Biju Patnaik: అరుదైన సాహసి ‘ బిజు పట్నాయక్ ‘

ఒక్కోసారి అనుకోకుండానే మనమెంత అజ్ఞానంలో ఉన్నామో మనకి తెలిసివచ్చే సందర్భాలు ఎదురవుతుంటాయి. ఈ మధ్య బిజూ పట్నాయక్ కు  సంబంధించిన ఒక లింకెడిన్ పోస్ట్ చదవడం నాకు అటువంటి ఒక సందర్భం. నాకు ఆయన గురించి తెలిసింది ఎంత తక్కువో ఆ పోస్ట్ ద్వారా అర్ధమయ్యింది. నాకు బిజూ గురించి ఉన్న పరిజ్ఞానం మొత్తం కొన్ని బులెట్ పాయింట్ల రూపంలో చెబితే: ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, కొన్ని సంవత్సరాల పాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎమర్జెన్సీ ని వ్యతిరేకించాడు, రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశాడు, భుబనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు ఆయన పేరు పెట్టారు, ఆ ఎయిర్పోర్ట్ బయట ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది, ఆయన కుమారుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలాకాలం ఉన్నారు. 

అయితే ఆయన జీవిత చరిత్ర గురించిన పరిచయం చదివాకనే నాకు తెలిసింది ఎంత తక్కువో తెలిసివచ్చింది. దానితో వెంటనే నేను  “లెజెండరీ బిజూ: ది మాన్ అండ్ ది మిషన్” అనే ఆ పుస్తకం ఆర్డర్ చేసాను.

Biju Patnaik
Biju Patnaik

పుస్తక రచనలోని వివరాలలోకి నేను వెళ్లదలుచుకోలేదు. మజుందార్ మొహంతి తో పాటు బిజూ ను అభిమానించే మరికొందరు కలిసి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది చదవడం ఆ అరుదైన నాయకుని జీవితంలోకి తొంగిచూసిన అనుభవం.

1916 లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన బిజూ మొదటినుండీ అందరూ నడిచే దారిని ఎన్నుకోలేదు. ధైర్యం, సాహసం ఆయన లక్షణాలు. ఆయన స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఒక రోజు బడి మానేసి వాళ్ళ ఊరికి దగ్గరలో ఆగిన విమానాన్ని చూడడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో విమానాన్ని చూడగలగడం ఎంతో అరుదు. దానిని చూసి ఎంతో ఆనందపడ్డ బిజూ ఎలాగైనా దానిని నడిపే పైలట్ కావాలి అనుకున్నాడు. విమానం చుట్టూ నిలబడ్డ గార్డులు దాని దగ్గరకు అతనిని వెళ్లనివ్వకుండా తరిమేయడం అతని కోరికను మరింత బలపరచింది. 

పెరిగి పెద్దవాడయ్యాక ఒకసారి తన స్నేహితులతో కలిసి భుబనేశ్వర్ నుండి పెషావర్ కు సైకిల్ మీద ప్రయాణం చేసాడు. రావెన్షా కాలేజీ లో చేరాడు కానీ మధ్యలోనే మానేసి పైలట్ ట్రైనింగ్ కు వెళ్ళాడు. విమానాలు నడపడంలో నైపుణ్యం సాధించాడు. 

పైలట్ గా ఆయన చేసిన విన్యాసాల గురించి చదివితే ఏదో కల్పిత కథలాగా ఉంటుంది తప్ప నిజ జీవితంలో జరిగినట్లు ఊహించలేము.

పైలట్ శిక్షణ పూర్తయిన తర్వాత ముందుగా ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థలో పనిచేసిన ఆయన తర్వాత ఎలాగో రాయల్ ఎయిర్ ఫోర్స్ సంస్థలో ప్రవేశించారు. అది రెండవ  ప్రపంచ యుద్ధ సమయం. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు చుట్టుముట్టారు. రెడ్ ఆర్మీ కు నగరాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు తగినన్ని ఆయుధాలు లేవు. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు ఆక్రమించుకుంటే వారికి మాస్కో కు చేరే మార్గం సుగమం అవుతుంది. అది ఎంతో ప్రమాదకరమైన పరిణామం. అప్పుడే బిజూ వారి సహాయానికి వచ్చాడు. మొత్తం 27 సార్లు విమానాన్ని నడిపి వారికి కావాల్సిన ఆయుధాలను స్టాలిన్గ్రాడ్ కు చేరవేసాడు. దానితో రెడ్ ఆర్మీ స్టాలిన్గ్రాడ్ ను నాజీల చేతిలో పడకుండా కాపాడగలిగింది. అది రెండవ ప్రపంచ యుద్ధంలో అతిపెద్ద మైలురాయి.

క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి బిజూ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. నిజానికి ఆయన అప్పుడు భారతదేశ వైస్రాయ్ గా ఉన్న లార్డ్ వావెల్ కు పైలట్. ఆయనకు బిజూ అంటే ఎంతో అభిమానం, నమ్మకం. కానీ బిజూ మాత్రం తనకు అందుబాటులో ఉన్న అన్ని బ్రిటిష్ వారి రహస్యపత్రాలను స్వాతంత్రోద్యమ నాయకులకు చేరవేస్తుండేవాడు. బర్మా లో బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్న భారతీయ సైనికులకు విమానం నుండి రాజకీయ కరపత్రాలను విసిరి వారికి సమాచారం చేరవేసేవాడు. అరుణ అసఫ్ అలీ తో సహా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను తన విమానంలో తిప్పేవాడు. చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి కారాగారం పాలయ్యాడు. నిజానికి జేమ్స్ బాండ్ కంటే సాహసవంతుడైన సీక్రెట్ ఏజెంట్ బిజూ.

స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక పైలట్ గా ఆయన సాహసం, నైపుణ్యం ఎన్నో సందర్భాలలో దేశానికి ఉపయోగపడ్డాయి. డచ్ వారి నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండోనేషియా కు అప్పట్లో భారత్ సహాయం చేసింది. ఒకసారి నెహ్రు ఇండోనేషియన్ నాయకులు అప్పుడు జరుగుతున్నా ఇంటర్ ఆసియా కాన్ఫరెన్స్ కు హాజరయ్యి అక్కడ తమ వాదనను వినిపిస్తే ప్రపంచ నాయకుల మద్దతు వారికి లభిస్తుందని భావించారు. కానీ అధికారంలో ఉన్న డచ్ నాయకులకు స్వాతంత్రోద్యమ నాయకులు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. దానితో దేశం నుండి బయటకు వెళ్లే అన్ని విమాన, సముద్ర మార్గాలను మూసివేశారు. కానీ బిజూ రహస్యంగా విమానాన్ని నడిపి నాయకులను కాన్ఫరెన్స్ కు తీసుకువచ్చి మళ్ళీ క్షేమంగా వారిని వారి దేశంలో వదిలివచ్చారు.

1947 లో పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ పై దాడి జరిపినప్పుడు భారతదేశపు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జమ్మూ, కాశ్మీర్ లో చాలా కొద్దిపాటి సైన్యం, ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని రక్షించాలంటే కొంత సైన్యాన్ని, ఆయుధాలను విమానంలో వెంటనే చేరవేయాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ ఆక్రమణదారుల అధీనంలో ఉందా, మన చేతిలోనే ఉందా అనేది కూడా తెలియడం లేదు. ఆయుధాలను, సైన్యాన్ని చేరవేసే పని చేయలేమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చేతులెత్తేసింది. అప్పుడే మళ్ళీ బిజూ సహాయం అవసరమైంది. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి, టవర్ ను తన నియంత్రణలోకి తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యేలా చూడగలిగారు. అది మన చరిత్రనే మార్చివేసిన సందర్భం.

నేపాల్ కు కూడా ఆయన చేసిన సహాయం ఎంతో ఉంది. అప్పుడు నేపాల్ ను పరిపాలిస్తున్న రాణాలకు, నేపాల్ స్వాతంత్రోద్యమకారులకు మధ్య ఘర్ణణలు చెలరేగుతున్న నేపథ్యంలో  మనదేశం స్వాతంత్ర సమరయోధులకు మద్దతు ఇచ్చింది. అయితే పొరుగుదేశపు అంతర్గత వ్యవహారాలలో అధికారికంగా జోక్యం చేసుకునే వీలులేదు. అయినా బిజూ ధైర్యం చేసి రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులకు దాదాపు 15000 తుపాకీలు చేరవేసాడు.

ఇవన్నీ ఒక పైలట్ గా ఆయన ఘనతను నిరూపించే సందర్భాలే. ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ  నాయకునిగా ఆయన సాధించిన విజయాలు మరెన్నో ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు. 

సాహసి, మొండివాడు అనే మాటలు పుస్తకంలో ఎన్నోసార్లు వస్తాయి. బిజూ ఆ మాటలకు తగిన వాడు. వివాదాస్పద వ్యక్తి అని కూడా అనొచ్చేమో. ఆయన పదవిలో ఉన్న కాలంలో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అవినీతి అధికారులను కొట్టమని ప్రజలను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కున్నాడు.

నిజానికి మరింత వివరంగా ఆయన జీవితచరిత్ర రావాల్సి ఉంది. ఇటువంటి అరుదైన వ్యక్తిత్వం గల నాయకునికి అది దేశం ఇవ్వాల్సిన కనీస గౌరవం.

–Based on a piece by Meena

పర్యాటకానికి లోటెక్ అడ్డంకులు: Tourist Spots

ఇంతకుముందు వ్యాసంలో టూరిజం కు అడ్డంకిగా ఉన్న కొన్ని హైటెక్ అంశాల గురించి ప్రస్తావించాము. పోయిన నెలలో నా మైసూర్ ప్రయాణం దేశంలో టూరిజం విస్తరించడానికి అడ్డంకిగా ఎన్నో లోటెక్ అంశాలను గుర్తు చేసింది. 

