక్ చేయండని అతనిని బ్రతిమిలాడాము. ఆయన పాపం ఎంతో మందికి అలా చేసి ఇచ్చారు.

ఇదంతా దాదాపు ఇరవై నిముషాలు పట్టింది. ఎంతో విసుగు తెప్పించింది. 

ఇక లోపలి వెళ్లి ఆ అద్భుతమైన కట్టడాన్ని చూడగానే ఆ విసుగు అంతా దూరమయ్యింది అనుకోండి. 

అయితే నేను చెప్పదలుచుకున్న విషయమేమంటే ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించాలనుకునే వారందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిందేనా? డిజిటల్ లిటరసీ పక్కన పెట్టండి ఇంకా సంపూర్ణ అక్షరాస్యతే సాధించలేని దేశంలో ఇది అటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అవరోధం కాదా? చాలా మంది వృద్ధులకు ఈ స్కాన్ చేసి డబ్బు చెల్లించే పద్ధతి తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ఇది ఒకరకంగా వారి పట్ల వివిక్ష చూపించడం కదా? సైట్ దగ్గర వైఫై పనిచేయకపోతే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు వెనక్కి వెళ్లాల్సి రావడం ఎంత అన్యాయం? అంతేకాకుండా టికెట్ కొనుక్కునేందుకు ప్రతి ఒక్కరి పేరు రాయవలసిన అవసరం ఏమిటి? కొనేవారి ఆధార్ నెంబర్/ పాన్ కార్డు నెంబర్ ల అవసరం ఏమిటి? ఆ సమాచారం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పౌరుల జీవితాలను సులభతరం చేయడం. ఇక్కడి పద్ధతి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకవేళ సాంకేతికతను మరింతగా ముందుకు తీసుకువెళ్లడమే దీని ఉద్దేశమైతే డిజిటల్ పేమెంట్ చేసేవారికి ఒకరకమైన రుసుము (ఇరవై రూపాయలు) , నేరుగా కొనుక్కునేవారికి ఒకరకంగా రుసుము (ఇరవై ఐదు రూపాయలు) నిర్ణయించవచ్చు. ఆ విధంగా డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయొచ్చు. అంతేకానీ అసలు నేరుగా కొనుక్కునే అవకాశం లేకుండా చేయడం వలన డిజిటల్ పేమెంట్ చేయలేని వారికి ప్రవేశం కఠినతరం చేయడం కాదా. ఒకరకంగా ఇది వారి హక్కులకు భంగం కలిగించడం కాదా? అంతేకాకుండా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరించడం కూడా ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు. 

ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేయాల్సి రావడం ఎంతవరకు సమంజసం?

Blog post 45

–Based on a post by Meena

అదా లవ్ లేస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో మార్గదర్శి: Ada Lovelace

నేను చదివే వార్తా పత్రికలో ప్రతి బుధవారం టెక్నాలజీ కి సంబంధించిన వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. అందులో టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన యువత గురించి, ముఖ్యంగా యువతుల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా నాకు అదా లవ్ లేస్ గుర్తువస్తూ ఉంటుంది. ఈ రోజు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో 19 వ శతాబ్దపు తొలినాళ్లలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ లో తనదైన ముద్ర వేసింది లవ్ లేస్.

ఈ రోజు మనందరం విరివిగా ఉపయోగిస్తున్న కంప్యూటింగ్ సైన్స్ కు పునాది వేసింది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అనీ, అందునా ఒక స్త్రీ అనీ ఎంతమందికి తెలుసు? అదా లవ్ లేస్ కంప్యూటర్ ల గురించి, భవిష్యత్తు ప్రపంచంలో వాటి ప్రాముఖ్యతను గురించీ ఎన్నో ఏళ్ళ క్రితమే అంచనా వేసిన దార్శనికురాలు. అదా లవ్ లేస్ అని పిలవబడే అగస్టా అదా బైరన్ 1815 డిసెంబర్ 10 న లండన్ లో జన్మించింది. అద్భుతమైన కవిగా మనందరికీ తెలిసిన జార్జ్ గోర్డాన్ అలియాస్ లార్డ్ బైరన్, ప్రముఖ గణితవేత్త అన్నబెల్లా మిల్బంకే ల కూతురే అదా.

గొప్ప కవే అయినా పిచ్చివాడిగా పేరు తెచ్చుకున్న బైరన్ కూ గణిత మేధావి అయిన అతని భార్యకూ మధ్య వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. అదా పుట్టిన నెలరోజులకు అన్నబెల్లా లండన్ లోని బైరన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తన కూతురి మీద అతని ప్రభావం పడకూడదని, అతని కవిత్వ వారసత్వం, అతని పిచ్చి లక్షణాలు ఆ అమ్మాయికి కూడా అంటకూడదనీ, ఈ ఊహాత్మక కళాజీవనానికి భిన్నంగా ఆ అమ్మాయి గణితం, సంగీతం, సైన్స్ లలో రాణించాలని ఆ తల్లి కోరిక.

అదా తండ్రి బైరన్ కూడా ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉండగానే లండన్ వదిలి వెళ్ళిపోయాడు. అదాకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా గ్రీస్ లో ఆయన చనిపోయాడు. అదా కు ఆయనతో పరిచయమే లేదు. తన అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. ప్రైవేట్ టీచర్లు తనకు వ్యక్తిగతంగా చదువు చెప్పేవారు. చిన్నతనం నుండీ ఆ అమ్మాయి అనారోగ్యాలతో బాధపడేది. దానితో ఇంటిలోనే చదువు కొనసాగింది.

