బట్టల హ్యాంగర్/కరవాలం చరిత్ర: Handy Hangers

బట్టల షాపింగ్ కి వెళ్ళినప్పుడు అతి సాధారణంగా కనిపించే వస్తువు హ్యాంగర్.

ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, భారత్ లో తయారు చేయబడిన హ్యాంగర్ ఉండే ఆస్కారం 12% ఉందని మీకు తెలుసా!.. 

హ్యాంగర్ లు అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది కాగా మొదటి రెండు స్థానాలలో చైనా, వియాత్నాంలు ఉన్నాయి. ప్రతీ ఏడాది భారత్ సుమారు 11.1 వేల ఎగుమతులు ప్రముఖంగా అమెరిక, జర్మనీ, మరియు స్వీడన్ దేశాలకు చేస్తుంది.

ఐతే ఇంతలా మనను చుట్టేసిన ఈ హ్యాంగర్ల సృష్టికి ఎన్నో కథలు మరెన్నో మూలాలు చెప్పుకుంటారు. అందులో కొన్ని;

అమెరికా దేశం మూడవ అధ్యక్షుడు తన బట్టలని ఒక వరుసలో అమర్చుకునేందుకు గాను నేటి హ్యాంగర్ ను పోలినటువంటి పరికరం వాడేవారని వినికిడి, ఐతే దీన్ని నిరూపించడానికి పెద్దగా ఆధారాలు లేవు. కొన్ని కథనాల ప్రకారం, హ్యాంగర్ ల ఆవిష్కరణ 1869 సంవత్సరంలోని వ్యక్తి  ఒ.ఎ నార్త్ (A O North) కి చెందుతుంది. అలాగే మరికొందరు 1903 లో ఎజె పార్క్ హౌస్ దీని ఆవిష్కరణకు మూలం అని నమ్ముతారు. దాని వెనుకాల కథ క్లుప్తంగా, ఒక రోజు ఉదయం పార్క్ తన పనికి వచ్చీ రాగానే కోట్ తగిలించుకునే కొక్కాలు ఏవి ఖాళీ లేకపోవడం చూసి, చిరాకుగా పక్కన పడున్న తీగని ప్రస్తుతం వాడకంలో ఉన్న హ్యాంగర్ ఆకారంలోకి అమర్చుకొని తన కోట్ తగిలించుకున్నాడని వినికిడి.

చెక్క, ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్, ట్యూబ్, ఇలా వివిధ రకాలుగా హ్యాంగర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐతే పర్యావరణ కోణం దిశగా నేడు పునరుత్పత్తి/రీసైకల్ చేయబడిన హ్యాంగర్స్ వైపు దృష్టి మరులుతుంది. ఖరీదైన బట్టల కోసం సాటిన్ హ్యాంగర్లు అలాగే లగ్జరీ మరియు కస్టం/ అవసరానికి అణుగునంగా చేయబడిన వర్గంలో రకరకాల హ్యాంగర్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.  

ప్రాథమికంగా చూసుకుంటే, హ్యాంగర్ అనే పరికరం మనుషుల భుజాలను పోలి ఉండి; మన బట్టలు, కోట్స్, స్కర్ట్స్ ముడత పడకుండా ఉండడానికి వాడే వస్తువు. హ్యాంగర్ల కింద భాగం ప్యాంట్స్/స్కర్ట్స్ తగిలించడానికి తయారుచేయబడింది. ఐతే మొదటి రకం హ్యాంగార్స్ లో ప్యాంట్స్/స్కర్ట్స్ వేలాడదీయడానికి అనువుగా క్లాంప్స్/బిగింపులు ఉండేవి.

20వ శతాబ్దం మొదలు నుంచి వైద్య-లాయర్ వృ త్తులలో ఉన్నవారికి హ్యాంగర్స్ యొక్క అవసరం బాగా పెరిగింది. వారి బట్టలు చక్కగా పెట్టుకోవడానికి హ్యాంగర్ లు ఒక సులభమైన పరికరం లా వారికి చిక్కాయి.