మైసూర్ ప్యాలస్ (మరమ్మత్తు పనుల కారణంగా సగం ప్యాలస్ లోకి సందర్శకులకు అనుమతి లేనే లేదు) లో కానీ, జగన్మోహన్ ప్యాలస్ లో కానీ ఆర్ట్ గ్యాలరీ ని సందర్శించాలంటే సందర్శకులు చెప్పులు విడిచి లోపలి వెళ్ళాలి. కొన్ని పవిత్రమైన శాలిగ్రామాలు లోపల ఉన్నందున ఈ నిబంధన ఉంది. అయితే ఆ శాలిగ్రామాలు మందపాటి వెండి తలుపుల వెనక ఉన్నాయి. నిజానికి చెప్పులు విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు. జగన్మోహన్ ప్యాలస్ లో గ్యాలరీ లోపల ఇతర ప్రదర్శనలతో పాటు ఒక వినాయక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి దానిని సందర్శించుకోవాలనుకునేవారి వరకు చెప్పులు తీసి వెళ్లమనే అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా ఎంతో పెద్ద ప్యాలస్లు. ఎన్నో అంతస్తులలో విస్తరించి ఉన్నాయి. ప్రతిరోజూ సందర్శకులు వస్తూనే ఉంటారు. చెప్పులు తీసి తిరగడం సౌకర్యమూ కాదు, వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా మంచిదీ కాదు. ఒకవేళ తప్పని సరిగా చెప్పులు తీసి వెళ్ళాలి అంటే సాక్స్ వంటివి ఏర్పాటు చేసి గ్యాలరీ సందర్శన ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకుని, శుభ్రపరచి తిరిగి వాడుతూ ఉండొచ్చు. లేదా మరేదైనా పరిష్కారం ఆలోచించవచ్చు. నా భర్త రఘు డయాబెటిక్ పేషెంట్. ఏదైనా చిన్న గాయమైనా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అని ఈ రెండుచోట్లా చెప్పులు తీయడం ఇష్టం లేక లోపలికి రాలేదు. మిగిలినవారమంతా లోపలోకి వెళ్లాం. లోపల ప్రదర్శనకు ఉన్న అద్భుతమైన కళా ఖండాలను చూసే అదృష్టం ఆయనకు లేకపోవడం ఎంత విచారకరం.

ఇక బృందావన్ గార్డెన్స్ సందర్శన మరొక బాధాకరమైన అనుభవం. మేము అక్కడకి వెళ్లడం కొంచెం ఆలస్యం అయ్యింది. పూర్తిగా చీకటి పడే లోపే గార్డెన్స్ చూడాలని మేమెంతో ఉత్సాహపడ్డాము. మేము అక్కడకి చేరే సమయానికి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గి పూర్తిగా మనుషులను ఎక్కించుకుని రౌండ్ కి తీసుకుని వెళ్ళింది. తర్వాత మళ్ళీ బగ్గి ఎప్పుడు ఉంటుందో అడుగుదామని సమాచారకేంద్రం కోసం వెతికాం. అటువంటిదేమీ ఉన్నట్లు కనిపించలేదు. బగ్గి సమయాలు సూచిస్తూ ఒక బోర్డు కూడా లేదు. ప్రవేశద్వారం దగ్గర అడ్డదిడ్డంగా ఏర్పాటుచేసిన షాప్ లలో కొంతమందిని అడిగాము. ఏ ఇద్దరు చెప్పిన సమాచారమూ ఒకేలా లేదు. సరే ఈ లోపు ఒక కాఫీ తాగి తర్వాత బగ్గి కోసం ఎదురుచూద్దాం అనుకున్నాం. కాఫీ లు ఆర్డర్ చేసాము. మధ్యలో కరెంటు పోవడంతో మాకు కాఫీ ఇవ్వలేదు. బాత్రూం ల కోసం చూసాము. అవి ఎక్కడున్నాయో సూచించే బోర్డు లేమీ కనపడలేదు. అటుఇటు తిరిగి వాటిని వెతికి పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. నలభై ఐదు నిముషాలు దాటినా మళ్ళీ బగ్గి రాలేదు. చీకటి పడింది. ఇక మేము తిరిగివెళ్లిపోదాం అనుకున్నాం.

తర్వాత రోజు మంగళవారం. రైల్ మ్యూజియం చూద్దాం అనుకున్నాం. మేము అక్కడకి చేరేటప్పటికి అది మూసేసి ఉంది. దానితో జూ కి వెళదాం అనుకున్నాం. అయితే జూ కి కూడా ఆ రోజు సెలవు దినమే అట. 

ఆ విధంగా మా మైసూర్ పర్యటన మొత్తం గందరగోళంగా ముగిసింది. మైసూర్ చాలా అందమైన నగరం. పచ్చని, ప్రశాంతమైన ఆ నగరంలో డ్రైవింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మాలో కొంతమంది ప్యాలస్, మ్యూజియం చూడగలిగాం. ఎంతో రుచికరమైన దోసెలు, సాంబారులో ముంచిన ఇడ్లీలు, పుల్లని, రుచికరమైన పచ్చళ్ళు అతి తక్కువ ధరలలో సంతృప్తిగా, శుచికరంగా తినగలిగాము.

ఇక ఆ ట్రిప్ మొత్తంలో అద్భుతంగా అనిపించిన అంశం ఒకటి ఉంది. దాదాపు 99 వేల బల్బులతొ రాత్రిపూట ధగధగా మెరిసిపోతున్న ప్యాలస్ ను చూస్తుంటే ఏదో జానపద కథలోకో, అందమైన కలలోకో జారినట్లు అనిపించింది. ఆదివారాలు, సెలవు దినాలలో ప్యాలస్ ఇలా విద్యుత్ కాంతితో మెరిసిపోతుంది తెలిసింది. మా పాలస్ టూర్ గైడ్ చెప్పి ఉండకపోతే ఆ రోజు అలా వెలిగిపోయే ఒక ప్రత్యేకమైన రోజు అని తెలిపే బోర్డు లు ఏవీ లేనందువల్ల ఈ అందమైన అనుభవాన్ని కూడా కోల్పోయేవాళ్ళం.

భారతదేశం ఎంతో ప్రాకృతిక, సాంస్కృతిక సంపద కలిగిన దేశం. ఇప్పడు చాలామంది భారతీయులు పర్యాటకంపై ఆసక్తి చూపిస్తూ అందుకు సమయం, డబ్బు వెచ్చిస్తున్నారు. అయితే అలా ఆసక్తితో వస్తున్న టూరిస్ట్ లకు కనీస సమాచారం, సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేయడం అంత కష్టమా? వారి పట్ల కొంత గౌరవం చూపించలేమా? ప్రయాణ అనుభవాన్ని అందంగా, ఆహ్లాదంగా, జ్ఞాపకంగా, నేర్చుకునేందుకు ఒక అవకాశంగా మార్చలేమా? చిన్న చిన్న ప్రయత్నాలైనా మొదలుపెట్టలేమా?

  • టూరిస్ట్ ప్రాంతాలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం, టూరిస్ట్ లు  అధికంగా వచ్చే నగరాలలో కూడా అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన టూరిస్ట్ లకు ఎంత వెసులుబాటు ఉంటుంది? 
  • డైరెక్షన్ లు చూపిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం ఉపయోగకరం కాదా? 
  • మైళ్ళకు మైళ్ళు ఉన్న కారిడార్ లలో చెప్పులు లేకుండా తిరిగే అవసరం లేకుండా చూడలేమా? ఒకవేళ తీయవలసిన అవసరం ఉన్న సందర్భాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమా? 
  • అన్ని ప్రదేశాలలోనూ ఒకే సెలవుదినాలు ఉండేలా చూడలేమా? నా ఈ అనుభవం తర్వాత నేను కొంచెం గూగుల్ లో పరిశోధన జరిపిన తర్వాత తెలుసుకున్నదేమంటే ఢిల్లీ జూ కు శుక్రవారం సెలవుదినం. హైదరాబాద్ జూ కు సోమవారం. మైసూర్ జూ, చెన్నై జూ లకు మంగళవారం, ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం కు సోమవారం, ముంబై లోని డాక్టర్ భావు దాజి లాడ్ మ్యూజియం కు బుధవారం, ఢిల్లీ లోని మోడరన్ ఆర్ట్ గ్యాలరీ కు సోమవారం, సైన్స్ సెంటర్ కు శని, ఆదివారాలు. ఇన్ని రకాల సెలవు దినాలు ఎందుకు. అన్ని చోట్లా ఒకటే పాటించవచ్చు కదా. కనీసం ఒక నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నిటికీ ఒకటే షెడ్యూల్ ఉండవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్యాటకులు ఏదైనా ఒకరోజు ఒక నగరంలో గడిపితే కొన్ని ప్రదేశాలు చూడగలుగుతారు, కొన్ని చూడలేరు. 

మనది నిజంగా అత్యద్భుతమైన దేశం. కొద్దిపాటి శ్రద్ద, చిత్తశుద్ధి ఉంటే దీనిని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.

–Based on a piece by Meena

టూరిజం కు హైటెక్ అడ్డంకులు: Tourist Troubles

కోవిద్ వలన చాలాకాలం ఇంటికే పరిమితమయ్యాక కొంచెం ఉధృతి తగ్గాక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము. బెంగుళూరు కు దగ్గరగా ఉండి ఒక్క రోజులో వెళ్ళిరాగలిగే ప్రదేశాల కోసం చూసాం. 