అదా కు చిన్నప్పటి నుండే యంత్రాలంటే ఆసక్తి. సైన్స్ పత్రికలు విపరీతంగా చదివేది. అయితే తన తండ్రికి ఉన్నట్లు ఊహాశక్తి కూడా ఎక్కువే. తన 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఎగరాలి అనే కోరిక కలిగింది. అది కలగా మిగిలిపోలేదు. చాలా పద్ధతిగా పక్షులు, వాటి రెక్కల మీద పరిశోధనలు చేసి రకరకాల పదార్ధాలతో రెక్కలను తయారు చేసేది. తాను చేసిన పరిశోధనకు ‘ఫ్లయాలజీ’ అని పేరు పెట్టింది. ఈ పరిశోధనంతటికి గానూ తన తల్లి నుండి ఎన్నో చివాట్లు కూడా తింది.

1833 లో లండన్ లో జరిగిన ఒక పార్టీ లో ఆమెను ప్రముఖ గణిత మేధావి చార్లెస్ బాబేజ్ కు ఎవరో పరిచయం చేశారు. బాబేజ్ తాను కొత్తగా సృష్టించిన పరికరాన్ని గురించి ఆమెకు వివరించారు. దానిలో అంకెలు వేసి ఉన్న చక్రాన్ని ఒక హేండిల్ సహాయంతో ఖచ్చితమైన లెక్కలు చేయవచ్చు. దీనిని ఆయన ‘డిఫరెన్స్ మెషిన్” అని పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ పరికరాన్ని స్వయంగా చూసేందుకు గానూ అదా తల్లి ఆ అమ్మాయిని బాబేజ్ ఇంటికి తీసుకుని వెళ్ళింది. అయితే అది అసంపూర్తిగా ఉన్నట్లు అదా గ్రహించింది. దానిని ఇంకా ఎలా మెరుగ్గా చేయవచ్చో సూచిస్తూ బాబేజ్ తో అనేక చర్చలు జరిపింది. అలా మొదలైన వారిద్దరి స్నేహం జీవితాంతం కొనసాగింది. బాబేజ్ కు అప్పటికే నలభై సంవత్సరాలు. భార్యను కోల్పోయారు. అదా ఉత్సాహవంతమైన యువతి. ఆ అమ్మాయిలోని ప్రతిభను గుర్తించిన బాబేజ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు.

తన 19 ఏళ్ళ వయసులో అదా ధనిక కుటుంబానికి చెందిన విలియం కింగ్ ను వివాహమాడింది. వారికి ముగ్గురు పిల్లలు. 1838 లో అదా అతని లవ్ లేస్ కుటుంబ వారసురాలిగా లేడీ అదా కింగ్ గా హోదా పొందింది. అప్పటి నుండి ఆమెను అదా లవ్ లేస్ అని పిలిచేవారు.

ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు అదా తన గణిత పరిశోధనలపైన కూడా ద్రుష్టి పెట్టింది. మరొక మహిళా గణిత మేధావి మేరీ తో ఆమెకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అనేక గణిత విషయాలతో పాటు చార్లెస్ బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ మెషిన్ గురించి కూడా చర్చించుకునేవారు. 1841 లో లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ అయినా ఆగస్టస్ డెమోర్గన్ ఆమెకు ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే మేరీ తో కలిసి అడ్వాన్సుడ్ మాథెమాటిక్స్ నేర్చుకుంటూనే ఉండేది. డిఫరెన్స్ మెషిన్ ఎప్పుడూ ఆమె ఆలోచనలలోనే ఉండేది.

ఆ సమయంలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అదా దానిలో కీలక పాత్ర పోషించింది. ఆ ఇంజిన్ కు సంబంధించి అదా ఒక పేపర్ కూడా రాసింది. అందులో దాని పనితీరును సోదాహరణంగా క్లుప్తంగా వివరించింది. మెషిన్ కోడ్ ద్వారా బాబేజ్ తయారు చేసిన యంత్రం ఎలా ఒక వరుసలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుందో ఆమె అందులో వివరించింది. ఈ పేపర్ లోనే ప్రపంచంలోనే తొలిసారిగా అల్గోరిథం లేదా కంప్యూటర్ ప్రోగ్రాం ను ఆమె పరిచయం చేసింది. ఆ విధంగా చూస్తే ఆమె తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకోవచ్చు.

కంప్యూటింగ్ లో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేసి అదా లవ్ లేస్ నూతన శకానికి తెరతీసింది. అనలిటికల్ ఇంజిన్ కేవలం అంకెలు, లెక్కలకు సంబంధించినది కాదు అని తాను గుర్తించింది. అది కేవలం కాలిక్యులేటర్ కాదు అని గణితానికి మించి ఎన్నో విషయాలలో మనిషికి తోడ్పడగలదని గుర్తించింది. ఉదాహరణకు మ్యూజిక్ కంపోసింగ్ లో కూడా అది సహాయపడగలదు.

1852 లో తన 36 ఏళ్ళ వయసులో అదా మరణించింది. ఆ తర్వాత వందేళ్లకు గానీ ఆమె అనలిటికల్ ఇంజిన్ పై రాసిన నోట్స్ బయటపడలేదు. 1940 లో ఆధునిక కంప్యూటర్లపై అలాన్ టూరింగ్ చేసిన కృషికి స్ఫూర్తి లవ్ లేస్ రాసిన నోట్స్ అంటే ఆమె ఎంత దార్శనికురాలో అర్ధం అవుతుంది. 1979 లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు కొత్తగా రూపొందించిన కంప్యూటర్ లాంగ్వేజ్ కు అదా గౌరవార్ధం ఆమె పేరునే పెట్టారు.