కొంత సమయంలోనే హ్యాంగర్స్ ప్రతి అవసరానికి తగట్టు రకరకాల విధాలుగా అందుబాటులోకి వచ్చాయి. సులువుగా మడత పెట్టి విహారాలకు తీసుకు వెళ్ళే వీలుగా- స్కార్ఫ్ హ్యాంగర్స్, బ్లాంకట్ హ్యంగెర్స్, టై హ్యాంగెర్స్ మొదలగు విధంగా పరిణామం చెందాయి.

మనం గమనించినట్టైతే హ్యాంగర్స్ పరిమితి కేవలం ఇంటి వరకే కాకుండా రీటైల్ (వ్యాపరాల) రంగంలో ఇంకా విస్తృతంగా ఉంది. అక్కడికే ఆగకుండా, వస్తువుల బ్రాండ్ వృద్ధి లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఈ హ్యాంగర్.       

హ్యాంగర్స్ ఉత్పత్తి సంస్థల్లో ‘మైనెట్టీ’ (Mainetti) ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ సంస్థ కథ 1950 లలో ఇటలి దేశంలో మొదలైంది. కథ సారాంశం, రోమియొ మైనెట్టి అనే ఒక తెలివైన కుర్రవాడు రేసింగ్ కారు నడిపే యజమాని దగ్గర పని చేసేవాడు. యజమాని తండ్రి, వస్త్ర రంగంలో మహా ఉద్ధండుడు మార్జొట్టో కార్పరేషన్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ రెడీ-మేడ్ సూట్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన రోజులవి. అందులో భాగం గానే అవి నలగకుండా ఉండడానికి గాను హ్యాంగర్ల వాడకం పెంపొందించిందా సంస్థ. చెక్కతో తయారుచేయబడిన ఆ హ్యాంగర్ల ఖరీదు, బరువు రెండు అధికంగా ఉన్న పరిస్థితిని అప్పటికి గమనిస్తూ వస్తున్న రోమియొ వాళ్ళ అన్న మారియొ. గతంలో తనకు ప్లాస్టిక్ కంపని లో ఉన్న అనుభవాన్ని మేళవించి రొమియో తో కలిసి ప్లాస్టిక్ హ్యంగర్ల తయారీని నెలకొల్పారు.

అలా మొదలైన వారి ప్రయాణం యూకే, ఫ్రాన్స్, కెనడా, మరియు నెదర్ల్యాండ్స్ వంటి దేశాలకు చేరింది. వారు గుర్తించిన అంతరం, అందించిన నాణ్యత ఆ రంగాన్నే ఒక కొత్త వెలుగు తో నింపింది. ప్రస్తుతం 6 ఖండాలు, 90 స్థానాలలో విస్తరించి, భారత్ లో కూడా ప్రముఖమైన ఉత్పత్తి కేంద్రం నెలకొల్పింది.

లోహాల వెల్డింగ్ మొదలుకుని డ్రైనేజి శుబ్రపరుచుకునే వరకు, మొక్కలు పెట్టుకునే సాధనం నుంచి పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ వరకు. ఇలా బట్టల హ్యాంగర్స్ వాడకం ఏన్నో ఆవిష్కరణలకి స్థావరం అయ్యింది. మరోవైపు ఇదే హ్యాంగర్ కార్ దొంగతనాలకి, అబార్షన్ లకి ఒక ముఖ్య వస్తువు అవ్వడం భాధాకరం, ఒక సమర్ధించరాని నిజం. 

కాగా ఈ చరిత్ర పుటల్లో మన ముడత పడిన బట్టలకూ ఒక హ్యాంగర్ ఎల్ల వేళలా తోడై ఉంటుందని కోరుకుంటూ!

ఈ పూట పూర్తి పర్యావరణ స్పృహతో ఒక మంచి హ్యాంగర్ కొందామా మరి?