బెంగుళూరు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో హోయసల శైలిలో నిర్మించబడిన గుడి ఉన్న సోమనాథపురం గురించి తెలిసింది. క్రీస్తుశకం 1268 లో అప్పటి హొయసల సేనాధిపతి సోమనాథుడిచే నిర్మించినబడిన చెన్నకేశవుని ఆలయం ఇది. వెంటనే కొద్దిమంది మిత్రులతో కలిసి అక్కడికి బయలుదేరాం.

ఇసుకరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం అది. హొయసల వాస్తుశిల్ప నైపుణ్యాలకు అడ్డం పడుతుంది. 

చెన్నకేశవ అంటే “అందమైన కేశవుడు” అని అర్ధం. ఈ గుడి విష్ణువు యొక్క మూడు అవతారాలైన కేశవ, జనార్ధన, వేణుగోపాలులకి అంకితం చేయబడింది. ప్రధానఆలయం నక్షత్రాకారంలో ఉన్న మండపంపై నిర్మించబడగా ఈ ఒక్కో అవతారానికి ఒక్కో గర్భగుడి నిర్మించబడింది. దీనితో పాటు 64 చిన్న చిన్న మందిరాలు ప్రాంగణమంతా నిండి ఉన్నాయి. ప్రధానాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం నిండా రామాయణ, మహాభారత, భాగవత పురాణాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ పైకప్పులు కూడా ఎంతో అందమైన శిల్పాలతో తామరపువ్వు ఆకారంలో రూపొందించబడింది.  

ఈ ఆలయం నిర్మించడానికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని చెబుతారు. అయితే విదేశీయుల దురాక్రమణ ఫలితంగా నిర్మాణం పూర్తయిన ఈ ఆలయంలోకేవలం 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే పూజలు జరిగాయి. ఆలయం, లోపలి విగ్రహాలు దెబ్బతినడంతో సంప్రదాయం ప్రకారం పూజలు నిలిపివేశారు. 

పూజా పునస్కారాలు నోచుకోని ఆలయమైనా దాదాపు ఏడువందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతో దృఢంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ ఆలయ భారతా పురావస్తు పరిశోధక సంస్థ అధీనంలో ఉండడంతో శుభ్రంగా, పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంది. టాయిలెట్లు కూడా పరిశుభ్రంగానే ఉన్నాయి.

మేము అక్కడకి చేరుకోగానే ప్రవేశ రుసుము వసూలు చేసే కౌంటర్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. దానికి బదులుగా టికెట్ ఇరవై రూపాయలనీ, అక్కడ ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేసి, రుసుము ఆన్లైన్ చెల్లించాలనీ సూచిస్తూ ఫ్లెక్సీ బోర్డులు ఉన్నాయి. అక్కడ దాదాపు ఆరు యాత్రికుల బృందాలు ఉన్నాయి. ఏ ఒక్కరికీ ఆ కోడ్ స్కాన్ కాలేదు. మేము ఆ స్కాన్ తో అలా కుస్తీ పడుతుండగానే ఒక పది నిముషాల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అది పని చేయడం లేదని పురావస్తు శాఖ వారి వెబ్సైటు లో లాగిన్ అయ్యి ప్రవేశరుసుము చెల్లించాలని చెప్పాడు. మేము ఎంతో శ్రద్ధగా ఆ పని మొదలుపెట్టాం. అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేదు. ఆ సైట్ కూడా ఎంతో నెమ్మదిగా లోడ్ అవుతుంది. ఎలాగూ నా స్నేహితులు ఒకరు లాగిన్ అయ్యారు. బృందంలోని ప్రతి ఒక్కరి పేరూ ఒక్కడా రాయాలి.ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వారి ఆధార్ లేదా పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అవన్నీ చేసి నా స్నేహితురాలు రుసుము చెల్లించడానికి ఎంటర్ నొక్కగానే ఇక అది ఒక లూప్ లో తిరుగుతూనే ఉంది తప్ప ఇంతకీ పేమెంట్ పూర్తి కాలేదు. మేము చుట్టూ చూస్తే మిగిలిన యాత్రికుల బృందాలది కూడా అదే పరిస్థితి. డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వగలరా అని అక్కడ గార్డ్ ను అడిగితే అందుకు వీలులేదు అని స్పష్టంగా చెప్పారు. అప్పటికి ఏదో ఒక బృందంలో ఒకరు ఆన్లైన్లో టిక్కెట్లు కొనుక్కోగలిగారు. మేము డబ్బులు చెల్లిస్తాము మాకు కూడా టిక్కెట్లు బుక్ చేయండని అతనిని బ్రతిమిలాడాము. ఆయన పాపం ఎంతో మందికి అలా చేసి ఇచ్చారు.

ఇదంతా దాదాపు ఇరవై నిముషాలు పట్టింది. ఎంతో విసుగు తెప్పించింది. 

ఇక లోపలి వెళ్లి ఆ అద్భుతమైన కట్టడాన్ని చూడగానే ఆ విసుగు అంతా దూరమయ్యింది అనుకోండి. 

అయితే నేను చెప్పదలుచుకున్న విషయమేమంటే ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించాలనుకునే వారందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిందేనా? డిజిటల్ లిటరసీ పక్కన పెట్టండి ఇంకా సంపూర్ణ అక్షరాస్యతే సాధించలేని దేశంలో ఇది అటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అవరోధం కాదా? చాలా మంది వృద్ధులకు ఈ స్కాన్ చేసి డబ్బు చెల్లించే పద్ధతి తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ఇది ఒకరకంగా వారి పట్ల వివిక్ష చూపించడం కదా? సైట్ దగ్గర వైఫై పనిచేయకపోతే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు వెనక్కి వెళ్లాల్సి రావడం ఎంత అన్యాయం? అంతేకాకుండా టికెట్ కొనుక్కునేందుకు ప్రతి ఒక్కరి పేరు రాయవలసిన అవసరం ఏమిటి? కొనేవారి ఆధార్ నెంబర్/ పాన్ కార్డు నెంబర్ ల అవసరం ఏమిటి? ఆ సమాచారం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పౌరుల జీవితాలను సులభతరం చేయడం. ఇక్కడి పద్ధతి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకవేళ సాంకేతికతను మరింతగా ముందుకు తీసుకువెళ్లడమే దీని ఉద్దేశమైతే డిజిటల్ పేమెంట్ చేసేవారికి ఒకరకమైన రుసుము (ఇరవై రూపాయలు) , నేరుగా కొనుక్కునేవారికి ఒకరకంగా రుసుము (ఇరవై ఐదు రూపాయలు) నిర్ణయించవచ్చు. ఆ విధంగా డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయొచ్చు. అంతేకానీ అసలు నేరుగా కొనుక్కునే అవకాశం లేకుండా చేయడం వలన డిజిటల్ పేమెంట్ చేయలేని వారికి ప్రవేశం కఠినతరం చేయడం కాదా. ఒకరకంగా ఇది వారి హక్కులకు భంగం కలిగించడం కాదా? అంతేకాకుండా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరించడం కూడా ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు. 

ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శించుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేయాల్సి రావడం ఎంతవరకు సమంజసం?

Blog post 45

–Based on a post by Meena

అదా లవ్ లేస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో మార్గదర్శి: Ada Lovelace

నేను చదివే వార్తా పత్రికలో ప్రతి బుధవారం టెక్నాలజీ కి సంబంధించిన వార్తల కోసం కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. అందులో టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన యువత గురించి, ముఖ్యంగా యువతుల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా నాకు అదా లవ్ లేస్ గుర్తువస్తూ ఉంటుంది. ఈ రోజు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో 19 వ శతాబ్దపు తొలినాళ్లలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ లో తనదైన ముద్ర వేసింది లవ్ లేస్.

ఈ రోజు మనందరం విరివిగా ఉపయోగిస్తున్న కంప్యూటింగ్ సైన్స్ కు పునాది వేసింది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అనీ, అందునా ఒక స్త్రీ అనీ ఎంతమందికి తెలుసు? అదా లవ్ లేస్ కంప్యూటర్ ల గురించి, భవిష్యత్తు ప్రపంచంలో వాటి ప్రాముఖ్యతను గురించీ ఎన్నో ఏళ్ళ క్రితమే అంచనా వేసిన దార్శనికురాలు. అదా లవ్ లేస్ అని పిలవబడే అగస్టా అదా బైరన్ 1815 డిసెంబర్ 10 న లండన్ లో జన్మించింది. అద్భుతమైన కవిగా మనందరికీ తెలిసిన జార్జ్ గోర్డాన్ అలియాస్ లార్డ్ బైరన్, ప్రముఖ గణితవేత్త అన్నబెల్లా మిల్బంకే ల కూతురే అదా.

గొప్ప కవే అయినా పిచ్చివాడిగా పేరు తెచ్చుకున్న బైరన్ కూ గణిత మేధావి అయిన అతని భార్యకూ మధ్య వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. అదా పుట్టిన నెలరోజులకు అన్నబెల్లా లండన్ లోని బైరన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తన కూతురి మీద అతని ప్రభావం పడకూడదని, అతని కవిత్వ వారసత్వం, అతని పిచ్చి లక్షణాలు ఆ అమ్మాయికి కూడా అంటకూడదనీ, ఈ ఊహాత్మక కళాజీవనానికి భిన్నంగా ఆ అమ్మాయి గణితం, సంగీతం, సైన్స్ లలో రాణించాలని ఆ తల్లి కోరిక.

అదా తండ్రి బైరన్ కూడా ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉండగానే లండన్ వదిలి వెళ్ళిపోయాడు. అదాకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా గ్రీస్ లో ఆయన చనిపోయాడు. అదా కు ఆయనతో పరిచయమే లేదు. తన అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. ప్రైవేట్ టీచర్లు తనకు వ్యక్తిగతంగా చదువు చెప్పేవారు. చిన్నతనం నుండీ ఆ అమ్మాయి అనారోగ్యాలతో బాధపడేది. దానితో ఇంటిలోనే చదువు కొనసాగింది.

