ఇలాబెన్ భట్ (1933 – 2022) 

గాంధేయ వాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, ఉమెన్ వరల్డ్ బ్యాంక్ సహ-స్థాపకురాలు, గుజరాత్  విద్యాపీఠం గౌరవాధ్యక్షురాలు, గాంధీ ఆశ్రమ ట్రస్టీ, రామన్ మెగసెసే – ది రైట్ లైవ్లీహూడ్, పద్మ విభూషణ్  వంటి ఎన్నో విలక్షణ పురస్కారాల గ్రహీత. అన్నింటికీ మించి తనదైన నిరాడంబరతకు, అసాధరణ స్ఫూర్తికి చెరగని ప్రతీక. డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసేవారికి ఎంతో సుపరిచితమైన పేరు. 

ఇలా తో ఒక్కసారి మాట్లాడిన ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులు అవుతారు. ఆమె వ్యక్తిత్వంలోని సరళత, ముక్కుసూటితనం, పని పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఇందుకు ప్రధాన కారణాలు. అసంఘటిత రంగంలోని మహిళల ఆర్థిక సాధికారతకై వారు చేసిన కృషి, పాటించిన నిబద్ధత ఆమెను ఆ దిశలో నడిచిన ఒక అనంతమైన తారగా ఎల్లపుడు నిలబెడతాయి. ఒక మృదుభాషి ఈ ప్రపంచంలో నింపిన వెలుగుకి తెచ్చిన మార్పుకి ఇంకో పేరే ఇలా.   

ఇలా తో సంభాషణల  సారాన్ని, వి రఘునాథన్ గారు వారి పుస్తకం “డోంట్ స్ప్రింట్ ది మారథాన్” లో చర్చించటం జరిగింది. అందులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనందరి కోసం;

Ela Bhatt

‘ఇలా తన స్కూల్లో కాని, కాలేజీలో కాని మొదటి ర్యాంకు విద్యార్థి ఏమి కాదు, ఒక 10 పర్సెంటైల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచేవారామె. కేవలం మార్కుల కోసం చదివే మార్గంలో తనను ఎవరు నడపాలనుకొలేదు కూడా. ఇలా భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆమె తండ్రి వేసవి సెలవుల్లో చదవడానికి వివిధ రకాల పుస్తకాలు ఇష్టంగా కొనిపెట్టేవారు, వాటిని తను అంతే ఆసక్తిగా చదివేవారు. తనలో విలక్షణంగా కనిపించే విలువలు-సిద్ధాంతాలకు రూపురేఖ, కేవలం తన హైలీ ప్రిన్సిపల్డ్ నాన్న నుంచే కాకుండ అప్పుడు నెలకొన్న జాతీయవాద వాతావరణం నుంచి ఆమె గ్రహించారు. బ్రిటిష్ పాలనా చెరలనుండి విముక్తి కోసం పోరాడుతూ గెలుపు కోసం వేచి చూస్తున్న హృదయాలలో గాంధీజీ బోధన, సందేశాలకి, జీవనశైలికి, పిలుపుకి స్పందిస్తున్న భారత దేశ నీడలో పెరిగారు ఇలా.  

చిన్నతనంలోనే ఇలా న్యాయ-అన్యాయాల పట్ల విచక్షణ కలిగిఉండి  వెనుకబడిన వారి పై జరిగే దోపిడిని సహించేది కాదు.

మహిళా ఉద్యమాల్లో తన తల్లి పోషించిన పాత్ర చిన్నారి ఇలా మనసులో బలంగా నిలిచిపొయింది. మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె నేరుగా గ్రహించారు. మహిళలు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నపటికీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న  వేతన మరియు ఎన్నో రకాల అసమానతల్ని పరిశీలిస్తూ వచ్చింది. వ్యవసాయ రంగం లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వారిని రైతులుగా గుర్తించకుండా, రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లని గమనిస్తూ వచ్చింది.

అసమానతల పట్ల నిత్యం అవగాహన కలిగి ఉండే దృష్టికోణం దానికి బలంగా ముడిపడున్న తన వ్యక్తిత్వం, భవిష్యత్తు రెండూ తన తల్లిదండ్రుల నుంచి అలవడి ఉంటాయి. ఇలా వ్యక్తిత్వాన్ని చూసిన ఎవరికైనా తెలుసు వారు నిర్భలులకు ఒక దృఢమైన గొంతుక అని.’

ఇలా లోని వినయం, సున్నితతత్వం చూపే ఒక చిన్ని ఉదాహరణ వారు రచించిన పుస్తకం ‘వి ఆర్ పూర్, బట్ సో మెనీ లోని పరిచయ వాక్యాలలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన వాక్యాలలో: 

“స్వయం ఉపాధి పనులు చేసే పేద మహిళల జీవితాల గురించి రాసే క్రమంలో నేను ఎంతో కొంత అహంకారాన్ని ప్రదర్శించాను. నేను వారి గురించిన రాసిన విషయాలను చదవలేని మహిళల గురించి ఈ పుస్తకం రాసాను. అదే కాక నాకున్న అవగాహన చాలా పరిమితమైనది, అది నేను ఉన్న ఆర్ధిక-సామాజిక వర్గాల నుంచి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను రాసిన మహిళల కోసం పూర్తిగా మాట్లాడుతున్నానని ఎన్నటికీ చెప్పలేను, ఎందుకంటే నేను నా కోసమే మాట్లాడగలను.” స్వయం ఉపాధితో జీవనం గడిపే మహిళల కోసం తన జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను, ప్రశంసలను అందుకున్న ఇలా ఈ విధంగా మాట్లాడటం ఆమెలోని వినమ్రతకు నిదర్శనం..    