  • మీన (Based on a piece by Meena)

సృజనాత్మక విద్య

నేటి విద్యా-విధానాల గురించి సుదీర్ఘమైన ఆలోచన కొనసాగించగా, నాకు సార్ కెన్ రాబిన్సన్ గుర్తుకు వచ్చారు. వారి గురించి పరిచయం లేని వారి కోసం.

రాబిన్సన్ బాగా పేరు గడించిన సమకాలీనమైన(contemporary) విద్యాతత్వావేత్తల్లో ఒకరు. వారు బ్రిటన్ దేశంలో జన్మించారు. ఒక టీచర్, రచయిత మరియు నేటి విద్యా విధానల గురించి తనదైన శైలిలో ప్రసంగించగల ఒక గొప్ప వక్త. చిత్రంగా విద్య పట్ల దూరదృష్టిలో(vision) వీరికి మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఎన్నో దగ్గర పోలికలు కనిపిస్తాయి.     

రాబిన్సన్, ప్రస్తుత విద్యావిధానాల్ని వ్యతిరేకిస్తూ. విద్య ఒక పారిశ్రామిక నమూనాగా మారిన తీరు గురించి. కేవలం సరళ రేఖకి(linearity), అనుగున్యానికి(conformity) కట్టుబడి ‘బ్యాచింగ్’ (batching) పద్ధతిలో తయారయ్యే సరుకుగా అమలవుతున్న పరిస్థితుల గురించి ఎన్నో వేదికల్లో విరివిగా చర్చించటం జరిగింది. వారి మాటల్లో: “మనల్ని మనం ఈ ఫాస్ట్ ఫుడ్ (చిరుతిండి వ్యాపారాన్ని తలపించే) విద్యా నమూనాకి ఎప్పుడో అమ్ముకున్నాము. ఫాస్ట్ ఫుడ్ (చిరుతిళ్లు) మన భౌతిక దేహాల్ని ఏ విధంగా బలహీనపరుస్తుందో అదే రీతిలో ఈ ఫాస్ట్ ఫుడ్ విద్య మన ఆత్మల్ని, శక్తిని నిర్వీర్యం చేస్తుంది” అని వ్యక్తపరిచారు.

రాబిన్ పెద్ద పాఠశాలలను పిల్లలలోని సృజనాత్మకతని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారి ఇష్టాలకు స్పందించకుండా కేవలం ప్రమాణీకరించబడిన పరీక్షా పద్ధతుల్ని తమదైన పద్ధతుల్లో ధ్రువీకరించి, కళలు మరియు మానవీయ శాస్త్రాలకి తావు ఇవ్వకుండ, బహిరంగంగా గణితము మరియు విజ్ఞానం దిశగా నడిపించే వ్యవస్థలుగా చూస్తారు.    

అలా కాకుండా పాఠశాలల దృష్టి కేవలం పాఠ్యప్రణాళికను మెరుగుపరుచుకునే వైపే కాకుండా ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి పెంపొందించే నిపుణులుగా తయారవ్వడానికి మద్దతు ఇవ్వగలగాలని, కెన్ రాబిన్సన్ బలంగా విశ్వసిస్తారు. వ్యక్తీకరించబడిన లర్నింగ్ (personalized learning) వాతావరణం సృష్టించి చిన్న గ్రూపులుగా విద్యను అందించడం పిల్లల్లో విసుగును దూరం చేస్తుందని, అలాంటి వ్యవస్థ ఆచరణీయమైనదని, కెన్ ఖచ్చితత్వంతో చెప్తారు.

సుమారు 100 ఏళ్ళకి ముందు ఠాగూర్, మంచి ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు నిర్వచనాన్ని  ఇలా రాసారు “ఒక మంచి గురువు కేవలం విద్యార్థులు సమాచారాన్ని సేకరించి సమ్మిళితం చేసుకునే దిశగా కాకుండ పిల్లల మనుసుని జాగృతి చేసి వారు పరస్పరం స్వయం అభివృద్ధి బాటలో అడుగులేసేవైపు స్పూర్థి నింపుతారు/డు” అని గుర్తుచేసారు కెన్.