అదా కు చిన్నప్పటి నుండే యంత్రాలంటే ఆసక్తి. సైన్స్ పత్రికలు విపరీతంగా చదివేది. అయితే తన తండ్రికి ఉన్నట్లు ఊహాశక్తి కూడా ఎక్కువే. తన 12 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఎగరాలి అనే కోరిక కలిగింది. అది కలగా మిగిలిపోలేదు. చాలా పద్ధతిగా పక్షులు, వాటి రెక్కల మీద పరిశోధనలు చేసి రకరకాల పదార్ధాలతో రెక్కలను తయారు చేసేది. తాను చేసిన పరిశోధనకు ‘ఫ్లయాలజీ’ అని పేరు పెట్టింది. ఈ పరిశోధనంతటికి గానూ తన తల్లి నుండి ఎన్నో చివాట్లు కూడా తింది.

1833 లో లండన్ లో జరిగిన ఒక పార్టీ లో ఆమెను ప్రముఖ గణిత మేధావి చార్లెస్ బాబేజ్ కు ఎవరో పరిచయం చేశారు. బాబేజ్ తాను కొత్తగా సృష్టించిన పరికరాన్ని గురించి ఆమెకు వివరించారు. దానిలో అంకెలు వేసి ఉన్న చక్రాన్ని ఒక హేండిల్ సహాయంతో ఖచ్చితమైన లెక్కలు చేయవచ్చు. దీనిని ఆయన ‘డిఫరెన్స్ మెషిన్” అని పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ పరికరాన్ని స్వయంగా చూసేందుకు గానూ అదా తల్లి ఆ అమ్మాయిని బాబేజ్ ఇంటికి తీసుకుని వెళ్ళింది. అయితే అది అసంపూర్తిగా ఉన్నట్లు అదా గ్రహించింది. దానిని ఇంకా ఎలా మెరుగ్గా చేయవచ్చో సూచిస్తూ బాబేజ్ తో అనేక చర్చలు జరిపింది. అలా మొదలైన వారిద్దరి స్నేహం జీవితాంతం కొనసాగింది. బాబేజ్ కు అప్పటికే నలభై సంవత్సరాలు. భార్యను కోల్పోయారు. అదా ఉత్సాహవంతమైన యువతి. ఆ అమ్మాయిలోని ప్రతిభను గుర్తించిన బాబేజ్ ఆమెను ఎంతో ప్రోత్సహించారు.

తన 19 ఏళ్ళ వయసులో అదా ధనిక కుటుంబానికి చెందిన విలియం కింగ్ ను వివాహమాడింది. వారికి ముగ్గురు పిల్లలు. 1838 లో అదా అతని లవ్ లేస్ కుటుంబ వారసురాలిగా లేడీ అదా కింగ్ గా హోదా పొందింది. అప్పటి నుండి ఆమెను అదా లవ్ లేస్ అని పిలిచేవారు.

ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొక వైపు అదా తన గణిత పరిశోధనలపైన కూడా ద్రుష్టి పెట్టింది. మరొక మహిళా గణిత మేధావి మేరీ తో ఆమెకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అనేక గణిత విషయాలతో పాటు చార్లెస్ బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ మెషిన్ గురించి కూడా చర్చించుకునేవారు. 1841 లో లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ అయినా ఆగస్టస్ డెమోర్గన్ ఆమెకు ఒక ఉన్నతమైన ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే మేరీ తో కలిసి అడ్వాన్సుడ్ మాథెమాటిక్స్ నేర్చుకుంటూనే ఉండేది. డిఫరెన్స్ మెషిన్ ఎప్పుడూ ఆమె ఆలోచనలలోనే ఉండేది.

ఆ సమయంలో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అదా దానిలో కీలక పాత్ర పోషించింది. ఆ ఇంజిన్ కు సంబంధించి అదా ఒక పేపర్ కూడా రాసింది. అందులో దాని పనితీరును సోదాహరణంగా క్లుప్తంగా వివరించింది. మెషిన్ కోడ్ ద్వారా బాబేజ్ తయారు చేసిన యంత్రం ఎలా ఒక వరుసలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుందో ఆమె అందులో వివరించింది. ఈ పేపర్ లోనే ప్రపంచంలోనే తొలిసారిగా అల్గోరిథం లేదా కంప్యూటర్ ప్రోగ్రాం ను ఆమె పరిచయం చేసింది. ఆ విధంగా చూస్తే ఆమె తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకోవచ్చు.

కంప్యూటింగ్ లో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేసి అదా లవ్ లేస్ నూతన శకానికి తెరతీసింది. అనలిటికల్ ఇంజిన్ కేవలం అంకెలు, లెక్కలకు సంబంధించినది కాదు అని తాను గుర్తించింది. అది కేవలం కాలిక్యులేటర్ కాదు అని గణితానికి మించి ఎన్నో విషయాలలో మనిషికి తోడ్పడగలదని గుర్తించింది. ఉదాహరణకు మ్యూజిక్ కంపోసింగ్ లో కూడా అది సహాయపడగలదు.

1852 లో తన 36 ఏళ్ళ వయసులో అదా మరణించింది. ఆ తర్వాత వందేళ్లకు గానీ ఆమె అనలిటికల్ ఇంజిన్ పై రాసిన నోట్స్ బయటపడలేదు. 1940 లో ఆధునిక కంప్యూటర్లపై అలాన్ టూరింగ్ చేసిన కృషికి స్ఫూర్తి లవ్ లేస్ రాసిన నోట్స్ అంటే ఆమె ఎంత దార్శనికురాలో అర్ధం అవుతుంది. 1979 లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు కొత్తగా రూపొందించిన కంప్యూటర్ లాంగ్వేజ్ కు అదా గౌరవార్ధం ఆమె పేరునే పెట్టారు.

సైన్స్, టెక్నాలజీ రంగాలలోకి అడుగుపెట్టేందుకు ఇప్పటికీ అమ్మాయిలు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో అదా వంటి తొలితరం శాస్త్రవేత్తలను గుర్తు చేసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

Post 44

–Based on a piece by Mamata

మంత్ర ప్రపంచానికి తీసుకుపోయే కథలు: Gijubhai Badheka

నవంబర్ 14 మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాము అని మనందరికీ తెలుసు. ఆ రోజున దేశవ్యాప్తంగా పిల్లలకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాటిలో చాలావరకూ కథలు, ఆటల చుట్టూ తిరిగేవే.
ఈ ఏడాది గుజరాత్ ప్రభుత్వం పిల్లల జీవితంలో కథల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవం (బాలవర్త దిన్) గా ప్రకటించింది.
నవంబర్ 15 గుజరాత్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, కథా రచయిత అయిన గిజుభాయి బదేక జయంతి. బాల సాహిత్య బ్రహ్మ అని ప్రేమగా అందరూ పిలుచుకునే గిజుభాయి ఎంతో సుసంపన్నమైన బాల సాహిత్య నిధిని భవిష్యత్తు తరాలకు అందించారు. ఈయన కథలను తమ తల్లిదండ్రుల నుండి, తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుండి పెరిగిన ఈ తరం పిల్లలు ఎందరో ఉన్నారు. 

1885 లో జన్మించిన గిజుభాయి ఒక జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1920 ల ప్రాంతంలో తన కొడుకు పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు.  భావనగర్ లోని దక్షిణామూర్తి విద్యాసంస్థలలో చేరి మాంటిస్సోరీ మేడం నుండి పొందిన స్ఫూర్తితో విద్యార్థి కేంద్రక విద్యపై ఎంతో కృషి చేశారు. ఈ రంగంలో తన అనుభవాలు 1920 లో దక్షిణామూర్తి బాలమందిర్ ఏర్పాటుకు దోహదపడ్డాయి. పిల్లలతో ఆయన చేసిన చర్చల వలన వారు ఏవైనా విషయాలను నేర్చుకోవాలంటే కథల ద్వారా చెబితే ఎంత ప్రయోజనకరమో ఆయన అర్థం చేసుకున్నారు. దానితో అనేక నేపథ్యాలకు చెందిన పిల్లల కథలను సేకరించడం, స్వయంగా కథలు రాయడం, చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల సంపూర్ణ వికాసానికి తోడ్పడేది కథలే అని ఆయన బలమైన నమ్మకం.
ఆ సమయంలో గుజరాతీ భాషలో బాలసాహిత్యం ఎక్కువగా లేదు. పిల్లవాడిని ఒక సంపూర్ణ వ్యకిగా గుర్తించి వారికోసం ప్రత్యేకమైన వనరులను, సాహిత్యాన్ని సృజించిన గుర్తింపు గిజుభాయికే దక్కుతుంది. 


వార్తను శాస్త్ర అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: పిల్లల కథ అని పేరు పెట్టిన ప్రతి కథా పిల్లల కథ కాలేదు. ఏ కథ నుండి అయితే పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారో అదే నిజమైన పిల్లల కథ. పిల్లలకు సరళంగా, క్లుప్తంగా ఉండే కథలు కావాలి. వారి చుట్టూ ఉన్న పరిసరాలు కథలలో ప్రతిబింబించాలి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పాటలు ఉంటే వారికి గుర్తు పెట్టుకోడానికి సులభంగా ఉంటాయి. అందుకే అవి పిల్లల కథలలో భాగం కావాలి.
అయితే ఆ సమయంలో ఇటువంటి కథలు ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే జానపద సాహిత్యంలో అలాంటి కథల్ని గుర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దక్షిణామూర్తి సంస్థలోని ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న విద్యార్థులను వారి వారి ఇండ్లలో, గ్రామాలలో, పరిసరాలలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల జానపద కథలను సేకరించమని కోరారు. 
వార్తనుశాస్త్ర లో ఆయన ఇలా రాశారు. జానపద సాహిత్యాన్ని వెతకాలంటే నువ్వు పట్టణాన్ని వదిలి గ్రామాలకు, అక్కడి నుంచి అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్ళాలి. పళ్లూడిన ఒక బామ్మ తన పనులు ముగించుకుని కూర్చోగానే పిల్లలు చుట్టూ చేరినప్పుడు చెప్పే కథలు వినాలి. అవి బామ్మ పంచిన ప్రసాదంలాగా పిల్లల నుండి పిల్లలకి మొత్తం ఊరంతా చేరిపోతాయి. 