సైన్స్, టెక్నాలజీ రంగాలలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికీ అమ్మాయిలు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో అదా వంటి తొలితరం శాస్త్రవేత్తలను గుర్తు చేసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

Post 44

–Based on a piece by Mamata

పట్టణాలలో ఒయాసిస్సుల లాంటి కంటోన్మెంట్లు: Cantonments

ఈ మధ్య 2017 లో ప్రచురించబడిన ‘కంటోన్మెంట్లు: ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ హెరిటేజ్ టు మోడర్నిటీ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని చూసాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల భూమికి సంబంధించిన వివరాలు, వాటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. 

Coffee table book on Indian Cantonments
A Coffee table book on Indian Cantonments

ఫ్రెంచ్ పదం అయిన కాంటన్ నుండి ఈ కంటోన్మెంట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏవైనా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలోనో, శీతాకాలం లోనో సైనిక దళాలు నివసించేందుకు తాత్కాలికంగా విడిది ఏర్పాట్లు చేసిన ప్రాంతాలనే తొలుతగా కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అయితే దేశాల మధ్య దాడులు జరిగి ఒక దేశం మరొక దేశాన్ని పాలించే సందర్భంలో తమ సైన్యం కోసం శాశ్వతంగా కొన్ని ఆవాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకునేవారు. భారతదేశంతో సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో వీటిని కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అమెరికాలో కూడా కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరాలు అనే అర్థంలోనే వాడతారు. దాదాపు 250 ఏళ్ళ క్రితం దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలంలో బారాకపూర్ ప్రాంతంలో దేశంలో తొలి కంటోన్మెంట్ (బీహార్ లోని దానాపూర్ దగ్గర ఉన్నదీ తొలి కంటోన్మెంట్ అని కొందరు అంటారు) ఏర్పాటు అయింది. 18 వ శతాబ్దం నాటికి వాటి సంఖ్య బాగా పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వారి పరిమాణం, వాటిలో నివసించే జనాభా ఆధారంగా వీటిని మొత్తం నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఈ అన్ని కంటోన్మెంట్లు కలిపి రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. మిలిటరీ స్టేషన్ లలో కేవలం సాయుధ మిలిటరీ దళాలు మాత్రమే నివసిస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలలో మిలిటరీ దళాలు, సాధారణ పౌరులు కలిసి నివసిస్తుంటారు. కంటోన్మెంట్లు అన్నీ 2006 కంటోన్మెంట్ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో పాటు నామినేట్ చేయబడిన ప్రతినిధులు కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారిక బాడీ లో సభ్యులుగా ఉంటారు.

నేను చూసిన పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఎన్ని వైవిధ్యమైన ప్రాంతాలలో మన కంటోన్మెంట్లు ఏర్పడ్డాయో ఈ పుస్తకం చూసి అర్ధం చేసుకోవచ్చు.

కంటోన్మెంట్ల గురించి ఇంతకు ముందు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఉదాహరణకు, కుంభ మేళా జరిగే సంగమ ప్రాంతం అలహాబాద్ లోని ఫోర్ట్ కంటోన్మెంట్ కు చెందిన ప్రాంతం. కుంభమేళాల సమయంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత నిర్వహణా బాధ్యతను తన పరిధిలోకి తీసుకుంటుంది. తాజ్ మహల్ ను చూసేందుకు మనమందరం వెళ్లే ఆగ్రా ఫోర్ట్ కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది. అలహాబాద్ కంటోన్మెంట్ లో శాసనాలతో కూడిన అశోకుని స్థూపం ఉంది. ఈ స్థూపానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిపైనా అశోకుని శాసనాలతో పాటు నాలుగవ శతాబ్దానికి చెందిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుని శాసనాలు కూడా ఉన్నాయి. అహ్మద్ నగర్లో, బెల్గాంలో, కన్ననోరే లో ఉన్న కోటలు అన్నీ కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలోనే ఉన్నాయి.  

మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహౌ కంటోన్మెంట్ ప్రాంతంలోనే జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మలోజి సక్పాల్ బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ ను డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్నారు. ఈ కంటోన్మెంట్ లో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం కూడా ఉంది. పాలరాతితో చేసిన ఈ భవనంలో ఈ అసమాన నాయకుని జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శన జరుగుతుంది.

గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కూడా అల్మోరా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంతో సమయం గడిపారనీ, తన గీతాంజలి తో సహా ఎన్నో రచనలను ఇక్కడ నివసిస్తున్నప్పుడే రచించారని అంటారు. ఆయన నివసించిన భవనాన్ని ఇప్పుడు టాగోర్ హౌస్ అని పిలుస్తున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాలలో కొన్ని అద్భుతమైన భవనాలు కూడా ఉన్నాయి. హుగ్లీ ఒడ్డున 1828 లో నిర్మించిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ భవనం ఇప్పుడు బెంగాల్ గవర్నర్ కు బారక్పూర్ విడిదిగా ఉంది. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది.