రాబిన్సన్ విద్యా విధానాల్లో సృజనాత్మకతని పెంపొందించే వాతావరణాన్ని నడిపే వ్యవస్థల్ని సృష్టించే దిశగా నడవడం తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నారు. అదే విషయ జ్ఞానాన్ని పంచుతూ తన దృష్టిలో సృజనాత్మకత అంటే ఎమిటో, వారి పుస్తకం ‘క్రియేటివ్ స్కూల్స్’ లో రాయడం జరిగింది.

సృజనకు, ఊహ మూలము. మన ఇంద్రియాలకు కూడ అందని దృష్టి మన మనసులకు అందించే శక్తి ఊహలకి ఉంది.

సృజన అనేది ఆ ఊహ శక్తిని తరిచి లేపడమే. దానినే అనువర్తిత కల్పన (applied imagination) అంటారు. ఆవిష్కర్ణ అంటే కొత్త ఆలోచనల్ని అమలుచేయడం. సృజన గురించి ఏన్నో అవాస్తవాలు వ్యాపించి ఉన్నాయి. అందులో కొన్ని: ప్రత్యేకమైన వారే సృజన కలిగి ఉంటారు, సృజన కేవలం కళలకి సంబంధించిందని, మూడవది సృజనని ఎవరూ నేర్పించలేరు, నాల్గవది సృజన ఒక నిరోధించలేని ‘స్వీయ-వ్యక్తీకరణ’.

నిజం ఏమిటంటే ఈ పైన చర్చించిన వాటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. సృజన మన మానవ నైజంలోని ఎన్నో శక్తులనుంచి పెంపొందుతుంది. సృజన మన జీవితంలోని ప్రతీ కోణంలో భాగం: విఙానం, కళలు, గణితం, సాంకేతికం, వంటకాలు, రాజకీయాలు, వ్యాపారం, ఇలా అన్నిటిలోను. అలాగే ఎన్నో మానవ సామర్ధ్యాలలాగనే సృజనను అలవరుచుకొని, సాన పెట్టి మెరుగుపరుచుకోవచ్చు. అలా చేయడానికి నైపుణ్యాలు, జ్ఞానం, కొత్త ఆలోచనలని ఆహ్వానించి పాండిత్యాన్ని పెంచుకోవడం అవసరం.   

సృజన కొత్త ఆలోచనలలో ఉంటుంది. అదనంగా లాభమున్నా కూడ సృజన ఎల్లపుడూ అందరికి నూతనంగా ఉండవలసిన పని లేదు, కాని తమ పనిలో నిమగ్నమైన వారికి అదితప్పనిసరి. ఒక సిద్ధాంతం, ఒక రూపకల్పన, ఒక కవిత అలా ఏదైనా కావచ్చు, సృజనా పాటివం మనం పని చేసే వాటిలో క్లిష్తమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటుంది.  సృజన ఎన్నో సాధారణ దశలు దాటుతుంది. కొన్ని సార్లు మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిస్తాము. అది ఒక క్రియాశీల ప్రక్రియలో భాగము, కొత్త పరిచయాలు, విభాగాలు, రూపకాలు, సారూప్యాల పైన ఆధారపడి ఉంటుంది.    సృజనాత్మకంగా ఉండటమంటే కేవలం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు, ఊహశక్తిని తట్టడమే కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. మెరుగుపరచడం, పరీక్షించడం, దృష్టిని కేంద్రీకరించడం అందులో అతి ముఖ్యమైన భాగాలు. ఏదైన పని నిర్వహించేటపుడు  ఒరిజినల్ ఆలోచనలు ఆ పని వెళ్ళే దిశను ముందస్తుగా ఊహించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలగటం సృజనలో భాగమే. సృజనకు క్రమశిక్షణ, నియంత్రణ వ్యతిరేకం కాదు. చెప్పాలంటే ఏ రంగంలో అయినా సృజనకి వాస్తవ జ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యం చాలా అవసరం.