గిజుభాయి, ఆయన సహోద్యోగులు అటువంటి కథల కోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టారు. ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు సేకరించారు. వాటిని ఆయన తనదైన శైలిలో చిన్న చిన్న వాక్యాలలో, పదాలతో ఆటల రూపంలో, సంభాషణల రూపంలో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.


ప్రతి ఉదయం పిల్లలకు ఒక కథ చెప్పేవారు ఆయన. ఆ కథను పిల్లలు మధ్యాహ్నానికి నాటకం రూపంలో చూపించాలి. కొద్ది రోజులలోనే పిల్లలు ఎలా తయారయ్యారు అంటే పదాలను తేలికగా గుర్తుపెట్టుకునేవారు. వారి నోటి వెంట ప్రాస అలవోకగా వచ్చేసేది. కథ మధ్యలో మర్చిపోతే వారే ఏదో ఒక కథను అల్లేసే వారు. అందుకే ఆయన ఇలా రాశారు: నువ్వు కొంతమంది పిల్లలను పోగేసి వారికి ఒక కథ చెప్పావంటే వారు నీకు పది కథలు చెబుతారు.


కథల కోసం, జానపద సాహిత్యంకోసం గిజుభాయి పరిశోధన రాష్ట్రాన్ని దాటి దేశమంతా విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఎంతో బాల సాహిత్యాన్ని సేకరించి వాటిలోని సారూప్యతలను, వైవిధ్యాలను గుర్తించారు. వాటికి గుజరాతీ స్థానికతను జోడించి తిరిగి రాశారు. అవి గుజరాతీ కథలుగా, గిజుభాయ్ కథలుగా పేరుపొందాయి. 


గిజుభాయి కథలు ఎంతో సరళంగా, ప్రాసతో కూడి ఉంటాయి. అందుకే అవి వినేవారిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఆయన కథలలో పిల్లలకు తెలిసిన జంతువులు, పక్షులు ఉంటాయి. అవి మనుషుల్లా మాట్లాడుతూనే తమవైన జంతు లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, జంతువులకు మధ్య సంబంధాలు, సంభాషణలు పిల్లలను విస్మయానికి గురిచేసి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కథలలో రాజులు, రాణులు, రాజకుమారులతో పాటు సాధారణ దర్జీలు, మంగలులు, కుమ్మరులు కనపడతారు. మానవ సహజమైన బలాలు, బలహీనతలను, దురాశను, అసూయను ఈ పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. చాలా కథలు అనగనగా అంటూ మొదలై చివరికి సుఖాంతమవుతూ వందేళ్ల తర్వాత కూడా అనేక తరాల పిల్లలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. 


గిజుభాయి జన్మదినాన్ని, ఆయన కథలను గుర్తు  చేసుకునేందుకు నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పిల్లలంతా డిజిటల్ పరికరాలకు అతుక్కుని పోతున్న ఈ రోజుల్లో పిల్లలకే కాదు పెద్దవారికి కూడా కథలు చెప్పడంలోని ఆనందాన్ని గుర్తు చేసేందుకు కనీసం ఒక రోజైనా ఉండాలేమో.


నా తోటి పెద్దలకు ఒక విన్నపం. ఎన్నో కథలు మనకు ఉన్నాయి. వాటిని మీ పిల్లలకు చెప్పండి. అందంగా, పూర్తిగా వాటిలో లీనమై చెప్పండి. పిల్లలు కూడా అంతే లీనమై ఆనందిస్తారు. వారికేదో జ్ఞానాన్ని అందివ్వాలని కథ చెప్పకండి. ఏ ఉద్దేశ్యంతోనూ కథను మొదలుపెట్టకండి. కథలోకి వెళుతూ పిల్లలను మీతో పాటు దానిలోకి తీసుకుని వెళ్ళండి. ఒక మంత్ర ప్రపంచం మీ ముందు నిలుస్తుంది. మీ పిల్లలతో కలిసి అందులో వివరించండి. ఆస్వాదించండి.


మీ పిల్లలతో మంచి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నారా? కథలతో ప్రారంభించండి

Post 44

Based on a piece by Mamata

కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీల పర్యావరణ సదస్సు: COP 26

గత కొద్ది వారాలుగా పేపర్లలో, వార్తలలో కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP) సదస్సుకు సంబంధించిన విషయాలే ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. గ్లాస్గో లో ఈ సదస్సు జరుగుతుందనీ, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారనీ మనందరికీ తెలుసు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు మన భూగోళం యొక్క, మానవాళి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని కూడా తెలుసు.

అసలు ఈ కాప్ అంటే ఏమిటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఈ కాప్ పూర్తిపేరు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCC) పై సంతకం చేసిన దేశాలన్నింటినీ కలిపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. వాతావరణ మార్పులపై ఆ సంతకం చేసిన దేశాలన్నిటి మధ్య ఒప్పందాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఒప్పందం 1992 లో రియో లో జరిగిన సదస్సు నుండి అమలులోకి వచ్చింది. ఈ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ద్వారా వాతావరణ మార్పులను ఒక సమస్యగా ఈ దేశాలు గుర్తించి, దాని పరిష్కారానికై అందరూ కలిసి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. అయితే ఖచ్చితమైన ప్రణాళిక ఏదీ ఈ ఒప్పందంలో పొందుపరచలేదు. వివిధ దేశాలు, ప్రాంతీయ స్థాయి అనుబంధ సంస్థలు ఈ సమస్య దిశగా చేసిన ప్రయత్నాలను ఆమోదించడం మాత్రమే ఈ ఫ్రేంవర్క్ లో భాగంగా ఉంది.

అయితే వాతావరణ మార్పులపై పరిజ్ఞానం పెరిగి సమాచారం విస్తృతమయ్యే కొద్దీ ఈ దేశాలమధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ ఫ్రేంవర్క్ మరింత మెరుగైంది. ఖచ్చితమైన ఒప్పందాలు, ప్రొటొకాల్స్, బాధ్యతలు నిర్వచించబడ్డాయి. క్యోటో ప్రోటోకాల్, పారిస్ అగ్రిమెంట్ వంటి ఖచ్చితమైన ఒప్పందాలు దేశాలమధ్య కుదిరింది UNFCC ఫ్రేంవర్క్ ఆధారంగానే. వీటన్నిటినీ ప్రతి ఒక్క దేశమూ సంతకం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అదే అత్యంత కీలకమైన అంశం. మంచి ఆకాంక్షలతో నిండిన పత్రాలపై సంతకాలు చేయడం సులభమే. పత్రాలలో ఉన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండడం ఏమంత తేలికైన అంశం కాదు. దానికి వివిధ స్థాయిలలో నిబద్ధత అవసరం.

UNFCC ను 1992 లో జూన్ 4 న జరిగిన రియో సదస్సులో కాప్ సభ్యుల ఆమోదానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1994 మార్చ్ 21 నుండి అమలులోకి వచ్చింది. 1992 జూన్ 10 న భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసి 1993 నవంబర్ లో దానిని ఆమోదించింది.

COP 26

ఇప్పటికి మొత్తం 197 పార్టీలు (196 దేశాలు, ఒక ప్రాతీయ ఆర్ధిక అనుసంధాన సంస్థ) ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే మాటలో ఉన్న పార్టీలు ఇవే. UNFCC కి సంబంధించిన ఏ ప్రధాన నిర్ణయమైనా ఈ పార్టీలే తీసుకుంటాయి. ఇందులో భాగంగా ఉన్న దేశాలు వాటిని అమలు చేసే బాధ్యతను కలిగిఉంటాయి.

ఈ కాప్ ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. ఒప్పందం అమలులోకి వచ్చిన మొదటి ఏడాది అయిన 1995 లోనే బాన్ లో మొదటి సమావేశం జరిగింది. కాప్ అధ్యక్ష పదవి ఐదు ఐక్యరాజ్యసమితి ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. మనదేశంలో 2002 లో న్యూ ఢిల్లీ లో ఎనిమిదవ కాప్ సమావేశం జరిగింది.

ఒప్పందంలో భాగంగా ఉన్న పార్టీలే కాకుండా ఇతర దేశాలు కూడా ఈ సమావేశాలకు హాజరవుతాయి. వీరే కాకుండా పత్రికలు, మీడియా కు సంబంధించిన ప్రతినిధులు, ఇతర పరిశీలనా సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు కూడా ఈ పరిశీలనా సంస్థల కేటగిరీ లో ఉన్నాయి.

ఇప్పుడు గ్లాస్గో లో జరుగుతున్న సదస్సుకు రిజిస్టర్ చేసుకున్న మొత్తం ప్రతినిధుల సంఖ్య 40000. 2019 లో జరిగిన కాప్ 25 సదస్సుకు హాజరయిన ప్రతినిధుల సంఖ్యకు దాదాపుగా ఇది రెట్టింపు. అయితే రిజిస్టర్ చేసుకున్న వారిలో చాలామంది ఆయా దేశాలలో ఉన్న కోవిద్ నిబంధనల వలన సమావేశానికి హాజరుకాలేనట్లు తెలుస్తుంది.