మద్రాస్ వార్ సిమెట్రీ, కిర్కీ వార్ సెమెట్రీ, ఢిల్లీ వార్ సిమెట్రీ వంటి అనేక యుద్ధ స్మారకాలు కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక కంటోన్మెంట్లలో ఉన్న చర్చీలు, గుడులు, మసీదుల సంఖ్య లెక్కకట్టలేము.

షిల్లాంగ్, రాణిఖేత్ ప్రాంతాలలోని కంటోన్మెంట్ లు జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా అలరారుతున్నాయి. దానాపూర్ కంటోన్మెంట్ లో ప్రత్యేక రుతువులలో ఎన్నో వలస పక్షులు విడిది చేస్తుంటాయి.

మనం అందరం దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కంటోన్మెంట్ ప్రాంతం గుండా ప్రయాణించడమో, అక్కడ నివసించడమో, సందర్శించడమో చేసే ఉంటాము. ఎంతో శుభ్రంగా, పద్ధతిగా నిర్వహించబడే ఈ ప్రాంతాలు కాలుష్యంతో నిండిన పట్టణ ప్రాంతంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తాయి. అయితే వీటి నిర్వహణలో సమస్యలు లేకపోలేదు, ఎన్నో విమర్శలూ లేకపోలేదు. అవి వలసవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఒక ముఖ్యమైన విమర్శ కాగా కంటోన్మెంట్ ప్రాంతాల రోడ్లను సాధారణ ప్రజానీకం వినియోగించుకోలేకపోవడం మరొక సమస్య. ఈ కంటోన్మెంట్ లలో నివసించే సాధారణ ప్రజానీకానికి ఇంటి రుణాలు తీసుకునేందుకు, ప్రభుత్వ హౌసింగ్ పధకాలను వినియోగించుకునేందుకు వెసులుబాటు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉంది.

డిఫెన్స్ శాఖ నియంత్రణలో ఉన్న భూముల నిర్వహణా వ్యయాల మీద తరచుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆర్మీ కూడా ఒక సందర్భంలో ఈ ప్రాంతాల నిర్వహణకు ఇంత ఖర్చు చేయడం గురించి పునరాలోచించిన దాఖలాలు ఉన్నాయి. 2021 లో ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఈ కంటోన్మెంట్ ప్రాంతాల రద్దు మీద ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన కూడా వెలువడింది. 

వీటిని బట్టి చూస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలు భవిష్యత్తులో అంతర్ధానమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని రద్దు చేయడం కాకుండా వీటి నిర్వహణా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి, వాటిలో నివసించే అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా నిర్వహణ చేసినట్లయితే పట్టణ ఆవాసాల నిర్వహణ కు సంబంధించి కంటోన్మెంట్ లు ఆదర్శంగా నిలుస్తాయి అని నాకు అనిపిస్తుంది.

Post 41

Based on a piece by Meena

వేయి పూలు వికసించనీ: Millefiori

నా చిన్న వయసులో నాన్నతో కలిసి అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుండేదానిని. అక్కడ నాకు అద్భుతంగా తోచిన అనేక విషయాలలో అక్కడ పని చేసేవారందరి టేబుల్స్ పైన ఉండే పేపర్ వెయిట్ ఒకటి. ఫ్యాన్ గాలికి పేపర్లు ఎగిరిపోకుండా వాటిపైన ఈ పేపర్ వెయిట్ లు పెట్టేవారు. 

ప్రతిఒక్కటీ ఒక విభిన్నమైన డిజైన్ లో, విభిన్నమైన రంగులలో ఎంతో అందంగా ఉండేది. ఇంత అందమైన ఆకృతులు ఆ గ్లాస్ డోమ్ లోపలికి ఎలా వెళ్లాయా అని నాకు ఆశ్చర్యంగా ఉండేది.

ఈ మధ్య నా టేబుల్ సొరుగులో దేనికోసమో వెతుకుతుంటే ఒక పాత పేపర్ వెయిట్ బయటపడింది. చిన్నతనంలో నాకు ఆశ్చర్యాన్ని, ప్రశ్నలను మిగిల్చిన ఆ పేపర్ వెయిట్ ల గురించి చదువుదాం అనుకున్నాను.

Millefiori paperweight
Millefiori paperweight

పేపర్ వెయిట్ ల లోపల అందమైన పూల కళాకృతులను చెక్కే ఈ ప్రక్రియను ‘మిల్లెఫీరి’ అంటారట. ఇటాలియన్ భాషలో వేయి పూలు అని దీని అర్ధం. పురాతన ఈజిప్ట్ లో ఈ ప్రక్రియ పుట్టిందనీ, బహుశా ప్రాచీన రోమన్ కాలం నుండి వీటిని తయారు చేస్తున్నారని తెలుస్తుంది. దాదాపు 5 వ శతాబ్దం నాటి నమూనాలు కూడా ఇంకా లభ్యమవుతున్నాయి. అయితే ఈ నైపుణ్యం మధ్యలో కొంతకాలం మరుగునపడి 19వ శతాబ్దం లో మురానో గ్లాస్ ఆర్టిస్ట్ ల కృషి వలన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వింసెంజో మోరెట్టి అనే కళాకారుడు ఎన్నో ఏళ్ళ పాటు శ్రమించి ఈ కలలో అత్యద్భుతమైన నైపుణ్యం సాధించాడు. ‘మిల్లెఫీరి’ పదం తొలిసారిగా 1849 లో ఆక్సఫర్డ్ డిక్షనరీ లో చోటు సంపాదించుకుంది.