అలాంటి సృజనను పెంపొందించడం గురువులకు కత్తి మీద సాము వంటిదే. వాస్తవానికి దానికి సృజనాత్మకమైన పని చేయడానికి కావాల్సిన విషయ జ్ఞానం, లోతుపాట్లు తెలిసుండాలి. వాస్తవికంగా సృజనను నడిపేవి రెండు ముఖ్యాంశాలు, ఒకటి ఆవిష్కరణల పట్ల తీవ్ర ఆసక్తి, రెండు చేసే పని పట్ల అభిరుచి. విద్యార్థులకి నేర్చుకోవాలనే ప్రేరణ కలిగితే వారికి వారే నైపుణ్యాలు పెంచుకునే దిశగా నడుస్తారు. అలా సాగుతున్న కొద్దీ ఆ దిశలో వారి ఆశయాలు పెంపొందుతాయి అలాగే ఆ పనిలో పాండిత్యం కూడ మెరుగుచెందుతుంది. ఈ ప్రక్రియకి నిదర్శనం ఫుట్ బాల్ క్రీడ నుంచి రసాయన శాస్త్రం వరకు ఎన్నో రంగాల్లో చూడవచ్చు. మనం గుర్తించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనిషి జీవనం ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. ఒక జీవక్రియ. మానవ అభివృద్ధి ఫలితాలని మనం అంచనా వేయలేము. మనం చేయగలిగిందల్లా ఒక రైతులా తమ వంతు కృషిగా అందరూ మెరుగుపడగల పరిస్థితుల్ని సృష్టించడం.

ఠాగూర్ అలాంటి కలనే ఒకటి కన్నారు, అది సాకారం కావాలని కోరుకున్నారు. దాని గురించి రాస్తూ: “విధానాలలో నిమగ్నమైపోకండి. మీలోని ఇన్స్టింక్ట్స్ ని (మీలోని సహజ భావాల్ని/గట్) మీ జీవనానికి మార్గదర్శకాలు అవ్వనివ్వండి. ఏ ఇద్దరు పిల్లలూ ఒకలా ఉండరు. అది గ్రహించి సముద్రపు దిబ్బల/రీఫ్స్ మధ్యలో ఎలా పయనిస్తామో అలాగే ప్రతి పిల్లవాడిని తరిచి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి”.

మనల్ని మలచిన ప్రతీ గురువును గుర్తు చేసుకుంటూ.

-మమత

నూలు నేసిన చరిత్ర (Fabrics for Freedom, Khadi and Beyond’)

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఖద్దర్ కి ఉన్న విశిష్టత మనందరికి తెలిసిందే!

ఖాదీ ధరించడం కేవలం బ్రిటిషర్ల దిగుమతులని  ధిక్కరించడానికి జరిగిన  స్వేచ్చా  పోరాటం మాత్రమే కాదు. కొన్ని లక్షలమంది జీవనోపాధికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి, ఒక దృఢమైన చిహ్నం.  

దివ్య జోషి మాటల్లో: ‘ఖాదీని గాంధీజీ ఈ దేశ జాతీయవాదనికి, సమానత్వానికి మరియు స్వాలంబనకు ప్రతీకగా నిలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పాటించి ఈ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఖాదీ పాత్ర ముఖ్యమైనదని అని వారు బలంగా విశ్వసించారు. ఒకప్పుడు పేదరికానికి మరియు వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచిన రాట్నాన్ని స్వాలంబనకు, అహింసకు చిరస్మరణీయమైన గుర్తుగా మలిచారు గాంధీజీ.’