రిజిస్టర్ చేసుకున్న ప్రతినిధులు అందరూ హాజరవలేదు అనే విమర్శతో పాటు మరొక విమర్శ కూడా ఈ సదస్సు ఎదుర్కొంటుంది. సదస్సు పూర్తయ్యే నాటికి సాధించిన ప్రగతి కానీ, చర్చించిన అంశాలు కానీ పెద్దగా లేవు. ఇదేదో రెండు వారాల వేడుక లాగా ఉంది అని గ్రేటా థున్బర్గ్ బాధపడిందంటే ఆ సదస్సు నిర్వహణలో నిబద్ధత ఎంతగా లోపించింది అనేది అర్ధమవుతుంది.

అయితే మన స్థాయిలో ఈ దేశాలన్నీ కలిసి ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటాయేమో అని ఆశపడటం తప్ప చేసేదేమీలేదు. అయితే వ్యక్తిగతంగా పర్యావరణ మార్పులు తెచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు చేయదగిన చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అవి మనందరికీ తెలియనివి కావు. మన స్థాయిలో మనం వాటిని అమలు చేయడమే ఇప్పుడు చేయదగినది.

Post 42

Based on a piece by Meena

పట్టణాలలో ఒయాసిస్సుల లాంటి కంటోన్మెంట్లు: Cantonments

ఈ మధ్య 2017 లో ప్రచురించబడిన ‘కంటోన్మెంట్లు: ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ హెరిటేజ్ టు మోడర్నిటీ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని చూసాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల భూమికి సంబంధించిన వివరాలు, వాటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. 

Coffee table book on Indian Cantonments
A Coffee table book on Indian Cantonments

ఫ్రెంచ్ పదం అయిన కాంటన్ నుండి ఈ కంటోన్మెంట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏవైనా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలోనో, శీతాకాలం లోనో సైనిక దళాలు నివసించేందుకు తాత్కాలికంగా విడిది ఏర్పాట్లు చేసిన ప్రాంతాలనే తొలుతగా కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అయితే దేశాల మధ్య దాడులు జరిగి ఒక దేశం మరొక దేశాన్ని పాలించే సందర్భంలో తమ సైన్యం కోసం శాశ్వతంగా కొన్ని ఆవాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకునేవారు. భారతదేశంతో సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో వీటిని కంటోన్మెంట్లు అని పిలిచేవారు. అమెరికాలో కూడా కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరాలు అనే అర్థంలోనే వాడతారు. దాదాపు 250 ఏళ్ళ క్రితం దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న కాలంలో బారాకపూర్ ప్రాంతంలో దేశంలో తొలి కంటోన్మెంట్ (బీహార్ లోని దానాపూర్ దగ్గర ఉన్నదీ తొలి కంటోన్మెంట్ అని కొందరు అంటారు) ఏర్పాటు అయింది. 18 వ శతాబ్దం నాటికి వాటి సంఖ్య బాగా పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వారి పరిమాణం, వాటిలో నివసించే జనాభా ఆధారంగా వీటిని మొత్తం నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఈ అన్ని కంటోన్మెంట్లు కలిపి రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. మిలిటరీ స్టేషన్ లలో కేవలం సాయుధ మిలిటరీ దళాలు మాత్రమే నివసిస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలలో మిలిటరీ దళాలు, సాధారణ పౌరులు కలిసి నివసిస్తుంటారు. కంటోన్మెంట్లు అన్నీ 2006 కంటోన్మెంట్ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో పాటు నామినేట్ చేయబడిన ప్రతినిధులు కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారిక బాడీ లో సభ్యులుగా ఉంటారు.

నేను చూసిన పుస్తకంలో దేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఎన్ని వైవిధ్యమైన ప్రాంతాలలో మన కంటోన్మెంట్లు ఏర్పడ్డాయో ఈ పుస్తకం చూసి అర్ధం చేసుకోవచ్చు.

కంటోన్మెంట్ల గురించి ఇంతకు ముందు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఉదాహరణకు, కుంభ మేళా జరిగే సంగమ ప్రాంతం అలహాబాద్ లోని ఫోర్ట్ కంటోన్మెంట్ కు చెందిన ప్రాంతం. కుంభమేళాల సమయంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత నిర్వహణా బాధ్యతను తన పరిధిలోకి తీసుకుంటుంది. తాజ్ మహల్ ను చూసేందుకు మనమందరం వెళ్లే ఆగ్రా ఫోర్ట్ కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది. అలహాబాద్ కంటోన్మెంట్ లో శాసనాలతో కూడిన అశోకుని స్థూపం ఉంది. ఈ స్థూపానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిపైనా అశోకుని శాసనాలతో పాటు నాలుగవ శతాబ్దానికి చెందిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుని శాసనాలు కూడా ఉన్నాయి. అహ్మద్ నగర్లో, బెల్గాంలో, కన్ననోరే లో ఉన్న కోటలు అన్నీ కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలోనే ఉన్నాయి.  

మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహౌ కంటోన్మెంట్ ప్రాంతంలోనే జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మలోజి సక్పాల్ బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈ కంటోన్మెంట్ ను డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్నారు. ఈ కంటోన్మెంట్ లో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం కూడా ఉంది. పాలరాతితో చేసిన ఈ భవనంలో ఈ అసమాన నాయకుని జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శన జరుగుతుంది.

గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కూడా అల్మోరా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంతో సమయం గడిపారనీ, తన గీతాంజలి తో సహా ఎన్నో రచనలను ఇక్కడ నివసిస్తున్నప్పుడే రచించారని అంటారు. ఆయన నివసించిన భవనాన్ని ఇప్పుడు టాగోర్ హౌస్ అని పిలుస్తున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాలలో కొన్ని అద్భుతమైన భవనాలు కూడా ఉన్నాయి. హుగ్లీ ఒడ్డున 1828 లో నిర్మించిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ భవనం ఇప్పుడు బెంగాల్ గవర్నర్ కు బారక్పూర్ విడిదిగా ఉంది. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం కూడా కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఉంది.

మద్రాస్ వార్ సిమెట్రీ, కిర్కీ వార్ సెమెట్రీ, ఢిల్లీ వార్ సిమెట్రీ వంటి అనేక యుద్ధ స్మారకాలు కూడా కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక కంటోన్మెంట్లలో ఉన్న చర్చీలు, గుడులు, మసీదుల సంఖ్య లెక్కకట్టలేము.

షిల్లాంగ్, రాణిఖేత్ ప్రాంతాలలోని కంటోన్మెంట్ లు జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా అలరారుతున్నాయి. దానాపూర్ కంటోన్మెంట్ లో ప్రత్యేక రుతువులలో ఎన్నో వలస పక్షులు విడిది చేస్తుంటాయి.

మనం అందరం దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కంటోన్మెంట్ ప్రాంతం గుండా ప్రయాణించడమో, అక్కడ నివసించడమో, సందర్శించడమో చేసే ఉంటాము. ఎంతో శుభ్రంగా, పద్ధతిగా నిర్వహించబడే ఈ ప్రాంతాలు కాలుష్యంతో నిండిన పట్టణ ప్రాంతంలో ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తాయి. అయితే వీటి నిర్వహణలో సమస్యలు లేకపోలేదు, ఎన్నో విమర్శలూ లేకపోలేదు. అవి వలసవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఒక ముఖ్యమైన విమర్శ కాగా కంటోన్మెంట్ ప్రాంతాల రోడ్లను సాధారణ ప్రజానీకం వినియోగించుకోలేకపోవడం మరొక సమస్య. ఈ కంటోన్మెంట్ లలో నివసించే సాధారణ ప్రజానీకానికి ఇంటి రుణాలు తీసుకునేందుకు, ప్రభుత్వ హౌసింగ్ పధకాలను వినియోగించుకునేందుకు వెసులుబాటు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉంది.

డిఫెన్స్ శాఖ నియంత్రణలో ఉన్న భూముల నిర్వహణా వ్యయాల మీద తరచుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆర్మీ కూడా ఒక సందర్భంలో ఈ ప్రాంతాల నిర్వహణకు ఇంత ఖర్చు చేయడం గురించి పునరాలోచించిన దాఖలాలు ఉన్నాయి. 2021 లో ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఈ కంటోన్మెంట్ ప్రాంతాల రద్దు మీద ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన కూడా వెలువడింది. 

వీటిని బట్టి చూస్తే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలు భవిష్యత్తులో అంతర్ధానమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని రద్దు చేయడం కాకుండా వీటి నిర్వహణా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి, వాటిలో నివసించే అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా నిర్వహణ చేసినట్లయితే పట్టణ ఆవాసాల నిర్వహణ కు సంబంధించి కంటోన్మెంట్ లు ఆదర్శంగా నిలుస్తాయి అని నాకు అనిపిస్తుంది.

Post 41

Based on a piece by Meena

మన బంగాళాదుంపల కథ: Portrait of a Potato

కాలరీల గురించి లక్ష్యపెట్టకుండా బంగాళాదుంపలను ఇష్టంగా తినేవారిలో నేను ఒకదానిని. వాటి మీద ఉన్న ఇష్టం వల్లనేమో పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అనే పోటీ జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. 2020 లో ఈ పోటీలు ప్రారంభమయితే 2021 సంవత్సరానికి పోటీల ఫలితాలు మొన్న ఆగస్టులో వెలువడ్డాయి. గెలుపొందిన ఫోటోలను చూస్తే ఆ ఫోటోగ్రాఫర్ లు కూడా ఆ కూరగాయపట్ల ఎంతో ప్రేమతో, అభిమానంతో ఫోటోలు తీశారు అనిపించింది. కంటితో కవిత్వాన్ని చూస్తున్నట్లు అనిపించాయి.

Potato Photo Competition
One of the winners of the Potato Photo Competition 2021!