ఆమె ఒక నిరంతర స్ఫూర్తి.

ఓం శాంతి.

– మీనా 

Based on a piece by Meena Raghunathan

తొలితరం మహిళా ఇంజనీర్: లలిత: Engineer A. Lalitha

దేశంలోని అత్యున్నత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అయిన సెప్టెంబర్ 15 ను ఇంజనీరింగ్ డే గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో కృషి చేసిన విశ్వేశ్వరయ్య వరదలను అరికట్టే నిర్మాణాలకు రూపకల్పన చేయడం, డాం లు రిసర్వాయిర్ ల నిర్మాణం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆయన ప్రారంభించిన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలువబడుతుంది.

ఈ రోజు దేశంలో వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుండి ప్రతి ఏటా వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు బయటకి వస్తున్నారు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో వింత కాదు కానీ కొన్నేళ్ల క్రితం వరకూ అది ఆడపిల్లలకు సంబంధించిన రంగం కాదు. ఏ ఆడపిల్లా నడవడానికి సాహసించని ఈ దారిలో నడిచిన తొలితరం అమ్మాయిలలో ఎ. లలిత ఒకరు. ఈ ఇంజనీరింగ్ డే ఆమెను గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం.

1919 ఆగస్టు 27 న ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో ఏడుగురు పిల్లలలో ఒకరిగా లలిత జన్మించారు. ఆమె తండ్రి ఇంజనీర్. కొంత విశాల దృక్పధం కలిగిన వాడైనప్పటికీ పిల్లల పెంపకం విషయంలో సమాజ కట్టుబాట్లను మీరడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఆ కుటుంబంలో అబ్బాయిలు అంతా ఉన్నత చదువులకు వెళితే అమ్మాయిలకు మాత్రం ప్రాధమిక స్థాయి వరకు చదువుకోగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. లలితకు కూడా 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. కాకపోతే ఆమె పెళ్ళి తర్వాత కూడా పదవ తరగతి వరకు చదువుకునేందుకు ఆమె తండ్రి ఏర్పాట్లు చేశారు.

అయితే దురదృష్టవశాత్తూ ఆమె వివాహ జీవితం ఎంతో కాలం సాగలేదు. ఆమెకు 18 సంవత్సరాల వయసులో భర్త మరణించారు. అప్పటికే ఆమెకు చిన్న పాప ఉంది. నాలుగు నెలల పాపతో చిన్న వయసులోనే విధవగా మారిందామె. ఆ రోజుల్లో విధవల పట్ల సమాజం ఎంతో వివక్ష చూపించేది. అయితే లలితలోని పోరాట గుణం ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించేలా చేసింది.

పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పెద్ద చదువులు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంది. ఆమె తండ్రి అందుకు మద్దతు ఇచ్చారు. మద్రాస్ లోని క్వీన్ మేరీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది లలిత. ఆ తరువాత ఇక ఆమె వెనుకడుగు వేయలేదు.

ఆ రోజుల్లో స్త్రీలు చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఆ మెడికల్ రంగంలోకి వెళితే తాను తన కూతురికి తగిన సమయం ఇవ్వలేనేమో అని లలిత అనుకుంది. తన కుటుంబంలో అనేకమంది ఇంజినీర్లు ఉండడంతో తాను కూడా ఇంజనీర్ అయితే అనే ఆలోచన వచ్చింది. అయితే అప్పటికి మనదేశంలో ఇంజనీరింగ్ విద్య ఇంకా తొలిదశలోనే ఉంది. మహిళలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది అసలు కలలో కూడా ఊహించని విషయం. ఏ యూనివర్సిటీ మహిళలకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చేది కాదు. ఈ విషయంలో మళ్ళీ ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఆమెకు సహకరించారు. గుండీ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ చాకో ను ఒప్పించి ఆమెకు ఇంజనీరింగ్ లో ప్రవేశం కల్పించారు. డైరెక్టర్, ఇన్స్ట్రుక్షన్ కు కూడా దరఖాస్తు పంపి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ కాలేజీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చారు. లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు.