ఐతే! స్వాతంత్ర్య సాధనలో వస్త్రాలు నూలడం-నేయడం కేంద్ర భాగమై జరిగిన పోరాటాలు భారత్ లోనే కాకుండ మరెన్నో దేశ చరిత్రలలో కనిపిస్తుంది. అలా, బ్రిటిష్ ని ఎదురిస్తూ, వస్త్రాన్ని ఆయుధంగా మలచుకున్న ఉద్యమ చరిత్రల్లో అమెరికాది కూడా ఒకటి.        

  అమెరికాతో సహా తాము పాలించిన కాలనీలను బ్రిటన్ దేశం ప్రధానంగా తమ ముడి పదార్ధాల సరఫరాదారులుగా భావించారు. పత్తి ఇతరాత్రా ముడి సరుకుని తమ దేశానికి ఎగుమతి చేసుకుని, తయారైన బట్టలను రెట్టింపు పన్నులతో మళ్ళీ అవే కాలనీలలో విక్రయించేవారు. ఈ ప్రక్రియను ధిక్కరిస్తు బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికా కాలనీ ప్రజలు 1760-1770 మధ్య కాలంలో తమ దేశభక్తిని చాటుతూ చరఖా/రాట్నం సహయంతో, ఒక శక్తిగా కదిలి వారి వస్త్రాల్న్ని వారే తయారు చేసుకోవడం జరిగింది. విధిగా ఇదే రాట్నం 20వ శతాబ్దం భారత దేశ స్వాతంత్ర్య చరిత్రలోను కీలకమైన పాత్ర పోషించింది.

అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో కీలకంగా నిలిచిన రాట్నం/స్పిన్నింగ్ ఉద్యమాల్ని మహిళలు ముందుండి నడిపించారు. ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తూ బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి మహిళ తమ ఇళ్లలోనే నూలు నూయడం, వస్త్రాల్ని నేయడం జరిగింది. ఆ విధంగా నేసిన వస్త్రాలు ‘హోంస్పన్’ గా ప్రసిద్ధి చెందాయి. అలా హోంస్పన్ వస్త్రాలు ధరించడం దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.

కొన్ని కాలనీలలో మహిళలు, సామాజిక నిరసన వ్యక్తపరుస్తూ, కలిసి రాట్నాలు ఏర్పరుచుకొని నూలే వారు. అలా ఏర్పరుచుకున్న సామూహిక ప్రదేశాలు ‘స్పిన్నింగ్ బీస్’ గా ప్రసిద్ధి చెందాయి. మార్చి 1768 లో మొదలుకొని 32 నెలల పాటు హార్ప్స్వెల్ నుంచి, మైనె నుంచి, హంటింగ్టన్, లాంగ్ ఐలండ్ వంటి కాలనీలలో విస్తృతంగా 60 స్పిన్నింగ్ మీటింగ్స్ జరుపుకున్నారని ప్రసిద్ధి.

అమెరికా సమాజంలో ఈ స్పిన్నింగ్ బీస్ సృష్టి-ప్రేరణలో, రాజకీయ అసమ్మతివాదుల సంఘం ‘డోటర్ ఆఫ్ లిబర్టీ’ కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు బ్రిటిష్ వారు తమ దేశంలోకి దిగుమతి చేసే వస్తువులు ముఖ్యంగా టీ, బట్టలు మొదలగు వాటి సంఘ బహిష్కరణను ప్రొత్సహించడం మరోవైపు ప్రత్యామ్నయాలని గుర్తించి సొంతంగా తయారుచేసుకునే భాద్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించింది.