ఈ పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీకి మార్టిన్ పార్ వంటి ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ లు జడ్జీలుగా ఉన్నారు. దాదాపు రెండువేల పౌండ్ల విలువ గల బహుమతులు (ఒక లెన్స్ కిట్, కెమెరా కేసు, బ్యాక్ ప్యాక్, ఒక ఫోటోగ్రఫీ వర్కుషాప్ లో ఉచితంగా పాల్గొనే అవకాశం, కొన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్) విజేతలకు అందించారు. బంగాళాదుంపల మీద ప్రేమను ఇలా ఫోటోల రూపంలో వ్యక్తపరచడమే కాకుండా ఈ పోటీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు గా ఔత్సాహికులు చెల్లించిన మొత్తాన్ని (ఒక్కొక్కరు ఐదు పౌండ్లు) బ్రిటన్లో పేదల కోసం ఫుడ్ బ్యాంకు ను నిర్వహిస్తున్న ట్రుస్సెల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వడం మరొక మంచి విషయం.

దుంప జాతికి చెందిన ఈ మొక్కకు సోలనుమ్ ట్యూబేరోసుమ్ అనేది శాస్త్రీయనామం. నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలాలు పెరూవియన్-బొలీవియన్ ఆండిస్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహార పంటలలో ఒకటిగా ఉంది. బంగాళాదుంపలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, ప్రోటీన్, థయామిన్, నియాసిన్ అధికంగా లభిస్తాయి.

దాదాపు 1800 సంవత్సరాలకు పూర్వమే దక్షిణ అమెరికాలో ఇంకాలు బంగాళాదుంపల సాగును భారీస్థాయిలో ప్రారంభించారు. 16 వ శతాబ్దపు రెండవ భాగంలో దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానియార్డ్ లు వాటిని యూరప్ కు పరిచయం చేశారు. 17 వ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్ లో బంగాళాదుంపలే ప్రధాన పంటగా మారాయి. 18 వ శతాబ్దం చివరినాటికి జర్మనీ, పశ్చిమ ఇంగ్లాండ్ తో సహా ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాలలో దుంపలను భారీ స్థాయిలో పండించడం ప్రారంభించారు. ఐరిష్ ఆర్ధికవ్యవస్థ దాదాపుగా బంగాళాదుంపల సాగుపైనే ఆధారపడి ఉంది. 19 వ శతాబ్దం మధ్యలో దుంప చెట్లకు సోకే లేట్ బ్లెయిట్ వ్యాధి కారణంగా ఆ దేశం మొత్తం మీద బంగాళా దుంపలు ఎక్కువగా పండకపోవడంతో ఏర్పడిన బంగాళాదుంపల కరువు అక్కడి ఆర్ధిక వ్యవస్థను, జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

16 వ శతాబ్దం చివరిలో లేదా 17 వ శతాబ్దపు తొలినాళ్లలో మనదేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా మనదేశంలోకి కూడా బంగాళాదుంపలు మొదటిసారి ప్రవేశించాయి. ఇప్పుడు ప్రపంచంలో బంగాళాదుంపల సాగులో మనదేశం మూడవస్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలో దాదాపు 4.9 కోట్ల టన్నుల దుంపలు సాగు అయ్యాయి. ఈ బంగాళాదుంపలు మనకి ఆహారపదార్ధంగా ఉపయోగపడటమే కాక స్థానిక, అంతర్జాతీయ మార్కెట్ లలో మంచి ధరను అందిస్తూ రైతులకు మంచి ఆదాయమార్గంగా మారాయి.

పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా దేశంలో ప్రవేశించిన దుంపల సాగు మొదట్లో మలబారు తీర ప్రాంతానికే పరిమితమయ్యింది. బ్రిటిష్ వారి పరిపాలనలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సాగు విస్తరించింది. దేశంలో అప్పటివరకు స్థానికంగా సాగు అవుతున్న కూరగాయల స్థానంలో బ్రిటిష్ వారి ఆహారంలో ఎప్పటి నుండో భాగంగా ఉన్న బంగాళాదుంపల వంటి కూరగాయల సాగును ప్రోత్సహించాలని అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. దానితో వారు దుంపల సాగు గురించి ఎంతో ప్రచారం చేసి దేశంలోని మూలమూలకు దానిని చేర్చారు. రైతులకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి మరి దుంపల సాగుకు ప్రోత్సహించారు. అప్పట్లో దేశంలో వరిసాగులో తరచుగా సమస్యలు తలెత్తి పంటలు దెబ్బతింటుండటంతో రైతుల సమస్యలు తీరేందుకు వరి స్థానంలో బంగాళాదుంపల సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం అని కూడా వారు విస్తృతంగా ప్రచారం చేశారు.

ఏదేమైనా ఇప్పుడు బంగాళాదుంపలు లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అలా ఊహించడానికి ఇష్టపడను కూడా. 

ఒకవైపు పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అని పోటీలు నిర్వహిస్తూ దుంపలపై అభిమానాన్ని చాటుకుంటుంటే లక్కీ అడ్కిన్స్ వంటి కొందరు రచయితలు బంగాళాదుంపలపై కవిత్వాన్ని కూడా రాశారు.

మన దేశంలో పండే వివిధరకాల బంగాళాదుంపల జాతుల పేర్లు కూడా కవిత్వానికి తక్కువగా లేవు. కుఫ్రి జవహర్, కుఫ్రి చంద్రముఖి, కుఫ్రి సట్లెజ్, కుఫ్రి బాహర్, కుఫ్రి ఆనంద్, కుఫ్రి అశోక, కుఫ్రి ఫుఖ్రాజ్, కుఫ్రి సింధూరి, కుఫ్రి జ్యోతి, కుఫ్రి మేఘ, కుఫ్రి లువకర్, కుఫ్రి స్వర్ణ వంటివి ఆ పేర్లలో కొన్ని. ఈ కుఫ్రి అనే పేరు హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా బంగాళాదుంపలు పండించే కుఫ్రి ప్రాంతం నుండి వచ్చింది అనుకుంటాను. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన పరిశోధనా కేంద్రం కూడా ఈ కుఫ్రి ప్రాంతంలోనే ఉంది.

మన ఆహారంలో ఇంతగా భాగమయ్యి మన జిహ్వకి ఆహ్లాదాన్నందిస్తున్న ఈ బంగాళాదుంపల ప్రస్థానం మానవజాతి కొనసాగినంతకాలం కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తాను.

Post 40

Based on a piece by Meena

నేచురల్ హిస్టరీ మ్యూజియంల రూపశిల్పి డాక్టర్ నాయర్ కు నివాళి: Dr. SM Nair

కొన్ని రంగాలలో మార్గదర్శకులుగా చెప్పుకోదగిన వారు కొందరే ఉంటారు. ఎస్.యం. నాయర్ అటువంటి అరుదైన మార్గదర్శకులలో ఒకరు. మ్యూజియాలజీ అనేది ఇప్పటికీ అంతగా ఆదరణ లేని రంగమే. 1950 లలో పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లోనే కేరళలోని త్రివేండ్రంలో బి.ఎస్సీ పూర్తిచేసిన ఒక కుర్రవాడు బరోడా వరకు వెళ్ళి యం.ఎస్. యూనివర్సిటీ లో ఈ సబ్జెక్టు లో యం.ఎస్సీ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆశ్చర్యమే మరి. 

డాక్టర్ నాయర్ బరోడాలో తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకునిగా పని చేయడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బిట్స్ పిలానీలో మ్యూజియం స్టడీస్ శాఖకు మారారు.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన యూరప్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను చూసి ఎంతో మెచ్చుకున్నారు. దానికి తోడు ఆమెకు సహజంగానే పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కువ. అటువంటి ప్రదర్శనశాలలు మన దేశంలో కూడా ఏర్పాటు చేయాలని ఆమె ఆలోచన చేశారు. ఢిల్లీ లో ఒకటి, భోపాల్ లో ఒకటి నెలకొల్పేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ను అమలు చేసేందుకు కొంతమంది మ్యూజియం ప్రొఫెషనల్స్, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా 1974 లో కేవలం 37 ఏళ్ళ వయసుకే ఈ వినూత్న ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఎస్.యం నాయర్ ఎంపిక కావడం జరిగింది.

Dr. Nair and Mrs. Gandhi at NMNH
Dr. Nair and Mrs. Gandhi at NMNH

తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ మ్యూజియంల గురించిన ప్రణాళిక రూపకల్పన, అమలుతో ఎంతో ఒత్తిడితో గడిచిపోయాయి. శ్రీ డిపి సింగ్, ఎస్.కె. సరస్వత్, బి. వేణుగోపాల్, ఇంకెంతో మంది అంకితభావం కల ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్ట్ పై ఎంతో కృషి చేశారు. డాక్టర్ నాయర్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాలలను సందర్శించారు. ప్రపంచంలోని అత్యుత్తమైన సంస్థలలో తన బృంద సభ్యులకు శిక్షణ ఇప్పించారు. మొత్తానికి 1978 జూన్ ఐదు (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) నాడు జాతీయ ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల తలుపులు ప్రజల కోసం తెరుచుకున్నాయి. తర్వాత కాలంలో డాక్టర్ నాయర్ మార్గదర్శకత్వంలో మైసూర్, భోపాల్, భువనేశ్వర్ లలో ప్రాంతీయ ప్రదర్శనశాలలు కూడా ప్రారంభమయ్యాయి.  

ఢిల్లీ లో ఈ జాతీయ ప్రదర్శనశాల ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఖడ్గమృగం ఢిల్లీ లో పెరిగిన పిల్లలందరి జ్ఞాపకాలలో తప్పకుండా ఉంటుంది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో సహజంగా మరణించిన ఖడ్గమృగ కళేబరాన్ని తెచ్చి అది పాడవుకుండా రసాయనాలు వాడి ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.