కరగబెట్టిన రంగు రంగుల గాజు ముక్కలను పొరలు పొరలుగా వేసి ఒక స్థూపాకార ఆకృతిలోకి దానిని మలుచుతారు. తర్వాత ఇద్దరు కళాకారులు దానిని చెరోవైపు పట్టుకుని లాగుతూ ఒకరి నుండి ఒకరు దూరంగా వెళ్తూ ఉంటే అది ఒక పొడవైన రాడ్ లాగా తయారు అవుతుంది. ఆ రాడ్ ను రకరకాల ఆకృతులలో ముక్కలుగా కత్తిరిస్తారు. ప్రతి ముక్కను ఒక మురైన్ అంటారు. అలాంటి ఎన్నో మురైన్ లను ఒక నిర్దిష్ట డిజైన్లోకి మలిచి గాజు డోమ్ లో అమరుస్తారు. దానితో పేపర్ వెయిట్ లు, ఫ్లవర్ వేజ్ లు, ఉంగరాలు, లాకెట్ లు, డెకొరేటివ్ వస్తువులు ఎన్నో తయారు చేయవచ్చు.

ఈ కళ కేవలం కంటికి ఇంపైన ఆకృతులకు సంబంధించింది మాత్రమే కాదు. సున్నితమైన గాజుతో అత్యంత ఖచ్చితత్వం తో తయారు చేయాల్సిన అరుదైన, ఉన్నతస్థాయి నైపుణ్యం. పేపర్ వెయిట్ లలో ఎక్కువగా పువ్వుల ఆకృతులే కనిపించినప్పటికీ జామెట్రికల్ ఆకారాలు, పురుగుల ఆకృతులతో తయారు చేసిన పేపర్ వెయిట్ లు కూడా మార్కెట్ లో దొరుకుతాయి. 

ఇప్పుడు ఈ పేపర్ వెయిట్ లు అంత ఎక్కువగా వాడటం లేదు. కానీ ఆసక్తి ఉన్నవారి సేకరణల జాబితాలో చేరిపోయాయి. క్రిస్టీ లాంటి వ్యక్తులు కొన్ని అరుదైన పేపర్ వెయిట్ లను వేలం వేయడం కూడా చూస్తున్నాం. 

నా టేబుల్ సొరుగులో దొరికిన పేపర్ వెయిట్ అడుగున కొంచెం విరిగింది. అయినా రోజూ వాడటానికి బాగానే ఉపయోగపడుతుంది. దానిని అలా రోజూ టేబుల్ పైన చూడటం కొన్ని జ్ఞాపకాలను, సంతోషాన్ని అందిస్తుంది. 

Post 38

Based on a piece by Meena

ఆచరణకు పిలుపునిస్తున్న నినాదాలు: Mottos for Life

మనం ఎన్నో నినాదాలు చూస్తుంటాం. వింటుంటాం. అనేక సంస్థలు, దేశాలు, ఉద్యమాలు తమవైన నినాదాలు రూపొందించుకుంటాయి. అవి ఆయా సంస్థల, ఉద్యమాల లక్ష్యాన్ని, వారు సాధించాలన్న ఉద్దేశాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. అనేక కంపెనీలు కూడా తమవైన నినాదాలు రూపొందించుకుని ఉంటాయి. వాటి లోగోలలాగే ఈ నినాదాలను కూడా గర్వంగా తమ కంపెనీ పేరుతో పాటు ప్రదర్శించడం పరిపాటే.

Satyameva jayate
Satyameva jayate

సత్యమేవ జయతే (సత్యం మాత్రమే గెలుస్తుంది) అనేది మన దేశం యొక్క నినాదం. మనదేశంలోని వివిధ విభాగాలకు కూడా తమవైన నినాదాలు ఉన్నాయి: యతో ధర్మస్తతో జయః (ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది) అనేది మన సుప్రీం కోర్ట్ నినాదం, The safety, honour and welfare of your country అనేది మన దేశ ఆర్మీ నినాదం. నాభా స్పర్శం దీప్తం (Touch the sky with glory) అనేది మన ఎయిర్ ఫోర్స్ నినాదం కాగా, షామ్నో వరుణః (May the Lord of Water be auspicious unto us) అనేది మన నేవీ యొక్క నినాదం.

ఇతర దేశాలకు కూడా కొన్ని ఆసక్తికరమైన నినాదాలు ఉన్నాయి. 

Truth prevails: మన సత్యమేవ జయతే కు సమానార్థకంగా ఉండే ఈ నినాదం చెక్ రిపబ్లిక్ దేశానిది. 

Janani Janmabhumishcha Swargadapi Gariyasi: మన లాగే ఈ నేపాల్ దేశపు నినాదం కూడా సంస్కృత గ్రంధాల నుండి తీసుకున్నదే 

Rain: బోత్స్వానా దేశపు ఈ ఒకే ఒక్క పదంతో కూడిన నినాదం వ్యవసాయాధారిత దేశంలో వర్షం యొక్క ప్రాముఖ్యతని సూచిస్తూ ఆ వర్షానికి గౌరవాన్ని ఇస్తూ నినాదంగా స్వీకరించబడింది 

Liberté, égalité, fraternité: ఫ్రెంచ్ విప్లవపు ఈ నినాదమే ఇప్పుడు ఫ్రాన్స్, హైతీ దేశాలకు నినాదంగా ఉంది 

In God we trust: 1956 లో ఇది అమెరికా యొక్క అధికారిక నినాదంగా స్వీకరించబడింది. దీనికి ముందు ‘E pluribus unum’ అనేది అమెరికా నినాదం గా ఉండేది. ‘Out of many, one’ అనేది దీని అర్ధం. 