అమెరికాలో ధ్వనించిన తీరుగనే భారత దేశంలో కూడా స్వాతంత్ర్య సమరయోధుల ప్రచారాల్లో, ర్యాలీలలో, పిలుపులో స్పిన్నింగ్ అనేది పోరాట స్ఫూర్తి రగిలించడంలో  కేంద్ర అంశంగా నిలిచింది. హోంస్పన్ వస్త్రాలలో జరుగుతున్న ప్రతి చిన్న అభివృద్దిని, పురోగతులను పత్రికలు నివేదించేవి. అలానే స్పిన్నింగ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి, వాటి ద్వారా బాగా/ఎక్కువ మొత్తాలలో నేసేవారిని గుర్తించి పురస్కారాలు అందించడం చేసేవారు. అలా ప్రేరణతో చిన్నా-పెద్దా  తేడా  లేకుండా ప్రతి ఒక్కరూ వస్త్రాలు నెయ్యడానికి ముందుకు రావడం జరిగింది, అదే విషయాన్ని గుర్తిస్తూ న్యూపొర్ట్ కి చెందిన 70 ఏళ్ళ ముసలావిడ తన జీవింతంలోనే మొదటిసారి రాట్నం తిప్పడం నేర్చుకొని వస్త్రాన్ని నేసిందని అప్పటి పత్రికలు నివేదికలు ఇచ్చాయి.

పోరాట స్ఫూర్తి ని మరింత రగిలిస్తూ 1769 సమయంలోనే ఏన్నో స్పిన్నింగ్ పోటీలు విధిగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న సభ్యులు పోటా-పోటీగా గెలిచారని అప్పటి నివేదికలు తెలియజేసాయి.

వీటన్నిటి పర్యావసానం, అమెరికాకు బ్రిటిష్ చేసే దిగుమతులు తీవ్రంగా పడిపొయాయి, ఒక సంస్థ ప్రచూరించిన లెక్క ప్రకారం 1769 ముందు సంవత్సరంతో పోలిస్తే ఆ ఏడు దిగుమతులు 4,20,000 నుంచి 2,08,000 పౌండ్ కి పడిపోయాయి.

 ఆ విధంగా ఈ ప్రపంచంలోని ఏన్నో  దేశాల్లో ‘స్వదేశీ’ అనేది సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలన పట్ల తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది.

ఇదే స్ఫూర్తి 150 ఏళ్ళ తరువాత, భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కనిపిస్తుంది. అదే మన ఆత్మ విశ్వాసం, మనోబలం, గుర్తింపుగా నిలిచింది, నిలుస్తుంది.

-మీన

ఇలాబెన్ భట్ (1933 – 2022) 

గాంధేయ వాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, ఉమెన్ వరల్డ్ బ్యాంక్ సహ-స్థాపకురాలు, గుజరాత్  విద్యాపీఠం గౌరవాధ్యక్షురాలు, గాంధీ ఆశ్రమ ట్రస్టీ, రామన్ మెగసెసే – ది రైట్ లైవ్లీహూడ్, పద్మ విభూషణ్  వంటి ఎన్నో విలక్షణ పురస్కారాల గ్రహీత. అన్నింటికీ మించి తనదైన నిరాడంబరతకు, అసాధరణ స్ఫూర్తికి చెరగని ప్రతీక. డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసేవారికి ఎంతో సుపరిచితమైన పేరు. 

ఇలా తో ఒక్కసారి మాట్లాడిన ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులు అవుతారు. ఆమె వ్యక్తిత్వంలోని సరళత, ముక్కుసూటితనం, పని పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఇందుకు ప్రధాన కారణాలు. అసంఘటిత రంగంలోని మహిళల ఆర్థిక సాధికారతకై వారు చేసిన కృషి, పాటించిన నిబద్ధత ఆమెను ఆ దిశలో నడిచిన ఒక అనంతమైన తారగా ఎల్లపుడు నిలబెడతాయి. ఒక మృదుభాషి ఈ ప్రపంచంలో నింపిన వెలుగుకి తెచ్చిన మార్పుకి ఇంకో పేరే ఇలా.   