జాతీయ ప్రదర్శన శాల ప్రారంభమయిన నాటి నుండీ బడి పిల్లలకోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. మిగిలిన అన్ని మ్యూజియంలు వస్తువులు ప్రదర్శనకు పెట్టి ఊరుకుంటే అందుకు భిన్నంగా ఈ ప్రదర్శన శాల స్వయంగా ప్రజలలోకి, పిల్లలలోకి వెళ్లి వారిని మ్యూజియం కార్యక్రమాలలో భాగమయ్యేలా చేసేది. అప్పటిలో ఎన్నో పాఠశాలలో ఉపాధ్యాయులకు పర్యావరణం పట్ల ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది.   

మ్యూజియం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో డాక్టర్ నాయర్ స్వయంగా పాల్గొనేవారు. తొంభైలలో ఉద్యోగ విరమణ చేసే వరకు ఆయన తన ఉద్యోగ తొలినాళ్లలో ఉన్న ఉత్సాహాన్నే కొనసాగిస్తూ పనిచేశారు. 2016 ఏప్రిల్ 26 న మ్యూజియంలో అగ్నిప్రమాదం జరిగి అందులో పొందుపరచిన జంతు, జీవజాలాల శిలాజాలన్నీ తగలబడిపోయాయన్న వార్త ఆయనను ఎంత బాధ పెట్టి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

డాక్టర్ నాయర్ తన ఉద్యోగ విరమణ తర్వాత కూడా పర్యావరణ విద్య మీద చురుకుగా పనిచేస్తూనే వచ్చారు. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్-ఇండియా, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వంటి ప్రఖ్యాత సంస్థలలో పనిచేశారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎంతో గౌరవాన్ని, గుర్తింపును పొందారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో నాచురల్ హిస్టరీ మ్యూజియం కమిటీ చైర్మన్ గా, ఇండో-యు.ఎస్. సబ్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ లోని జాయింట్ మ్యూజియం కమిటీ సభ్యునిగా కూడా ఆయన తన సేవలు అందించారు.

‘అంతరించిపోతున్న జంతుజాలం, వాటి సంరక్షణ’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించగా ఆగం కళా ప్రకాశన్ సంస్థ ఆయన మరొక పుస్తకం ‘బయో డీటీరియరేషన్ ఆఫ్ మ్యూజియం మెటీరియల్స్’ ను ప్రచురించింది. 

భారతదేశంలో పర్యావరణ విద్యను ఒక ఉద్యమంగా రూపొందించిన తొలితరం మార్గదర్శకులుగా డాక్టర్ నాయర్ మాకు ఎనభైల కాలం నుండి తెలుసు.

నేను పని చేసిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా, తర్వాత సీనియర్ కొలీగ్ గా ఆయన మాకు చూపించిన దారి మరువలేనిది. ఒక చిన్న స్వచ్చంద సంస్థగా ప్రారంభమయిన తొలినాళ్లలో ఈ సంస్థలో  పనిచేసిన వారందరికీ ఆయన అన్నా, ఆయన నెలకొల్పిన మ్యూజియం అన్నా అపారమైన గౌరవం ఉంది. వేరే ఏ ప్రాజెక్ట్ లు లేని తొలినాళ్లలో ఈ సంస్థ యొక్క, అక్కడి సిబ్బంది యొక్క సామర్ధ్యాన్ని గుర్తించి మ్యూజియంకు సంబంధించి ఎక్సిబిట్లు తయారు చేసే పనిని వారికి అప్పగించడం ద్వారా వారిలో ఎంతో స్ఫూర్తిని, ఆశను కలిగించారు. కొన్ని నెలల పాటు సిబ్బంది జీతభత్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా సమకూరడమే కాకుండా మొదటిసారి ఒక జాతీయ స్థాయి సంస్థకు పనిచేసిన అనుభవం కూడా సంస్థకు కలిగింది. అది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

మాతో పనిచేసిన మీనా తండ్రిగా కూడా మాకు ఆయనతో పరిచయం ఉంది. ఆమె కూడా తండ్రి బాటలోనే పర్యావరణ పరిరక్షణ రంగంలోనే తన కెరీర్ ను ఎంపిక చేసుకుంది. 

ఒక తరం పిల్లలలో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచిన జాతీయ మ్యూజియం ఇప్పుడు లేదు. కానీ డాక్టర్ నాయర్ స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 1937 నుండి 2021 వరకు జీవించిన డాక్టర్ నాయర్ గత వారం మరణించారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ

Post 39

–Based on a piece by Meena

వేయి పూలు వికసించనీ: Millefiori

నా చిన్న వయసులో నాన్నతో కలిసి అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుండేదానిని. అక్కడ నాకు అద్భుతంగా తోచిన అనేక విషయాలలో అక్కడ పని చేసేవారందరి టేబుల్స్ పైన ఉండే పేపర్ వెయిట్ ఒకటి. ఫ్యాన్ గాలికి పేపర్లు ఎగిరిపోకుండా వాటిపైన ఈ పేపర్ వెయిట్ లు పెట్టేవారు. 

ప్రతిఒక్కటీ ఒక విభిన్నమైన డిజైన్ లో, విభిన్నమైన రంగులలో ఎంతో అందంగా ఉండేది. ఇంత అందమైన ఆకృతులు ఆ గ్లాస్ డోమ్ లోపలికి ఎలా వెళ్లాయా అని నాకు ఆశ్చర్యంగా ఉండేది.

ఈ మధ్య నా టేబుల్ సొరుగులో దేనికోసమో వెతుకుతుంటే ఒక పాత పేపర్ వెయిట్ బయటపడింది. చిన్నతనంలో నాకు ఆశ్చర్యాన్ని, ప్రశ్నలను మిగిల్చిన ఆ పేపర్ వెయిట్ ల గురించి చదువుదాం అనుకున్నాను.

Millefiori paperweight
Millefiori paperweight

పేపర్ వెయిట్ ల లోపల అందమైన పూల కళాకృతులను చెక్కే ఈ ప్రక్రియను ‘మిల్లెఫీరి’ అంటారట. ఇటాలియన్ భాషలో వేయి పూలు అని దీని అర్ధం. పురాతన ఈజిప్ట్ లో ఈ ప్రక్రియ పుట్టిందనీ, బహుశా ప్రాచీన రోమన్ కాలం నుండి వీటిని తయారు చేస్తున్నారని తెలుస్తుంది. దాదాపు 5 వ శతాబ్దం నాటి నమూనాలు కూడా ఇంకా లభ్యమవుతున్నాయి. అయితే ఈ నైపుణ్యం మధ్యలో కొంతకాలం మరుగునపడి 19వ శతాబ్దం లో మురానో గ్లాస్ ఆర్టిస్ట్ ల కృషి వలన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వింసెంజో మోరెట్టి అనే కళాకారుడు ఎన్నో ఏళ్ళ పాటు శ్రమించి ఈ కలలో అత్యద్భుతమైన నైపుణ్యం సాధించాడు. ‘మిల్లెఫీరి’ పదం తొలిసారిగా 1849 లో ఆక్సఫర్డ్ డిక్షనరీ లో చోటు సంపాదించుకుంది.

కరగబెట్టిన రంగు రంగుల గాజు ముక్కలను పొరలు పొరలుగా వేసి ఒక స్థూపాకార ఆకృతిలోకి దానిని మలుచుతారు. తర్వాత ఇద్దరు కళాకారులు దానిని చెరోవైపు పట్టుకుని లాగుతూ ఒకరి నుండి ఒకరు దూరంగా వెళ్తూ ఉంటే అది ఒక పొడవైన రాడ్ లాగా తయారు అవుతుంది. ఆ రాడ్ ను రకరకాల ఆకృతులలో ముక్కలుగా కత్తిరిస్తారు. ప్రతి ముక్కను ఒక మురైన్ అంటారు. అలాంటి ఎన్నో మురైన్ లను ఒక నిర్దిష్ట డిజైన్లోకి మలిచి గాజు డోమ్ లో అమరుస్తారు. దానితో పేపర్ వెయిట్ లు, ఫ్లవర్ వేజ్ లు, ఉంగరాలు, లాకెట్ లు, డెకొరేటివ్ వస్తువులు ఎన్నో తయారు చేయవచ్చు.

ఈ కళ కేవలం కంటికి ఇంపైన ఆకృతులకు సంబంధించింది మాత్రమే కాదు. సున్నితమైన గాజుతో అత్యంత ఖచ్చితత్వం తో తయారు చేయాల్సిన అరుదైన, ఉన్నతస్థాయి నైపుణ్యం. పేపర్ వెయిట్ లలో ఎక్కువగా పువ్వుల ఆకృతులే కనిపించినప్పటికీ జామెట్రికల్ ఆకారాలు, పురుగుల ఆకృతులతో తయారు చేసిన పేపర్ వెయిట్ లు కూడా మార్కెట్ లో దొరుకుతాయి. 

ఇప్పుడు ఈ పేపర్ వెయిట్ లు అంత ఎక్కువగా వాడటం లేదు. కానీ ఆసక్తి ఉన్నవారి సేకరణల జాబితాలో చేరిపోయాయి. క్రిస్టీ లాంటి వ్యక్తులు కొన్ని అరుదైన పేపర్ వెయిట్ లను వేలం వేయడం కూడా చూస్తున్నాం. 

నా టేబుల్ సొరుగులో దొరికిన పేపర్ వెయిట్ అడుగున కొంచెం విరిగింది. అయినా రోజూ వాడటానికి బాగానే ఉపయోగపడుతుంది. దానిని అలా రోజూ టేబుల్ పైన చూడటం కొన్ని జ్ఞాపకాలను, సంతోషాన్ని అందిస్తుంది. 

Post 38

Based on a piece by Meena