యునైటెడ్ కింగ్డమ్, చైనా, బంగ్లాదేశ్, డెన్మార్క్ వంటి దేశాలకు ఎటువంటి అధికారిక నినాదమూ లేదు. 

వ్యాపార సంస్థలకు కూడా తమవైన నినాదాలు ఉన్నాయి. కొన్ని ఎంతో లోతైన విస్తృతమైన అర్ధాన్ని కలిగి ఉంటే మరికొన్ని వారు సాధించాలన్న లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. 

టాటా సంస్థలు: Leadership with Trust.

విప్రో: Applying thought

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: Experience certainty.

రిలయన్స్ ఇండస్ట్రీస్: Growth is Life.

కొన్ని స్వచ్చంద సంస్థలు కూడా తమ లక్ష్యాన్ని సూచించే నినాదాలను రూపొందించుకున్నాయి. 

ప్రథం: Every child in school and learning well.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ: I Serve

బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్: Touching People, Changing Lives

అడయార్ కాన్సర్ ఇన్స్టిట్యూట్: With Humanity and In Wisdom

ఇక మన దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల నినాదాలు కూడా ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉన్నాయి. 

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్: జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తే (జ్ఞానమే విముక్తుల్ని చేస్తుంది)

ఐఐఎం-అహ్మదాబాద్: విద్య వినయగోద్వికాశ్ (జ్ఞానాన్ని పంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యం)

ఐఐటి-బెంగుళూరు: జ్ఞానం మర్మం ధ్యాతమ్ (జ్ఞానమే అంతిమ లక్ష్యం) 

ఢిల్లీ యూనివర్సిటీ: నిష్ఠ ద్రితిహా సత్యం (అంకితభావం, దృఢత్వం, సత్యం)

అన్నా యూనివర్సిటీ: Progress through knowledge.

బిట్స్ పిలానీ: జ్ఞానం పరమం బలం (జ్ఞానమే శక్తి)

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్: Re-imaging Futures.

ఏ దేశం యొక్క, ఏ సంస్థ యొక్క నినాదాన్ని చూసిన ఎంతో గొప్పగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అయితే ఆ దేశపు మనుషులు, ఆ సంస్థ యొక్క సిబ్బంది ఎంతవరకు ఆ నినాదాన్ని గుర్తు ఉంచుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు అని ఆలోచిస్తే నాకు విచారం కలుగుతుంది. బహుశా ప్రతి సంస్థ తమ నినాదాన్ని ఉద్యోగులలోకి తీసుకువెళ్లేందుకు, దానిపై అవలోకనం చేసేందుకు, దానిని తమ రోజువారీ కార్యక్రమాలను నిర్దేశించే గైడ్ గా ఉండేలా మలుచుకునేందుకు ఏడాదిలో కొంత సమయాన్ని వెచ్చించాలేమో. అప్పుడే ఆ నినాదం అందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారిలో స్ఫూర్తి నింపి వారికి మార్గదర్శకత్వం చేయగలదు. అప్పుడప్పుడు తమ నినాదాలను గుర్తుచేసుకుని వాటి నుండి స్ఫూర్తి పొందే ప్రయత్నాలు చేయకపోతే అవి కేవలం తమ ఆకాంక్షల యొక్క అవాస్తవ ప్రకటనలుగా కాగితాలపై మాత్రమే నిలిచిపోయే ప్రమాదం ఉంది.

Post 37

–Based on a piece by Meena

ఒక జర్మన్ పట్టణం పేరు తమిళ పదంగా ఎలా మారింది? Emden

తమిళంలో “ఎందేన్” అనే ఒక పదం ఉంది. గయ్యాళి అని అర్ధం వస్తుంది. నిజానికి గయ్యాళి అనేది సరైన అర్ధం కాదేమో, తెలివైన,చురుకైన, దూకుడుగా ఉండే స్త్రీ అనవచ్చు. ఈ పదం వెనుక ఉన్న కథేమిటో ఒకసారి చూద్దాం.

స్త్రీలకే కాకుండా ఏ పనినైనా సాధించగలిగే, తమ పనులలో ఇతరుల జోక్యాన్ని, వ్యతిరేకతను సహించని వ్యక్తులకు కూడా ఈ పదాన్నివాడతారు. 

ఆ పదాన్ని పలికే విధానాన్ని బట్టి దానికి రకరకాల అర్ధాలు ఉన్నాయి. ఎవరైనా పెద్దావిడ తనకి ఇష్టమైన మేనకోడలు గురించి చెబుతూ ప్రేమగా ఈ పదం వాడింది అనుకోండి, ఆ అమ్మాయిని ఎవరూ మోసం చేయలేనంత తెలివైనది అని మురిపెంగా అన్నట్లు. అదే తనకు అంతగా ఇష్టం లేని పక్కింటామె కూతురి గురించి కొంత చిరాకుగా అన్నది అనుకోండి, ఆ అమ్మాయి సరైన ప్రవర్తన కలిగినది కాదు అని అన్నట్లు. అదే తనకు అసలు ఇష్టం లేని తన వదిన గురించి కోపంగా ఈ పదాన్ని వాడింది అనుకోండి, ఆమె చాలా కోపిష్టి, ఎవరితోనూ కలవని మనిషి, తమ కుటుంబానికి తగిన మనిషి కాదు అన్నట్లు అర్ధం.