ఇలా తో సంభాషణల  సారాన్ని, వి రఘునాథన్ గారు వారి పుస్తకం “డోంట్ స్ప్రింట్ ది మారథాన్” లో చర్చించటం జరిగింది. అందులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనందరి కోసం;

Ela Bhatt

‘ఇలా తన స్కూల్లో కాని, కాలేజీలో కాని మొదటి ర్యాంకు విద్యార్థి ఏమి కాదు, ఒక 10 పర్సెంటైల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచేవారామె. కేవలం మార్కుల కోసం చదివే మార్గంలో తనను ఎవరు నడపాలనుకొలేదు కూడా. ఇలా భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆమె తండ్రి వేసవి సెలవుల్లో చదవడానికి వివిధ రకాల పుస్తకాలు ఇష్టంగా కొనిపెట్టేవారు, వాటిని తను అంతే ఆసక్తిగా చదివేవారు. తనలో విలక్షణంగా కనిపించే విలువలు-సిద్ధాంతాలకు రూపురేఖ, కేవలం తన హైలీ ప్రిన్సిపల్డ్ నాన్న నుంచే కాకుండ అప్పుడు నెలకొన్న జాతీయవాద వాతావరణం నుంచి ఆమె గ్రహించారు. బ్రిటిష్ పాలనా చెరలనుండి విముక్తి కోసం పోరాడుతూ గెలుపు కోసం వేచి చూస్తున్న హృదయాలలో గాంధీజీ బోధన, సందేశాలకి, జీవనశైలికి, పిలుపుకి స్పందిస్తున్న భారత దేశ నీడలో పెరిగారు ఇలా.  

చిన్నతనంలోనే ఇలా న్యాయ-అన్యాయాల పట్ల విచక్షణ కలిగిఉండి  వెనుకబడిన వారి పై జరిగే దోపిడిని సహించేది కాదు.

మహిళా ఉద్యమాల్లో తన తల్లి పోషించిన పాత్ర చిన్నారి ఇలా మనసులో బలంగా నిలిచిపొయింది. మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె నేరుగా గ్రహించారు. మహిళలు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నపటికీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న  వేతన మరియు ఎన్నో రకాల అసమానతల్ని పరిశీలిస్తూ వచ్చింది. వ్యవసాయ రంగం లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వారిని రైతులుగా గుర్తించకుండా, రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లని గమనిస్తూ వచ్చింది.

అసమానతల పట్ల నిత్యం అవగాహన కలిగి ఉండే దృష్టికోణం దానికి బలంగా ముడిపడున్న తన వ్యక్తిత్వం, భవిష్యత్తు రెండూ తన తల్లిదండ్రుల నుంచి అలవడి ఉంటాయి. ఇలా వ్యక్తిత్వాన్ని చూసిన ఎవరికైనా తెలుసు వారు నిర్భలులకు ఒక దృఢమైన గొంతుక అని.’

ఇలా లోని వినయం, సున్నితతత్వం చూపే ఒక చిన్ని ఉదాహరణ వారు రచించిన పుస్తకం ‘వి ఆర్ పూర్, బట్ సో మెనీ లోని పరిచయ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన వాక్యాలలో: 

“స్వయం ఉపాధి పనులు చేసే పేద మహిళల జీవితాల గురించి రాసే క్రమంలో నేను ఎంతో కొంత అహంకారాన్ని ప్రదర్శించాను. నేను వారి గురించిన రాసిన విషయాలను చదవలేని మహిళల గురించి ఈ పుస్తకం రాసాను. అదే కాక నాకున్న అవగాహన చాలా పరిమితమైనది, అది నేను ఉన్న ఆర్ధిక-సామాజిక వర్గాల నుంచి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను రాసిన మహిళల కోసం పూర్తిగా మాట్లాడుతున్నానని ఎన్నటికీ చెప్పలేను, ఎందుకంటే నేను నా కోసమే మాట్లాడగలను.” స్వయం ఉపాధితో జీవనం గడిపే మహిళల కోసం తన జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను, ప్రశంసలను అందుకున్న ఇలా ఈ విధంగా మాట్లాడటం ఆమెలోని వినమ్రతకు నిదర్శనం..    

ఆమె ఒక నిరంతర స్ఫూర్తి.

ఓం శాంతి.

– మీనా 

Based on a piece by Meena Raghunathan