ఆ విధంగా వందలాది మంది అబ్బాయిలు మాత్రమే ఉన్న కళాశాలలో ఒకే ఒక్క మహిళా విద్యార్థిగా లలిత చేరారు. అయితే ఆమెకు అది ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. ఆమెకోసం ఒక ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆమె కూతురిని తన అన్న ఇంటిలో వదిలి వచ్చారు. ప్రతి వారాంతం వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేవారు. ఆమె కళాశాల జీవితం, విద్యాభ్యాసం మొదట బాగానే ఉన్నా కొన్నిరోజులకి తాను అక్కడ ఒంటరిదానిని అనే భావన ఆమెలో మొదలయ్యింది. అదే సమయంలో ఆమె తండ్రి మరింత మంది మహిళలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఇవ్వమని కళాశాల అధికారులను ఒప్పించారు. కళాశాల వారిచ్చిన ప్రకటన చూసి తర్వాత ఏడాది సివిల్ ఇంజనీరింగ్ లో లీలమ్మ జార్జ్, పికె త్రెసియా అనే మరో ఇద్దరు మహిళలు చేరారు.

అప్పటి నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ విద్యను అభ్యసించవలసి ఉంటుంది. లలిత జమల్పూర్ రైల్వే వర్కుషాప్ లో తన ఏడాది అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసుకుని 1943 లో ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత ఏడాది అప్రెంటిస్ షిప్ నిబంధన ఎత్తివేయడంతో ఆమె జూనియర్ మహిళా ఇంజినీర్లు  ఇద్దరూ కూడా అదే ఏడాది పట్టా పొందారు.

అప్పటికే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చిన లలిత ఇక ప్రొఫెషనల్ గా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే తన కుమార్తె శ్యామల తన మొదటి ప్రాధాన్యతగా భావించిన లలిత ఆమె సంరక్షణకు ఇబ్బందికలగని విధంగా ఉండే ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్స్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాక తన తండ్రికి పరిశోధనలలో సహాయం చేసేందుకు గానూ చెన్నై కు మారింది. ఆ పరిశోధనలు తన మేధస్సును పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ ఆర్ధిక ఒత్తిడుల కారణంగా వాటిని మధ్యలో వదిలి మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేందుకు కలకత్తా వెళ్ళింది. మళ్ళీ ఆమె కూతురి సంరక్షణ బాధ్యత వాళ్ళ అన్న తీసుకున్నారు.

అక్కడ తాను నేర్చుకున్న విద్యనంతా పనిలో ప్రదర్శించే అవకాశం లలితకు కలిగింది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో సహా అనేక భారీ ప్రాజెక్ట్ లకు ఆమె పని చేశారు. ట్రాన్స్మిషన్  లైన్లు, సబ్ స్టేషన్ లేఔట్, రక్షణ పరికరాలు డిజైన్ చేయడం లలిత పని. ఆమె మేధస్సు, శక్తీ సామర్ధ్యాలు ఈ సమయంలో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

1953 లో లండన్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆమెను అసోసియేట్ మెంబెర్ గా తన కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. చక్కని చీరకట్టులో లండన్ లోని ఫ్యాక్టరీ ని సందర్శించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 1964 లో న్యూయార్క్ లో జరిగిన తొలి ఇంజినీర్లు, శాస్త్రవేత్తల అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందింది. ఇటువంటి సదస్సుకు హాజరయిన తొలి భారతీయ మహిళా ఇంజనీర్ ఆమె. ఆ తర్వాత కాలంలో ఆమె ఎన్నో మహిళా ఇంజినీర్ల సంస్థలలో సభ్యురాలిగా కొనసాగారు. లండన్ లోని విమెన్ ఇంజనీరింగ్ సొసైటీ లో కూడా 1965 లో సభ్యత్వం పొందారు.

1977 లో పదవీ విరమణ చేసేవరకు లలిత అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ అసోసియేట్స్ (తర్వాత కాలంలో దీనిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ టేకోవర్ చేసింది) లోనే కొనసాగారు. మహిళలకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాలలోకి బాట వేసిన తొలి తరం మహిళలలో లలిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమె కూతురు శ్యామల కూడా తల్లి లాగానే సైన్స్, మాథెమాటిక్స్ చదువుకుని మాథెమాటిక్స్ టీచింగ్ లో స్థిరపడ్డారు. తన తల్లి జీవితం, పని నుండి తాను ఏమి నేర్చుకున్నదో శ్యామల ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. “ఆమె జీవితం నుండి నేను నేర్చుకున్నది అంతులేని ఓర్పు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నాణ్యమైన పని చేయడంపై దృష్టి. ఇతరులు మన జీవితంలోకి ఏదో ఒక కారణంతోనే వస్తారు, ఆ వచ్చిన ప్రయోజనం నెరవేరగానే మన జీవితం నుండి వెళ్ళిపోతారు అనే వారు ఆమె” .

రిటైర్ అయిన కొద్దికాలానికే 1979 లో తన అరవై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో లలిత మరణించారు. ఈ రోజున ఎంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కెరీర్ చేపడుతున్నప్పటికీ అందుకు దారి వేసిన ఇటువంటి మహిళల దీక్ష, పట్టుదల గురించి చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తల్లిగా తన బాధ్యతలను ఒంటి చేత్తో లాగుతూనే అటు చదువులో ప్రతిభను కనపరచడమే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన లలితను ఈ సందర్భంలో స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

Based on a piece by Mamata