నా చిన్నతనంలో నేను ఇది తమిళపదమే అనుకుని మా సంభాషణలలో ఎక్కువగా ఉపయోగించేదాన్ని. పెరిగి పెద్దయ్యాకనే ఈ పదం యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసాయి. దీని మూలం తెలుసుకున్నాక ఆశ్చర్యం కలిగింది.

emden

మొదటి ప్రపంచ యుద్ధం తొలినాళ్లలో 1914 సెప్టెంబర్ 22 రాత్రి ఎందేన్ అని పిలవబడే జర్మన్ యుద్ధనౌక మద్రాస్ ఓడరేవు కు వచ్చింది. బర్మా ఆయిల్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీకి చెందిన అనేక ఆయిల్ ట్యాంకర్లు ఆ రేవులో నిలబడి ఉన్నాయి. ఎందేన్ కమాండర్ అయిన కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ వాటిమీద బాంబులు వేసి, కాల్పులు జరిపాడు. కేవలం కొన్ని నిముషాలలో ఐదు ట్యాంకర్లు తగలబడి దాదాపు మూడు లక్షల యాభై వేల గాలన్ల ఇంధనం తగలబడిపోయింది.

బాంబులు, కాల్పులు, యుద్ధం, విధ్వంసంతో కూడిన ఆ రాత్రి తమిళనాడు, మద్రాస్ ప్రజలకు కాళరాత్రిగా జ్ఞాపకాలలో మిగిలిపోయింది. తర్వాతెప్పుడో కెప్టెన్ ముల్లర్ ఇలా రాశారు ” భారతీయులలో ఆసక్తిని రేకెత్తించి, ఇంగ్లీష్ వారి వ్యాపారాన్ని దెబ్బతీసి, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించేందుకే నేను ఈ బాంబుదాడి చేసాను” అని. ఆయన అలా ఆసక్తిని రేకిత్తించడంలో విజయం సాధించాడని చెప్పాలి. దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఆయన నౌక “ఎందేన్” పేరు తమిళ పదజాలంలో భాగంగా మారిపోయింది.

జర్మనీ లోని ఒక పట్టణమైన ఎందేన్ పేరుని ఈ నౌకకి పెట్టారు. వాయువ్య జర్మనీ లో ఎమ్స్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రేవు పట్టణం. 2011 లో ఈ పట్టణం మొత్తం జనాభా 51,528.

ఈ పట్టణానికి చారిత్రకంగా అంత ప్రాధ్యాన్యత లేకపోయినా ఆ పేరుతో నిర్మించబడిన ఎందేన్ నౌకకి మాత్రం చెప్పుకోదగ్గ రక్త చరిత్రే ఉంది..జర్మన్ ఇంపీరియల్ నేవీ కోసం తయారుచేయబడిన ఈ డ్రెస్డెన్ క్లాస్ లైట్ క్రూయిజర్ లో 10.5 సెంటీమీటర్ గన్నులు ఒక పది, రెండు టార్పెడో గొట్టాలు ఉన్నాయి.

ఎందేన్ కెరీర్లో అధికభాగం చైనా కేంద్రంగా పనిచేసిన జర్మన్ తూర్పు ఆసియా స్క్వాడ్రన్ లో గడిచింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు రెండు డజన్ల ఓడలను ఎందేన్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పై చేసిన దాడి మాత్రమే కాక, ఎందేన్ పెనాంగ్ పై కూడా దాడి చేసి పెనాంగ్ యుద్ధానికి కారణమయ్యింది. ఒక రష్యన్ యుద్ధనౌకని, ఒక ఫ్రెంచ్ నౌకాని కూడా ఎందేన్ విధ్వంసం చేసింది.

ఆ తర్వాత కెప్టెన్ ముల్లర్ ఎందేన్ ను కోకస్ దీవులకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొద్దిమంది నావికుల సహాయంతో బ్రిటిష్ స్థావరాలను నాశనం చేసాడు. అక్కడ ఒక ఆస్ట్రేలియన్ యుద్ధ నౌక ఎందేన్ పై దాడి చేయగా ముల్లర్ దానిని మునిగిపోకుండా కాపాడటానికి గానూ నీటి అడుగుభాగానికి తీసుకుని పోయాడు. నౌకలో ఉన్న 376 మంది క్రూ లో మొత్తం 133 మంది ఈ దాడిలో మరణించారు. బతికి ఉన్నవారిలో చాలా మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. సముద్ర అలల కుదుపులకు ఎందేన్ తీవ్రంగా దెబ్బతినడంతో 1950 లో దానిని ముక్కలుగా చేసి స్క్రాప్ కింద అమ్మివేసారు.

అనుకోకుండా ఎందేన్ పట్టణం కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడిలో దెబ్బతిన్నది. 1944 సెప్టెంబర్ 6 న రాయల్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో ఈ పట్టణంలోని 80 శాతం పైగా ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఆ పట్టణ ప్రజలు ఆ రోజును ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

ఎందేన్ పదాన్ని బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీలను ఎత్తిపొడిచేందుకు ఒక తిట్టుగా వాడే సందర్భాన్ని గుర్తు చేసినందుకు క్షమాపణలతో

Post 32

–Based on a piece by Meena

శాస్త్ర సాంకేతిక విద్య పట్ల విక్రమ్ సారాభాయ్ దృక్పథం: Vikram Sarabhai and Science Education

మొన్న ఆగస్టు పన్నెండున డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి. దేశంలో అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాలకు బీజం వేసిన దార్శనికుడిగా ఆయనను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. స్వతంత్ర భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే అందుకు దోహదపడగలవని బలంగా నమ్మి ఇస్రో, పిఆర్ఎల్, ఐఐఎం-ఎ, ATIRA వంటి సంస్థలను స్థాపించి దేశంలో సాంకేతిక విప్లవానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. శాస్త్ర సాంకేతిక విద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఆయన ఎంతగా తపించేవారో ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

ప్రజలలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించకపోతే దేశం పురోగతి చెందలేదనే స్పష్టత సారాభాయ్ కి ఉంది. దీనిని సాధించాలంటే సైన్స్ బోధన మరింత వినూత్నంగా జరగాలనీ, శాస్త్రవేత్తలు యువతతో కలిసి పని చేసి వారిలో శాస్త్రీయ దృక్పధం అలవర్చాలనీ ఆయన భావించేవారు. చిన్నతనంలో ఇంటి వద్దనే ఎంతో మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం బహుశా ఆయనలో సైన్స్ బోధన పట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి పునాదిగా పనిచేసింది అనుకోవచ్చు.

ఈ ఆసక్తి వల్లనే 1963 లో ఆయన ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి సైన్స్ విద్యను సాధారణ పౌరులకు అందేలా చేసేందుకు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ తొలి ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు సాధించడంతో 1966 లో ‘కమ్యూనిటీ సైన్స్ సెంటర్’ అనే సంస్థను స్థాపించారు. దీనిని సారాభాయ్ గురువు, నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంలోనే ఆయన ‘ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది” అనే తన ప్రముఖ ఉపన్యాసాన్ని వెలువరించారు.

ఈ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ దేశంలో ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ప్రయత్నాల వల్లనే దేశంలో సైన్స్ మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. డాక్టర్ సారాభాయ్ మరణం తర్వాత ఈ సెంటర్ పేరును విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ (VASCSC ) అని మార్చడం జరిగింది.

Vikram Sarabhai as a boy, with his model train

ఈ VASCSC వెబ్సైటు ప్రకారం “పాఠశాల, కళాశాలల విద్యార్థులను తమ పాఠ్య పుస్తకాల పరిధి నుండి బయటకు తీసుకువచ్చి స్వంతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించేలా చేయడం ఈ సంస్థ ధ్యేయం. విద్యార్థులు సైన్స్, గణితాలను మరింత మెరుగ్గా, దీర్ఘకాలం గుర్తు ఉండేలా నేర్చుకునేందుకు గానూ ఎన్నో వినూత్న విధానాలను ఈ సంస్థ రూపొందించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పరిపాలకులు, సామాన్య ప్రజానీకం అందరూ కలిసి సైన్స్ ను అర్ధం చేసుకుంటూ శాస్త్రీయ దృక్పధాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం.”

స్థాపించిన నాటి నుండి ఈ సంస్థ సైన్స్ ప్రదర్శనలు నిర్వహించడం, ఓపెన్ లేబొరేటరీ లను, మాథ్స్ లాబొరేటరీలను, సాంకేతిక ఆటస్థలాలను నిర్మించడం వంటి ఎన్నో వినూత్న విధానాల ద్వారా శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజలలో పెంపొందించే ప్రయత్నాలు చేసింది. దేశంలో శాస్త్రీయ విద్యా కార్యక్రమానికి ఈ రోజు ఈ సంస్థే వెన్నుముకగా ఉంది. ఎంతో నాణ్యమైన విద్యా కిట్లు, వనరులను ఈ సంస్థ రూపొందించింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం రూపొందించిన సైన్స్ ఎక్సప్రెస్ ఈ సంస్థ చేసిన అనేక వినూత్న కార్యక్రమాలలో ప్రముఖమైనది. ఎన్నో సంవత్సరాల పాటు నడిచిన ఈ సైన్స్ ఎక్సప్రెస్ ను ఇండియన్ రైల్వేస్ సహకారంతో 16 బోగీలు ఉన్న ఒక రైలులో ఏర్పాటు చేశారు. ఎన్నో శాస్త్రీయ నమూనాలను ఇందులో ప్రదర్శించారు. అక్టోబర్ 2007 లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చే ప్రారంభించబడిన ఈ రైలు దేశమంతా దాదాపు ఒక లక్ష ఇరవై రెండువేల కిలోమీటర్లు ప్రయాణించింది. 1404 రోజుల పాటు 391 ప్రాంతాలలో ఈ రైలు ప్రదర్శన జరగగా దాదాపు కోటి ముఫై మూడు లక్షల మంది దీనిని సందర్శించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువమంది సందర్శించిన సైన్స్ ప్రదర్శనగా ఇది ఎంతో గుర్తింపు పొందింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆరు సార్లు తన స్థానాన్ని నమోదు చేసుకుంది.

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ను గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో మృణాళిని సారాభాయ్ ఇలా అన్నారు. “విక్రమ్ సారాభాయ్ తాను ఉద్యోగ విరమణ చేసాక పిల్లలతో, యువతతో ఎక్కువ సమయం గడిపి వారిలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తానని అంటుండేవారు”. అయితే ఆ కోరిక తీరకుండానే సారాభాయ్ తక్కువ వయసులోనే అకాలమరణం చెందారు. అయితే ఆయన ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ఆ దిశగా తన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది.

P.S: ఈ వ్యాసకర్త మీనా రఘునాధన్ విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు 

–Based on a piece by Meena

(Post 31)